Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పండుగలకు ముందు ఘాటు
- ఏడాది ఆరంభంలోనూ ఇదే రేటు
- సెప్టెంబర్లో కేజీ రూ.20 మాత్రమే
- నల్లబజారుకు నాణ్యమైన ఉల్లి తరలింపు
కరోనా కష్టకాలంలో ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఇప్పటికే కూరగాయల రేటు చుక్కలు చూపిస్తుండగా... ఇప్పుడు ఉల్లిపాయల ధర సెంచరీ దాటింది. సెప్టెంబర్లో రూ.20కే లభించిన కిలో ఉల్లి ఇప్పుడు నాలుగు రెట్లు అధిక ధర పలుకుతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఉల్లి ఠారెత్తిస్తోంది. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లిపాయలు రూ.120 వరకు ధర పలకుతుండటంతో సామాన్యులు బెంబెలెత్తుతున్నారు. దీపావళికి ముందే ఉల్లిగడ్డ బాంబు పేలిందనే చల్లోక్తులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పండుగ సమయంలోనైనా నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం పట్టనట్టే ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉల్లి ధరలు పెరుగుతున్న తీరును అంచనా వేసి సెప్టెంబర్లో పెద్దమొత్తంలో దిగుమతి చేసుకున్న కొందరు వ్యాపారులు ఇప్పుడు ధర రూ.100 దాటడంతో అమ్మడం ప్రారంభించారు. మరికొందరు ఇంకా ధర పెరుగుతుందని ఇప్పటికీ బ్లాక్ చేశారని తెలిసింది. రిటైల్ వ్యాపారులు ఉల్లిపాయలను గ్రేడింగ్ చేశారు. తక్కువ గ్రేడ్ ఉల్లిపాయలను సైతం రూ.100కు విక్రయిస్తున్నారు. నాణ్యత బాగున్న ఉల్లిపాయలను రూ.120 వరకు కూడా అమ్ముతున్నారు.
దిగుబడి తగ్గడం కూడా కారణమే...
ఉల్లి ఘాటెక్కడానికి అధికవర్షాలు ప్రధాన కారణమని వ్యాపారవర్గాలు అంటున్నాయి. అతివృష్టితో దిగుబడి గణనీయంగా పడిపోయింది. మొన్నటి వరకు కిలో ఉల్లి రూ.50కి లభించగా.. ఇప్పుడు ఏకంగా రూ.100కు పైగా పలుకుతుంది. వర్షాలకు ఎక్కువశాతం ఉల్లిగడ్డలు కుళ్లిపోయాయి. మహారాష్ట్ర, కర్నాటక, కర్నూలు నుంచి దిగుమతి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగాయి. ఉల్లి దిగుమతులపై డిసెంబర్ 15 వరకు నిబంధనలు సడలిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుబజార్లలో సబ్సిడీపై కిలో ఉల్లి రూ.40కి విక్రయిస్తుంది. ఏపీ తరహాలోనే మన రాష్ట్రంలో కూడా తక్కువ ధరకు ఉల్లిపాయలు లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
ధరల పెరుగుదల ఎలా..?
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖ ప్రకారం ఉల్లిపాయల రిటైల్ ధర 2020 ఆగస్టు చివరి నుంచి గణనీయంగా పెరుగుతోంది. అయితే ధరస్థాయి గతేడాది కంటే ఒకింత తక్కువే అయినా పది రోజుల్లో గతేడాది కంటే 12.13 శాతం అధికంగా పెరిగింది. ఏకంగా గురు, శుక్రవారాల్లోనే రూ.30కి పైగా ధర పెరగడం గమనార్హం. ఉల్లిపాయల సరఫరా గత నెల నుంచి దాదాపు సగానికి పడిపోయిందని వ్యాపారులంటున్నారు. వర్షాలు ఇలానే ఉంటే ధర మరింత పెరగవచ్చని చెబుతున్నారు. సెప్టెంబర్ 13వ తేదీన రూ.25 పలికిన కిలో ఉల్లిపాయలు 23వ తేదీ నాటికి రూ.35కు చేరాయి.
మూడు రోజుల నుంచి ధర బాగా పెరుగుతోంది :బాజీ, ఉల్లిపాయల హౌల్సేల్ వ్యాపారి
సోలాపూర్ నుంచి తీసుకొచ్చి ఉల్లిపాయలు హౌల్సేల్గా విక్రయిస్తాను. 20 రోజుల నుంచి రేట్లు బాగా పెరిగాయి. వర్షాల కారణంగా దిగుబడి తగ్గడం వల్ల తక్కువ బండ్లు వస్తున్నాయి. రూ.25 ఉన్నప్పుడు వినియోగదారులు కూడా బాగా కొనుగోలు చేశారు. అప్పుడు రోజుకు ఒక లారీ సరుకు చొప్పున అమ్మిన కమీషన్ ఏజెంట్ ఇప్పుడు పది బస్తాలు కూడా అమ్మలేని స్థితి వచ్చింది.
ఈ వారంలోనే బాగా పెరిగింది :మాధవరావు, రిటైల్ వ్యాపారి, ఖమ్మం త్రీటౌన్ రైతుబజార్
పెద్ద మార్కెట్, గాంధీచౌక్ నుంచి మాకు సరుకు వస్తుంది. మేము రూ.85కు తెస్తే రూ.90 వరకు అమ్ముతున్నాం. ఈ వారంలోనే బాగా ఉల్లిపాయల ధర పెరిగింది.
అమ్మో ఉల్లిపాయలు కొనలేకపోతున్నాం :కె. ప్రత్యూష, గృహిణి
వారం రోజుల క్రితం రూ.55కు కిలో చొప్పున రెండు కేజీల ఉల్లిపాయలు తెచ్చాం. పండుగ వస్తుందని ఇంకో రెండు కేజీలు తీసుకుందామనుకున్నా. రేటు అడిగితే రూ.100 చెప్పారు. పోనుపోను ఇంకా పెరుగుతాయన్నారు.