Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భాగ్యనగరం బురదల్లో బయటపడుతున్న శవాలు
- జీహెచ్ఎంసీ, శివారు ప్రాంతాల్లో 33 మంది మృతి
- అనధికారికంగా 50 మందికిపైనే..
- మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు
- ఆందోళనలో ముంపు బాధితులు
విశ్వనగరంలో ఎటు చూసినా... జలదిగ్బంధంలో చిక్కుకున్న ఇండ్లు.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు... మేట వేసిన బురదలో అడుగుతీసి ఆడుగు వేయాలన్నా భయం. ఎందుకంటే ఈ బురదలో నుంచి శవాలు బయటపడుతున్నాయి. ఇటీవల గోడకూలి మరణాలు సంభవిస్తే... తాజాగా నీళ్లలో కొట్టుకుపోయి..బురదలో కూరుకుపోయిన శవాలు హృదయవిదారకంగా దర్శనమిస్తున్నాయి. తమవాళ్ల ఆచూకీ తెలియక కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. జీహెచ్ఎంసీ,శివారు ప్రాంతాల్లో 33 మంది మాత్రమే చనిపోయారని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి 50 మందికిపైనే ఉండొచ్చని ప్రజాసంఘాల నేతలు అంటున్నారు. మరోవైపు మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో గ్రేటర్ హైదరాబాద్లోని జనంలో మరింత భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ మహానగరాన్ని వర్షాలు, వరదలు నిన్నొదలా అంటూ వెంటాడుతున్నాయి. వారం రోజులకు పైగా కురుస్తున్న భారీ వర్షాలతో నగరవాసుల జీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా..ఇప్పటికీ గూడు వదిలిన పేదలు ఇండ్లకు తిరిగివెళ్లే పరిస్థితులు ఇప్పట్లో కనిపించటంలేదు. జీహెచ్ఎంసీతో పాటు శివారుప్రాంతాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాటీల్లో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. నీటమునిగిన కాలనీలు, ఇండ్లల్లో ఉండలేక, బయటికి రాలేక ప్రజల గోడు వర్ణణాతీతం.
మరణమృదంగం
జీహెచ్ఎంసీతో పాటు శివారు ప్రాంతాల్లోని చెరువులు, మురుగుకాల్వలు పొంగిపొరుతున్నాయి. ప్రాణాలు అరచేతి లో పెట్టుకుని లోతట్టుప్రాంతాల్లోని జనం బతుకుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 37మంది, గ్రేటర్, శివారు ప్రాంతాల్లో కలిపి 33 మంది మృతి చెందారు. వారిలో పాతబస్తీలో పాతభవనం కూలి 8 మంది, భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకుని మరికొంతమంది ఉండొచ్చని అధికారులు అంటున్నారు. మరో ముగ్గురి ఆచూకీ గల్లంతైనట్టు గుర్తించారు. సోమ వారం నీటిలో కొట్టుకుపోయి చనిపోయిన ఓ మృతదేహం బురదలో కనిపించింది. ఈ లెక్కన అనధికారికంగా మృతుల సంఖ్య 50పైనే ఉన్నట్టు సమాచారం.
నీటిలోనే..
బోడుప్పల్, ఫీర్జాదిగుడ, బడంగ్పేట్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లు, నాగారం, పెద్ద అంబర్పేట్, జల్పల్లి, తుర్క యంజాల్, కోంపల్లి మున్సిపాలిటీల్లో సుమారు 3వేల కాలనీలు, 30వేల ఇండ్లు నీటమునిగాయని పలువురు నిపుణుల అంచనా. ఇప్పటికీ ఆయా ఇళ్లల్లో వరద నీరు నిలబడే ఉంది. నిత్యావసరాలు, వస్త్రాలు కొట్టుకుపోయి.. బయటకు అడుగుపెట్టే పరిస్థితి లేక.. ఇంట్లో ఉండలేక బోరుమంటున్నారు. ఇంకా మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు వర్షాలంటేనే హడలెత్తిపోతున్నారు.
నష్టం అంచనా రూ.724కోట్లు
గ్రేటర్ హైదరాబాద్తో పాటు శివారుప్రాంతాల్లో సుమారు రూ.724కోట్ల నష్టం వాటిల్లినట్టు జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేశాయి. 400 ఏండ్ల నాటి పురానాపూల్ బ్రిడ్జి ఫిల్లర్ కుంగిపోయింది. దాంతో రాకపోకలు నిలిపేశారు. కుతుబ్షాహీలు నిర్మించిన తొలి వంతెన ఇదే. ముసారాంబాగ్ బ్రిడ్జిని మూసేశారు.
సహాయకార్యక్రమాలకు రూ.60కోట్లు
వరదల కారణంగా చేపట్టిన సహాయ కార్యక్రమాల కోసం జీహెచ్ఎంసీ, వాటర్బోర్డు, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో రూ.60కోట్లు ఖర్చుచేశారు. ముంపుబాధితులకు అందించిన సీఎం రిలీఫ్ కిట్లు, పునరావాస కేంద్రాల్లో భోజనాల కోసం రూ.45కోట్లు ఖర్చుచేశారు. వాటర్బోర్డు ఆధ్వర్యంలో రూ.ఆరుకోట్లు, టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో రూ.8కోట్లు, టీఎస్ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో కోటిరూపాయలు ఖర్చుచేసినట్టు అధికారులు తెలిపారు. ముంపు ప్రాంతాల్లో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మెన్, ఎండీ రఘుమారెడ్డి సౌత్, సెంట్రల్ సర్కిళ్ల పరిధిలో పర్యటించారు. విద్యుత్ పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు.