Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునిగిన వేల ఎకరాల పంట..
- చేనులోనే మొలకెత్తుతున్న పత్తి
- మురిగిపోతున్న మొక్కజొన్న, వరి
- ఉమ్మడి మెదక్ జిల్లాలో రూ.505 కోట్లు నష్టం
- అధికారుల ప్రాథమిక అంచనా
నవతెలంగాణ-గజ్వేల్
చేతికాడికి వచ్చిన కూడు ఆకాల వర్షాల వరద ఉధృతికి నేలపాలైంది. నియంత్రిత సాగుతో పత్తినే నమ్ముకున్న రైతన్న నెత్తిపై అకాల వర్షాలతో పిడుగులు పడినట్టయింది. తిప్పలు పడి అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబడి మొత్తం వరదనీటిలో కొట్టుకుపోయింది. కోతకొచ్చిన వేల ఎకరాల వరి పంట నీటిలో మునిగిపోయింది. పదిరోజుల్లో తీద్దామనుకున్న పత్తి చేనులోనే మొలకలు పెడుతున్నది. కంకులు పెట్టాల్సిన మొక్కజొన్న నేలవాలి నీటిలో మురిగిపోతున్నది. వర్షం కాస్త తెరిపిచ్చినా నేటికీ నీట మునిగిన పంటలు పైకి తేలకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ఆదుకునే ఆపన్నహస్తం కోసం రైతలు గంపెడాశలు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితి సీఎం కేసీఆర్ ఇలాకాలో కావడం గమనార్హం.
ఉమ్మడి మెదక్ జిల్లాలో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టాలపాలయ్యారు. పంటలు ఏపుగా పెరిగి చేతికొచ్చిన తరుణంలోనే భారీ వర్షాలు కురవటం తో వాగులు.. వంjలు పొంగి పొలా లు నీట మునిగాయి. ముఖ్యంగా ఖరీఫ్ ప్రధాన పంటలైన పత్తి, వరి, మొక్కజొన్న బాగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సదాశివపేట, గజ్వేల్, అల్లాదుర్గం మండలాల్లోని మూడు గ్రామాలను పరిశీలించగా తీవ్ర స్థాయిలో నష్టపోయామని రైతులు వివరించారు. సిద్దిపేట జిల్లాలో 29 వేల ఎకరాల పత్తి పంట నష్టపోయినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అదే విధంగా 30 వేల ఎకరాల వరి, 17 వేల ఎకరాల్లో కంది, ఇతర పంటలు 1200 ఎకరాలున్నట్టు అధికారులు గుర్తించారు.
పత్తి నష్టం కోట్లలో..
ప్రధానంగా పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. సగటున ఒక్కో రైతు ఇప్పటి వరకు ఎకరాకు రూ. 30 వేల వరకు పెట్టుబడులు పెట్టి ఉంటారని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామంలో 348 రైతు కుటుంబాలకు చెందిన 549 ఎకరాల్లో పత్తి దాదాపు పూర్తిగా నష్టపోయారు. వీరు పెట్టిన పెట్టుబడి అక్షరాల రూ. 1.64 కోట్లు. ఇప్పుడదంతా నీటి పాలైంది. ఈ మండలంలో 7,107 ఎకరాల్లో పంట దెబ్బతింది. అంటే ఈ ఒక్క మండలంలోనే రైతులు పత్తి సాగు మీద పెట్టిన రూ. 21.32 కోట్ల పెట్టుబడి దక్కకుండా పోయింది. ఇక, సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో మొత్తం విస్తీర్ణంలో 90 శాతానికి పైగా పత్తి సాగే. వానల వల్ల 17 వేల ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతిందని వ్యవసాయాధికారులు గుర్తించారు.
ఈ ఒక్క మండలంలోనే రూ. 51 కోట్ల పెట్టుబడి నీటి పాలైంది. మండలంలోని ఆత్మ కూరు గ్రామంలో 2,600 ఎకరాల్లో పత్తి పండించగా, 1,700 ఎకరాల్లో దెబ్బతింది. ఈలెక్కన ఈ ఊరి రైతులు పెట్టిన పెట్టుబడి రూ.5.10 కోట్లు పోయినట్టే. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో 12 వేల ఎకరా ల్లో పత్తి దెబ్బతింది. దాదాపు రూ. 36 కోట్ల మేర పెట్టుబడి వర్షార్పణమైంది. ఈ మండలంలోని గడిపెద్దాపూర్ గ్రామంలో రైతులతో మాట్లాడగా 278 ఎకరాల్లో పంటలను నష్టపోయామని, పెట్టుబడి రూ.83 లక్షల దక్కకుండా పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లా లో వ్యవసాయాధికారుల పంట నష్టం అంచనాలను పరిశీలిస్తే రూ. 505 కోట్ల మేర నీటి పాలైనట్టు స్పష్టమవుతోంది. సాగు చేసిన పంటలు సుమారు 75 శాతం పంట చేతికి అందకుండా పోయిందని క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్న మాటలు. ఇలాం టి దయనీయ స్థితిలో ఉన్న తమను ఆదుకోవాలని అన్నదాతలు వేదన నిండిన కళ్లతో వేడుకుంటు న్నారు. ఈ తరుణంలో క్షేత్రస్థాయిలో నష్టం అంచ నాలను సమగ్రంగా రూపొందించి, దానికి అనుగు ణంగా రైతులను ఆదుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే కాస్త ఉపశమనం దక్కుతుంది.
పూర్తిగా నష్టపోయాం..
వానాకాలంలో వేసిన పంటలు పూర్తిగా నష్టపో యాం. ఎన్నడు చూడని వర్షాలు కురుస్తున్నాయి. రెండు ఎకరాలుండగా ఒక ఎకరంలో పత్తి, మరో ఎకరంలో వరి సాగు చేశాను. భారీ వర్షాలకు పత్తి నల్ల పడ్డది, వరి నేల మట్టమ యింది. అధికారులు గ్రామాలకు వచ్చి నష్టపోయిన రైతులను గుర్తించి పరిహారం ఇవ్వాలి.
- శంబని పెంటయ్య, రైతు
పెట్టుబడి కూడా వచ్చేటట్టు లేదు
చేతికొచ్చిన పంట నష్టపోయాను వరిసాగు చేస్తే వర్షానికి పూర్తిగా నేలమట్టం అయింది. వరి ధాన్యం రాలి పోయింది. ప్రభుత్వం నష్ట పోయిన రైతులను ఆదుకోవాలి. పెట్టుబడి కూడా చేతికి వచ్చే అవకాశం లేదు. ఎకరాకు రూ. 25 వేల వరకు ఖర్చు వచ్చింది. అందరూ రైతు లు నష్టపోయారు.
- మల్లయ్య, రైతు, మర్కుక్