Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీవి చిల్లర రాజకీయాలు
- మక్కలను మేమే కొంటాం
- ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఈ ప్రక్రియ
- క్వింటాల్ కు రూ.1,850 మద్దతు ధర
- వద్దంటే రైతులు మొక్కజొన్న సాగు చేశారు
- యాసంగిలో ఇదే పంటేస్తే కొనేది లేదు
- 'పంటల కొనుగోళ్లు, నిర్ణీత సాగు విధానం'పై సమీక్షలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే మొక్కజొన్న పంటకు ధర పడిపోయిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. మక్కలపై 50 శాతంగా ఉన్న దిగమతి సుంకాన్ని కేంద్రం 15 శాతానికి తగ్గించటం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని చెప్పారు. ఇందుకు కారణమైన బీజేపీ నాయకులే ఇప్పుడు రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాద్ధాంతం చేసే వారి మాటలను నమ్మొద్దని కోరారు. పంటల కొనుగోళ్లు, యాసంగిలో నిర్ణీత సాగు విధానం అమలు తదితరాంశాలపై చర్చించేందుకు సీఎం.. శుక్రవారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసే కేంద్రాల్లోనే మద్దతు ధర చెల్లించి మక్కలను కొనుగోలు చేస్తామని ఆయన ప్రకటించారు. క్వింటాల్కు రూ.1,850 మద్దతు ధరను చెల్లించి మార్క్ ఫెడ్ ద్వారా వాటిని సేకరిస్తామని తెలిపారు. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటూ రైతులను కోరారు. మొక్కజొన్నకు మద్దతు ధర వచ్చే అవకాశం లేదు కాబట్టి.. వర్షాకాలంలో వాటిని సాగు చేయొద్దంటూ రైతులను కోరామని చెప్పారు. అయినప్పటికీ వారు ఆ పంటను వేశారని తెలిపారు. 'వద్దంటే మక్కలు సాగు చేశారు.. వాస్తవానికి వాటిని కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదు...' అని సీఎం వ్యాఖ్యానించారు. అయినప్పటికీ రైతులు నష్టపోవద్దనే ఏకైక కారణంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినా వాటిని కొనుగోలు చేసేందుకు నిర్ణయించామని తెలిపారు. 'గత యాసంగిలో రైతుల నుంచి 9 లక్షల టన్నుల మక్కలను మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 1,668 కోట్లను ఖర్చు చేసింది. వాటికి బయట మార్కెట్లో ధర లేకపోవటం వల్ల వేలం వేయాల్సి వచ్చింది. సర్కారుకు అప్పుడు రూ.823 కోట్లు మాత్రమే వచ్చాయి. మార్క్ఫెడ్కు మొత్తంగా రూ.845 కోట్ల నష్టం వాటిల్లింది. క్వింటాల్కు రూ.1,760 చొప్పున ధర చెల్లించి మక్కలను కొనుగోలు చేశాం. సేకరణ, రవాణా తదితర ఖర్చులన్నీ కలిపి ఒక్కో క్వింటాల్కు రూ.2 వేల వరకూ ఖర్చయింది. కానీ వేలంలో క్వింటాల్కు కేవలం రూ.1,150 మాత్రమే వచ్చాయి. అంటే ఒక్కో క్వింటాల్కు రూ.850 మేర నష్టం వచ్చిందన్నమాట. దేశవ్యాప్తంగా మొక్కజొన్నకు మార్కెట్ లేకపోవడం వల్ల తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తున్నది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే వర్షాకాలంలో మక్కలను సాగు చేయొద్దంటూ ప్రభుత్వం రైతులను కోరింది. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో పసుపునకు అంతర పంటగా కొద్దిపాటి ఎకరాల్లో మక్కలను వేసుకోవాలంటూ ప్రభుత్వం సూచించింది. ఈ విజ్ఞప్తినీ, వ్యవసాయాధికారుల సూచనలను పాటించకుండా కొంత మంది రైతులు మొక్కజొన్నను సాగు చేశారు. వాటికి మద్దతు ధర రాదని తెలిసినా పంట వేయటంతో నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. రైతులు పండించిన పంటలకు మంచి ధర రావాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నిర్ణీత పంటల సాగు విధానాన్ని రూపొందించింది. అనేక మంది రైతులు ఈ విధానం ద్వారా తమ చైతన్యాన్ని చాటుకున్నారు. ఇంత చెప్పినా సరే, మళ్లీ ఎవరైనా ఆ పంటేస్తే మాత్రం ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత ఉండబోదు. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మక్కలను కొనుగోలు చేసే అవకాశం ఉండదు...' అని సీఎం స్పష్టం చేశారు.