Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా వచ్చినా చూపని కనికరం
- జీతాల్లో కోత విధించాలని ఇంటర్ విద్యాశాఖ ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంట్రాక్టు అధ్యాపకులపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. కరోనా వైరస్ బారిన పడ్డ వారికి వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కరోనా సోకితే వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేసింది. కానీ కాంట్రాక్టు అధ్యాపకులకు మాత్రం ఆ నిబంధనను వర్తింపచేయడం లేదు. కరోనా సోకి హోం క్వారంటైన్ లేదా ఆస్పత్రిలో చికిత్స పొందిన వారికి పూర్తి జీతాలు చెల్లించలేమని ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారులు/నోడల్ అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వానికి కనీస కనికరం లేదని కాంట్రాక్టు అధ్యాపకులు విమర్శిస్తున్నారు.
పూర్తి జీతాలివ్వాలి : కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం
కోవిడ్-19 బారిన పడ్డ కాంట్రాక్టు అధ్యాపకులకు కోత లేకుండా పూర్తి జీతాలివ్వాలని ప్రభుత్వ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కోవిడ్ ప్రభావంతో హోం క్వారంటైన్, ఆస్పత్రిలో చికిత్స పొందిన వారికి జీతాల్లో కోత విధించొద్దని కోరారు. కరోనా వచ్చిన వారికి జీతాల్లో కోత విధించొద్దని గతంలో విద్యామంత్రి, ఇంటర్ విద్యా కమిషనర్కు విజ్ఞప్తి చేస్తే సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు. అందుకు విరుద్ధంగా జీతాల్లో కోత విధించాలని ఇంటర్ విద్యా కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం విచారకరమని తెలిపారు. విద్యామంత్రి జోక్యం చేసుకుని పూర్తి జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కరోనా రోగంలోనూ వివక్షేనా : ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం
కరోనా రోగంలోనూ కాంట్రాక్టు అధ్యాపకుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షులు గాదె వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా సోకిన వారికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కోరినా అది వర్తించబోదని ఆదేశాలు జారీ చేయడం అన్యాయమని విమర్శించారు. ఉద్యోగాన్ని బట్టి రోగం రాదని గుర్తు చేశారు. వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.