Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంచర్లకైతే ఓ రూలు.. సామాన్యులకు మరో రూలు
- 2015 నుంచి కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు
- ఇస్తారో.. ఇవ్వరో.. ఏదీ చెప్పరు..
- పెండింగ్లో 50వేలదరఖాస్తులు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఎల్ఆర్ఎస్....సామాన్యుడు తన నివాసస్థలాన్ని తానే మరోసారి కొనుక్కొనేలా చేసే సర్కారీ స్కీం...ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ స్కీం ప్రభుత్వాలకు కాసుల వర్షం కురిపించింది. ప్రత్యేకరాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే స్కీంను 2015లో ఒకసారి, 2020లో మరోసారి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఖజానాను నింపుకుంటున్నది. 2015లో ఈ స్కీం దరఖాస్తుల అమ్మకం ద్వారానే ప్రభుత్వానికి దాదాపు రూ.20 వేల కోట్ల సొమ్ము వచ్చింది. అప్పట్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుకు కనీస ఫీజుగా రూ.10వేలు నిర్ణయించారు. ప్రస్తుతం (2020)లో ఈ ఫీజును రూ.వెయ్యిగా నిర్ణయించారు. ఈనెల 16వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, హెచ్ఎండీఏ పరిధిలో మొత్తంగా 20,11,196 దరఖాస్తులు వచ్చాయి. దీనివల్ల ప్రభుత్వానికి ఇప్పటి వరకు దాదాపు రూ.201.19 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. దరఖాస్తుల తుది గడువును అక్టోబర్ 15 నుంచి 31వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే. ఆగస్టు 26వ తేదీ వరకు జరిగిన ఆస్తుల కొనుగోళ్లకు ఎల్ఆర్ఎస్స్కీం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.
సామాన్యుడికి చుక్కలు...
స్థలాలు, ఇండ్లు కొనుక్కోవాలంటే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు బ్యాంకు రుణాలు తప్పనిసరి. అవి రావా లంటే బ్యాంకర్లు ఎల్ఆర్ఎస్ను తప్పనిసరి చేసారు. దీనితో ప్రజల్లో ఈ స్కీం పట్ల ఆవగాహన పెరిగింది. 2015లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో 71,925, హెచ్ఎండిఏ పరిధిలో 1.75 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో కేవలం 30 శాతం ఆస్తు లకు సంబంధించి మాత్రమే ప్రొసీడింగ్స్ జారీ అయ్యాయి. వాటిలో కూడా అత్యధికం రియల్ఎస్టేట్కు సంబంధించిన వెంచర్లే ఉన్నాయి. 100 నుంచి 200 గజాల లోపు ఇండ్లు, స్థలాల రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్) కోసం వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్న వారి నుంచి నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసీ) సమర్పించాలని నిబంధన పెట్టారు. వాటిని జిల్లా కలెక్టర్ కార్యాలయాల నుంచి పొందాల్సి ఉంటుంది. 2015 నుంచి ఎన్ఓసీల కోసం దరఖాస్తు చేసుకున్న సామాన్యులు ఇప్పటికీ స్థానిక ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. గడువు ముగిసినా ఎన్ఓసీలు ఇవ్వలేదనే కారణంతో ఆ దరఖాస్తులన్నింటినీ జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ తిరస్కరించాయి. దీనితో దరఖాస్తుతో పాటు ఆయా కార్పొరేషన్లకు చెల్లించిన రూ.10వేలు కూడా దరఖాస్తుదారులు నష్టపోయారు.
ఇక్కడా రియల్ వ్యాపారమే...
