Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిండా మునిగిన సోయా రైతు
- పొలాల్లో మోకాళ్లలోతు నీరు
- మోటార్లతో నీటిని తోడుతున్న అన్నదాత
- కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయం
నవతెలంగాణ- నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఈ వర్షాకాలం సీజన్లో సోయా సాగు రైతాంగం నిండా మునిగింది. ఎడతెరపి లేని వర్షాల వల్ల పొలాలన్నీ మోకాళ్లోతు నీటితో నిండాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా పంటంతా నీటిపాలైంది. ఇప్పటికీ పొలాల్లో మోకాళ్లలోతు నీరుంది. పంటను కాపాడుకునేందుకు రైతులు మోటార్లు పెట్టి మరీ నీళ్లు తోడేస్తున్నా.. సాయంత్రానికి మళ్లీ వర్షం కురుస్తుండటంతో పరిస్థితి మొదటికొస్తోంది. దీంతో రైతులు కన్నీంటి పర్యంతమవుతున్నారు. సాధారణంగా ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కానీ, ఇప్పుడు రెండు నుంచి మూడు క్వింటాళ్లు వచ్చినా గగనంగానే ఉంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వరి తరువాత అత్యధికంగా సోయా పంట సాగు చేస్తారు. ఈ పంట ఆరుతడి కావడంతో కంది, పత్తిలో అంతర్పంటగా కూడా వేశారు. ఈ వర్షాకాలం సీజన్ లో నిజామాబాద్లో 73,404 ఎకరాల్లో, కామారెడ్డిలో 83 వేల ఎకరాల్లో పంట సాగు చేశారు. జూన్, జులైలో సాగు చేస్తే సెప్టెంబర్, అక్టోబర్ నాటికి కోతకు వస్తుంది. విత్తనాలు, మందుల పిచికారీ, కూలీల ఖర్చుకు ఎకరాకు సగటున రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడి అవుతుంది. కానీ ఈ యేడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సెప్టెంబర్ 15వ తేదీ నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సరిగ్గా సోయా పంట కోతకు వచ్చే సమయంలో వర్షాల కారణంగా పంటంతా నీట మునిగింది. పొలాల్లోనే సోయా గింజలు మొలకలు వస్తున్నాయి. గింజ నల్లబడి, పంటంతా దుర్వాసన వెదజల్లు తోంది. రైతుల పొలాల్లో మోకాళ్లలోతు నీరు చేరింది. నీటిలోనే పంట కోసుకుందామన్నా బురద వల్ల కోత మిషన్లు కూడా పోవడానికి లేకుండాఉంది. ఎకరాకు పెట్టిన పెట్టు బడి 20వేల చొప్పున లెక్కించినా ఐదెకరాలు ఉన్న సాధారణ రైతు రూ.లక్ష మునిగాడు. రెక్కల కష్టం అలాగే ఉంది.
పొలాల్లో మోటార్లు..
రైతులు పంటను కాపాడుకునేందుకు చివరి యత్నంగా పొలాల్లోని నీటిని తోడేస్తున్నారు. గంటకు రూ.200 కిరాయితో మోటార్లను తీసుకొచ్చి రెండు లీటర్ల పెట్రోలు వ్యయం చేసి నీళ్లుతోడేస్తున్నారు. ఐదారు గంటల పాటు కష్టపడి నీటిని తోడేస్తే.. సాయంత్రం మళ్లీ వర్షం పడుతుండటంతో పరిస్థితి మొదటికొస్తోంది. బిచ్కుంద మండలం పెద్ద తక్కలపల్లి, చిన్న తక్కలపల్లిలో రైతులు అవస్థలను 'నవతెలంగాణ' క్షేత్రస్థాయిలో పరిశీలించింది. అలాగే, మద్నూర్లోని లెండివాగు పరివాహక గ్రామాలు గోజేగావ్, సోనాల, తడి, హిప్పారా, లింబూరు, హాసన్టాక్లి ఇలా పలుగ్రామాల్లో సోయా పంటంతా నీళ్లలో తేలాడుతోంది.
కౌలు రైతుల పరిస్థితి అధ్వానం
సోయా సాగు చేసిన కౌలు రైతుల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలో ఎకరానికి కౌలు రూ.15 వేల నుంచి రూ.25 వేలు ఉంది. భూమి లేని చిన్న, సన్నకారు రైతులు భూయజమా నుల నుంచి ప్రతియేటా కౌలుకు తీసుకుంటున్నారు. కామారెడ్డి, నిజామాబాద్లో కౌలు డబ్బు ముందుగానే అడ్వాన్స్గా చెల్లించాలి. అయితేనే, యజమానులు భూమి కౌలుకు ఇస్తారు. నాలుగెకరాలు కౌలు తీసుకున్న రైతు.. సగటున ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిగణించినా రూ.80 వేలు చెల్లించాడు. పంట పెట్టుబడి కోసం మరో రూ.80 వేలు ఖర్చు చేశాడు. ఇలా మొత్తం పెట్టుబడిగా పెట్టిన రూ.లక్షా 60 వేలు వర్షార్పణమయ్యాయి. అయితే, పంట నష్టంపై వ్యవసాయాధికారులు అంచనాలు రూపొందించడంలో తీవ్ర తాత్సారం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించలేదని వాపోతున్నారు.
ఆరు ఎకరాల్లో నష్టపోయా..
నాకున్న ఆరెకరాల్లో సోయా సాగు చేశాను. ఎకరానికి రూ.20 వేల చొప్పున లక్షా 20 వేల వరకు ఖర్చు అయింది. పంట కోత కొద్దామనే సమయానికి వర్షాలు కురిశాయి. మోకాళ్ల లోతు నీరు చేరింది. పంటంతా కొట్టుకుపోయింది.
- హన్మంత్ పటేల్ (బిజ్జల్వాడి)
ఐదెకరాల భూమి తాకట్టు పెట్టి అప్పు తెచ్చా
ఐడెకరాల భూమి తాకట్టు పెట్టి పంట పెట్టుబడి కోసం అప్పు తెచ్చాను. సోయా మూడెకరాలు, పెసర రెండెక రాల్లో సాగు చేశాను. వర్షాలకు పంటంతా పోయింది. పెసర నల్లబారి బూజుపట్టింది. లక్షా 2వేల వరకు పెట్టు బడి పెట్టాను. ఈ యేడాది రాష్ట్ర ప్రభుత్వం పంట బీమా చేయించేందుకు కూడా ముందుకు రాలేదు. అప్పులు ఎలా కట్టాలో అర్థమవడం లేదు.
- రైతు వీరేశం (నాహల్గావ్, మద్నూర్)- కామారెడ్డి
ప్రాథమిక నివేదిక పంపాం..
ఈయేడాది వర్షాలకు సోయాపంటకు తీవ్రనష్టం వాటి ల్లింది. కామారెడ్డి జిల్లా పంట నష్టంపై ప్రాథమిక నివేదిక రూపొందించి రాష్ట్ర కేంద్రానికి పంపాం. ఏ రైతు ఎంత మేరనష్టపోయాడు అనే పూర్తిస్థాయివిచారణ చేపడుతు న్నాం. మండలాల నుంచి ఆ నివేదికలు రావాల్సి ఉంది.
- జిల్లా ఇన్చార్జి వ్యవసాయాధికారి సునీత(కామారెడ్డి)