Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టా పాస్ పుస్తకాలు అందించాలని డిమాండ్
- సుమారు 4 గంటల పాటు ఉద్రిక్త వాతావరణం
- తహసీల్దార్ను నిలదీసిన రైతులు
- ఆర్డీవో హామీతో నిరసన విరమణ
నవతెలంగాణ-బయ్యారం
తాము సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములకు ప్రభుత్వం మళ్లీ పట్టాదారు పాస్ బుక్కులు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ పది మంది రైతులు హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే, కలెక్టర్ వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వకుంటే టవర్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కస్తూరినగరంలో సోమవారం జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సుమారు 70 మంది రైతులు దాదాపు ఏడు దశాబ్దాలుగా 1500 ఎకరాల్లో పంటలు సాగు చేసుకుంటున్నారు. ఆ భూములకు గత ప్రభుత్వాలు పట్టాలిచ్చాయనీ, వాటి ఆధారంగా పంట రుణాలూ తీసుకున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక భూపక్షాళన పేరుతో ఆ భూములన్నిటినీ అటవీ భూములుగా నిర్ధారించి పట్టాలు రద్దు చేశారని వాపోయారు. 2005 తర్వాత గ్రామ సరిహద్దుల్లో సాగు చేసిన సుమారు 25 హెక్టార్ల భూమికి అటవీ శాఖ అధికారులు ట్రెంచ్ కొట్టి ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి భూమి లేక బజారున పడి కూలీలుగా బతుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రద్దు చేసిన పట్టాలను పునరుద్ధరించడంతో పాటు రైతుబంధు వర్తింపజేయాలని, బ్యాంకుల నుంచి పంట రుణాలు రెన్యూవల్ చేయించాలని బాధిత రైతులు కోరుతున్నారు.
ఘటనాస్థలికి చేరుకున్న తహసీల్దార్ తరంగిణి, సీఐ తిరుపతి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేందుకు యత్నిస్తామని చెప్పినా రైతులు శాంతించలేదు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే వచ్చి హామీ ఇస్తేనే టవర్ నుంచి దిగుతామని భీష్మించారు. ఈ క్రమంలో గ్రామస్తులకు, రెవెన్యూ అధికారులకు నడుమ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఆర్డీఓ కొమురయ్య ఘటనా స్థలానికి చేరుకుని అటవీ, రెవెన్యూ శాఖలతో భూములను జాయింట్ సర్వే చేయించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించి టవర్ దిగి వచ్చారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. టవరెక్కిన రైతులు.. బోడ రంగ్య, కేళోత్ యాకయ్య, భూక్యా రవి, భోడ శోభన్, ధారావత్ కేళి, మాళోతు బిచ్చు, బానోత్ రాములు, గుగులోతు హఛ్యా, బానోత్ మురళీ, మాళోతు నరేష్, కేళోత్ రాంబాబు, భూక్యా కోటేష్, బాణోతు హోలీ, ఆంగోతు యాకూబ్, బుచ్చమ్మ.. ఎమ్మెల్యే, కలెక్టర్ వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వకుంటే టవర్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. భూక్యా రవి పురుగుల మందు తాగడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.