ఎన్ఓసీలు ఇవ్వడంలో రెవెన్యూ విభాగం జాప్యం చేస్తు న్నదనే కారణంతో ఓ దశలో వాటిని తెప్పించుకొనే బాధ్యత ను జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏలకే ఇచ్చారు. అక్కడా సామా న్యులకు న్యాయం జరగలేదు. ఆదాయం ఎక్కువ వస్తుందనే ఉద్దేశ్యంతో ఆయా కార్పొరేషన్లు కేవలం రియల్ ఎస్టేట్ వెంచ ర్లకు సంబంధించిన సర్వే నెంబర్ల ఎన్ఓసీల జాబితాలను మాత్రమే సంబంధిత కలెక్టర్ కార్యాలయాలకు పంపారు. వాటికి మాత్రమే సమాచారం ఇచ్చి రెవెన్యూ విభాగం మిన్న కుండిపోయింది. 100-200 గజాల స్థలాలకు సంబంధిం చి ఎన్ఓసీల కోసం స్థానిక ఎమ్యార్వో, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల్లో దాదాపు 50వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటి సంఖ్య అధికంగా ఉన్నట్టు ఒకేచోట కనిపించకుండా కలెక్టర్ కార్యాలయాల్లోని రెవెన్యూ విభాగం వాటిని ఎమ్మార్వో, ఆర్డీఓలకు బదలాయించి చేతులు దులుపుకుంది. దీనివల్ల దరఖాస్తుల విభజన జరిగి, వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు స్టేజీల్లో సదరు దరఖాస్తులు ఉన్నట్టు కనిపిస్తుంది. ఫలితంగా కలెక్టర్ కార్యాలయంలో రికార్డుల పరంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉంటుంది. సదరు భూమి ఏదైనా నిషేధిత సర్వే నెంబర్లో ఉంటే ఆ విషయాన్ని దరఖాస్తుదారులకు చెప్తే, వారు తమ ప్రయత్నాలను విరమించుకుంటారు. కానీ కలెక్టర్ కార్యాలయాల్లోని రెవెన్యూ విభాగం ఆ సమాచారాన్ని కూడా చెప్పట్లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు.
రిజిస్టర్ చేసింది ప్రభుత్వమే...
ప్రభుత్వానికి చెందిన రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే ఆయా నివాస స్థలాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. నిషేదిత సర్వే నెంబర్ల జాబితా వారి వద్ద ఉంటుంది. ఆ పరిశీలన పూర్తయ్యాకే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. కానీ అందుకు భిన్నంగా ఎన్ఓసీలు ఎందుకు అడుగుతున్నారనేది సామాన్యుల ప్రశ్న. రియల్ ఎస్టేట్ వెంచర్లకైతే హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ నేరుగా కలెక్టర్ కార్యాలయాల నుంచి ఎన్ఓసీలు తెచ్చుకుంటున్నాయనీ, తమ విషయంలో ఆ పని ఎందుకు చేయట్లేదని సామాన్య దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన ఎల్ఆర్ఎస్ మేళాల్లో ఇవే ప్రశ్నలు అధికారులకు ఎదురయ్యాయి.
పద్ధతి మారకుండా...
సర్కారు ఆదాయాన్వేషణకు ఇదో చిన్న ఉదాహరణ...2020 ఆగస్టు 31న రాష్ట్రప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 26వ తేదీకి ముందు జరిగిన ఆస్తుల కొనుగోళ్లు అన్నీ వర్తిస్తాయని పేర్కొంది. కానీ 2015లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నవారి సంగతిని ప్రస్తావించలేదు. దీనిపై అయోమయాన్ని ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే సృష్టించినట్టు తెలుస్తున్నది. 2015లో వివిధ కారణాలతో దరఖాస్తుల తిరస్కరణకు గురైన 50 వేల మందిలో దాదాపు 30 వేలమంది కొత్త నిబంధనలతో మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 15వ తేదీతో తుది గడువు ముగుస్తుందనగా, అదే రోజు రాత్రి ఉత్తర్వులను సవరిస్తూ మరో ఆదేశం ఇచ్చారు. దానిలో 2015నాటి దరఖాస్తుల్ని పరిగణనలోకి తీసుకుంటామనీ, వారు మరోసారి అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం లేదనీ పేర్కొన్నారు. కానీ అప్పటికే 2015 దరఖాస్తుదారులు ప్రభుత్వానికి మరోసారి దాదాపు రూ.3 కోట్లకు పైగా దరఖాస్తు రుసుం చెల్లించేశారు. ఇప్పుడా సొమ్ము తిరిగి వస్తుందా...రాదా...అనే దానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం దరఖాస్తుల స్థాయిలోనే ఎల్ఆర్ఎస్ స్కీం ఉన్నా, ఆ తర్వాత తిరిగి అదే ఎన్ఓసీలు, రుసుముల చెల్లింపులు వర్తిస్తాయి. అప్పటికైనా ప్రభుత్వం తన విధాన నిర్ణయాలను మార్చుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సామాన్యుల ఎన్ఓసీల బాధ్యతను కూడా ఆయా ప్రభుత్వ సంస్థలే తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.