Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వం కోల్పోయిన కుటుంబాలెన్నో...
- కళతప్పిన గ్రేటర్ హైదరాబాద్
- వర్షం వస్తుందంటేనే హడలిపోతున్న నగర ప్రజలు
నవతెలంగాణ- సిటీ బ్యూరో
కొద్దిరోజులుగా విడవకుండా కురుస్తున్న వానలకు హైదరా బాద్ నగరం కళ తప్పింది. ఏ మూలకెళ్లినా రోడ్లపై మోకాల్లోతు గుంటలు, చెత్తాచెదారం. వరద, బురదతో కాలనీలు కంపుకొడు తున్నాయి. గత మంగళవారం కురిసిన జడివాన నుంచి కోలుకుంటున్న సమయంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. భారీ వర్షానికి ప్రధాన రహదారులతో పాటు, ఇతర రోడ్లు జలమయమ య్యాయి. బస్తీలు, కాలనీలు నీటమునిగాయి. అపార్ట్మెంట్లలో పరిస్థితి దారుణంగా మారింది. సెల్లార్లన్నీ నీటితో నిండి పోయాయి. దిల్సుఖ్నగర్, సరూర్నగర్, కొత్తపేట రహదారిపై నీరు నిలిచి ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాంతో వరంగల్, యాదాద్రి, భువనగిరి, హైదరాబాద్కు వచ్చే వాహనాలను ఓఆర్ఆర్ మీదుగా దారి మళ్లించారు. లష్కర్గూడ చెరువు ఉధృతంగా ప్రవహించడంతో ఇనాంగూడ వద్ద హైదరాబాద్-విజయవాడ రహదారిపైకి నీరు చేరింది. ఎన్హెచ్ 65పై అబ్దుల్లాపూర్మెంట్, కొత్తగూడెం వరకు వాహనాలు నిలిచిపోయాయి. బాలాపూర్ చెరువు దిగువ భాగంలో ఉన్న రాయల్ కాలనీ, బడంగ్పేటలోని ప్రశాంత్నగర్, అల్మాస్గూడ పరిధిలోని పలు కాలనీలు, వనస్థలిపురంలోని హరిహరపురం నీట మునిగాయి. ఇండ్లలో చిక్కుకున్న ప్రజలను బల్దియా అధికారులు జేసీబీ, ట్రాక్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మల్కాజ్గిరి, జీడిమెట్ల, సికింద్రాబాద్, మారేడ్పల్లి, బేగంపేట, కూకట్పల్లి, ఖైరతాబాద్, చాదర్ఘాట్, నాంపల్లి, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో రోడ్లపై మోకాల్లోతు వరద ప్రవహిస్తోంది. పాతబస్తీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. టోలిచౌకి, చార్మినార్, పలక్నుమాతో పాటు పలు ప్రాంతాల్లో కాలనీలు వారం రోజులుగా నీట మునిగే ఉన్నాయి. నదీం కాలనీ, అహ్మద్ కాలనీ, చుడీ బజార్,ముస్లింగంజ్తో పాటు మూసీ పరివాహక కాలనీల్లో 10అడుగుల మేర వరద నిలిచిపోయింది. జల్పల్లి మున్సిపాలిటీలోని బుర్హాన్ పూర్ చెరువు నిండటంతో వెనుక ఉన్న ఉస్మాన్ నగర్, షాహీన్ నగర్ ప్రాంతం మంపునకు గురయ్యాయి. నగరంలో వర్షం వచ్చే సూచనలు కనిపిస్తేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు.
గోడకూలి ఒకరు..గుంతలో పడి చిన్నారి మృతి
రెండురోజుల కిందట భారీ వర్షానికి గగన్పహాడ్లో వరద నీటిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. వారిలో కరిమాబేగం, అమీర్ఖాన్, సాహిల్(4) మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆదివారం ఆయాన్(7) మృతదేహం లభ్యమైంది. గగన్పహాడ్ చౌరస్తాలోని సెలబ్రెటీ ఫంక్షన్ మాల్వద్ద చెట్ల పొదల్లో ఆయాన్ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మంగళ్హాట్లో గోడకూలి చిన్నారి జుబేదా (6) మృతి చెందింది. అదేవిధంగా జూబ్లీహిల్స్ రోడ్నెంబర్ 5లోని దుర్గాభవాని నగర్లో బాలుడు (3) నీటి గుంతలో పడి మృతి చెందాడు. పురానాఫూల్ మూసీ నదిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు.