Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిబంధనలకు తూట్లు
- రిజర్వేషన్లకు ఎసరు
- నేరుగా నియమించాల్సిన పోస్టుల్లో డిప్యూటేషన్ తో అక్రమాలు
- ఆయూష్ విభాగంలో పదేండ్లుగా అన్యాయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వాలు మారినా, రాష్ట్రం విడిపోయినా ఆ వర్గాలకు మాత్రం న్యాయం జరగటం లేదు. ఉన్నత చదువులు చదివినా వారి పట్ల అదే అన్యాయం కొనసాగుతున్నది. ప్రవేశాలు మొదలు నియామకాల వరకు వారిని దూరం పెట్టేందుకు ఉన్న దారులను ఉన్నతాధికారులే వెతుకుతుండడం గమనార్హం. అందుకోసం అత్యవసర పరిస్థితి పేరుతో నేరుగా నియమించాల్సిన పోస్టులను కాస్తా డిప్యూటేషన్ పేరుతో భర్తీ చేయటం, ఆ తర్వాత వాటిని పర్మినెంట్ పోస్టులుగా మార్చడం ఆయూష్ విభాగంలో పరిపాటిగా మారింది. బాధితులుగా మారుతున్న దళిత వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన అభ్యర్థులు పాలకుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా వారి సమస్యల పరిష్కారం మాత్రం సుదూర స్వప్నంగానే మిగిలిపోతున్నది. గత పదేండ్లుగా ఆయూష్ విభాగంలో జరుగుతున్న నియామకాల ప్రక్రియను పరిశీలిస్తే ఉద్దేశపూర్వకంగా దళితులకు దక్కాల్సిన పోస్టులను అనర్హులకు కట్టబెట్టటం కొనసాగుతున్నది. అందుకోసం డబ్బులు చేతులు మారుతున్నట్టు తెలుస్తున్నది.
రాష్ట్రంలో రెండు ప్రభుత్వ ఆయుర్వేదిక్ కళాశాలలున్నాయి. వాటిలో లెక్చరర్ల పోస్టులను నేరుగా భర్తీ చేయాలని ఆయుర్వేద మెడికల్ సర్వీసెస్ నిబంధనలు చెబుతున్నాయి. ఆయా కళాశాలల కొనసాగింపు కోసం ప్రతి ఏటా సెంటర్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ మెడిసిన్ (సీసీఐఎం) ప్రతినిధులు తనిఖీ చేస్తుంటారు. ఆ క్రమంలో అప్పటికీ ఖాళీ పోస్టులుంటే అనుమతి నిరాకరించే ప్రమాదమున్నదనే సాకుతో అప్పటికే డిస్పెన్సరీల్లో మెడికల్ ఆఫీసర్లుగా ఉన్న తమ వారికి డిప్యూటేషన్ ఇస్తున్నారు. ఎక్కడైనా ఒకసారి అత్యవసర పరిస్థితిలో సర్దుబాటు చేస్తే అది నిజంగా అత్యవసర పరిస్థితి అయి ఉండొచ్చని భావించొచ్చు. కానీ ఈ విభాగంలో మాత్రం గత పదేండ్లుగా ఇలాగే భర్తీ చేస్తున్నట్టు సమాచారం. 2017లో టీఎస్పీఎస్సీ ద్వారా నేరుగా భర్తీ చేసేందుకు నోటిపిషన్ ఇచ్చారు. ఇలా భర్తీ అయి ఉంటే రిజర్వేషన్లు వర్తించి దళితులకు న్యాయం జరిగేది. అయితే 2018లో ఆ నోటిఫికేషన్ను ఉపసంహరించుకున్నారు. ఆయూష్ విభాగమే భర్తీ చేసుకోవాలని నిర్ణయించారు. 2019కి వచ్చేసరికి ఆ నియామకాల బాధ్యతను రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక మండలికి అప్పగించినా ఇప్పటికీ భర్తీ చేయలేదు. మరోసారి వన్ టైం పేరుతో డిప్యూటేషన్ పేరుతో దళిత వర్గాలకు అన్యాయం చేసేందుకు ఉన్నతాధికారులు సిఫారసులను ఆర్థికశాఖకు పంపించినట్టు సమాచారం.
తప్పుడు నిర్ణయాలతో ప్రజలకు తప్పని ఇబ్బందులు
సకాలంలో పోస్టుల భర్తీ, అర్హులకు కట్టబెట్టే విషయంలో సర్కారు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు ప్రజలకు మెరుగైన సేవలు అందకుండా చేస్తున్నాయి. డిస్పెన్సరీల్లో మెడికల్ ఆఫీసర్లుగా సేవలందించాల్సిన వారిని డిప్యూటేషన్ పేరుతో తరలిస్తుండడంతో ప్రజలకు డాక్టర్లు అందుబాటులో లేకుండా పోతున్నారు. నేరుగా నియామకాల్లేక ప్రతిభావంతులు ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. విద్యార్థులు నాణ్యమైన విద్యాబోధనకు నోచుకోలేకపోతున్నారని అభిప్రాయం వ్యక్తమవుతున్నది. చదువుకోవటానికే నానా ఇబ్బందులు పడే దళిత వర్గాల పిల్లలు చివరకు ప్రభుత్వ ఉద్యోగాలు రాక కష్టాల్లోనే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా నేరుగా నియామకాలు చేపట్టి తమకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధిత దళిత వర్గాల అభ్యర్థులు కోరుకుంటున్నారు.