Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో ప్రొఫెసర్ కె నాగేశ్వర్
- స్వతంత్ర అభ్యర్థిగానే రంగంలోకి...
- ప్రజల గొంతుకగానే మాట్లాడతా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహబూబ్నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్ట భద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తారా? లేదా? అన్న ఉత్కంఠకు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ తెరదించారు. స్వతంత్ర అభ్యర్థిగానే మళ్లీ పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. 2007, 2009లో గెలిపించిన విధంగానే ఈ సారి కూడా ఆదరించాలని పట్టభద్రులను ఆయన కోరారు. 2021, ఫిబ్రవరి లేదా మార్చిలో జరిగే ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం కె నాగేశ్వర్ యూట్యూబ్ చానల్ ద్వారా ఆయన ప్రసంగించారు. స్వతంత్ర
అభ్యర్థిగానే బరి లోకి దిగుతానని వివరించారు. ఏదైనా రాజకీయ పార్టీ అభ్యర్థిగా నిలబడాలని అనుకుంటే రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలిచిన తాను ఇప్పటికే పార్లమెంటు సభ్యునిగా అయ్యే అవకాశముండేదని అన్నారు. తనకు ప్రలోభాలతో పదవుల పొందే ఆసక్తి లేదన్నారు. ప్రజల పక్షాన నిరంతరం మాట్లాడే గొంతుకగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై స్పందించి పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తానన్నారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉంటానన్నారు. నేడు రాజ్యాంగ వ్యవస్థలే తలకిందులు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అవకాశవాదం రాజ్యమేలుతున్నదని చెప్పారు. చట్టసభలు సమస్యలపై చర్చించకుండా రెస్టారెంట్లుగా మారిపోయాయని వ్యాఖ్యానించారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రజలను భ్రమల్లో ఉంచుతున్నారని అన్నారు. పౌరసమాజం ప్రతినిధిగా ప్రజా సమస్యలే ఆయుధాలుగా చేసుకుని పనిచేస్తానని అన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా, ఎవరున్నా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే తన లక్ష్యమని ప్రకటించారు. సమస్యలకు పరిష్కారాలను ప్రజల ముందు ఉంచుతానని అన్నారు. ప్రజా ఎన్నికల్లా, సామాన్యుల పండుగగా జనజాతరలా జరుపుదామని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల సమరం మొదలైందని చెప్పారు. దుశ్సాసనులు వస్తారనీ, ప్రలోభాలకు గురిచేస్తారనీ, తనపై తప్పుడు విషయాలను ప్రచారం చేస్తారనీ అన్నారు. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాల ద్వారా తన అభిప్రాయాలను నిరంతనం చెప్తానని వివరించారు. అనేక సంఘాలు, మేధావులతో చర్చిస్తున్నానని భవిష్యత్తులో ఆన్లైన్ సమావేశం నిర్వహిస్తానని చెప్పారు.
జర్నలిజంపై ఆసక్తితోనే పోటీ చేయలేదు
తనకు జర్నలిజం అంటే ఎంతో ఇష్టమని కె నాగేశ్వర్ చెప్పారు. జర్నలిజంపై ఆసక్తి, ఉపాధ్యాయ వృత్తిపై గౌరవంతోనే 2015లో మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేయలేదని స్పష్టం చేశారు. ఆరేండ్లు గడిచిపోయానని చెప్పారు. ఇప్పుడున్న ఎమ్మెల్సీలు పట్టభద్రుల సమస్యల కన్నా వారు ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీగా గెలిచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారని చెప్పారు. కానీ ప్రజాసమస్యలను చట్టసభలు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లేదని విమర్శించారు. నిరుద్యోగుల ఇబ్బందులు, ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీ, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను చర్చించడం లేదన్నారు. చట్టసభల్లో రాజకీయ గొడవలు తప్ప పట్టభద్రుల చుట్టూ రాజకీయం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మంచివాళ్ల మౌనం వల్లే చెడిపోతున్న సమాజం
'సికింద్రాబాద్ పికెట్ నుంచి పదో తరగతి చదివే ఓ విద్యార్థి నాకు ఫోన్ చేశాడు. సార్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారా? లేదా?అని అడిగారు. పోటీ చేయాలా? వద్దా అని డైలమాలో ఉన్నాను. ఆ విద్యార్థి ఓ మాట అన్నాడు. సమాజం చెడిపోతున్న దుష్టుల వల్ల కాదు, మంచివాళ్ల మౌనం వల్లేనని చెప్పాడు. ఓయూ నుంచి మరో విద్యార్థి ఫోన్ చేశాడు. నిరుద్యోగులు, ఉద్యోగ ప్రకటనల గురించి నేను అనేక విషయాలు చెప్పాను అన్నాడు. యే ఏడాదిలో విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ అదే ఏడాదిలో నియామకాలు పూర్తయ్యేలా చట్టం చేయాలని నేను గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశాడు. శాసనమండలికి వెళ్లి ఆ చట్టం కోసం పోరాడాలని అన్నాడు. ఆర్టీసీ సమ్మె సమయంలో నేను చెప్పిన విషయాలను ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తున్నదని ఓ కార్మికుడు ఫోన్ చేసి చెప్పాడు. ఎల్ఆర్ఎస్ గురించి అనేక విషయాలు చెప్పారని ఇంకొకరు వివరించారు. రాజకీయ పార్టీల నాయకులు చెప్పింది వినకపోయినా మీరు చెప్పింది కేసీఆర్ వింటారని మరొకరు అన్నారు. అనేక మంది మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రజాసంఘాల వారు ఎమ్మెల్సీగా పోటీ చేయాలని చెప్పారు. అందుకే ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను'అని కె నాగేశ్వర్ వివరించారు.గురువారం నుంచి ప్రారంభమవుతున్న పట్టభద్రుల ఓటర్లుగా ప్రతిఒక్కరూ పేర్లు నమోదు చేసుకోవాలని నాగేశ్వర్ సూచించారు.