Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్లో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్థికసాయాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. మంగళవారం ఉదయం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. పూర్తిగా ధ్వంసమైన ఇండ్లకు రూ.లక్ష, పాక్షికంగా కూలిపోయిన వాటికి రూ.50 వేల చొప్పున పరిహారమిస్తామని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌలిక వసతులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పేదలకు సాయమందించేందుకు వీలుగా రూ.550 కోట్లను మున్సిపల్ శాఖకు విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు.
గత వందేండ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షం హైదరాబాద్లో కురిసిందని సీఎం పేర్కొన్నారు. దీంతో ప్రజలు అనేక కష్టనష్టాలకు గురయ్యారని తెలిపారు. ముఖ్యంగా నిరు పేదలు, బస్తీల్లో నివసించేవారు, లోతట్టు ప్రాంత వాసులు ఎక్కువగా ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకోవటం ప్రభుత్వ ప్రాథమిక విధి అని తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల కలెక్టర్లు, వారి బృందాలు వెంటనే రంగంలోకి దిగి మంగళవారం ఉదయం నుంచే పేదలకు ఆర్థిక సాయాన్ని అందించాలని ఆదేశించారు. ఇందుకోసం 250 బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను ఆదేశించారు. వీటిలో పాల్గొనాలంటూ హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ను ఆదేశించారు. లక్ష మంది ఉన్నా సరే... సాయమందించటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. బాధిత కుటుంబాలకు చెందిన వారు తమ వివరాలను అధికారులకు చెప్పి... సాయాన్ని పొందాలని సూచించారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం కోరారు.