Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు సీఎం ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దసరా పండుగ రోజూ ప్రజలకు రూ.10 వేల వరద సహాయాన్ని అందించాలని అధికారులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశించారు. ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ, పక్కనున్న మున్సిపాల్టీల్లో వర్షాలు, వరదలకు ఇబ్బందులు పడ్డ కుటుంబాలను గుర్తించి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించాలని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సమావేశం నిర్వహించారు. వరదసాయంపై సమీక్షించారు. ఇందుకోసం 780 టీంలను ఏర్పాటు చేశామని సోమేశ్కుమార్ తెలిపారు. మొబైల్ యాప్ ఆధారంగా ప్రతి ఇంటినీ ఆ టీం సందర్శిస్తుందని పేర్కొన్నారు. 1.13 లక్షల కుటుంబాలకు రూ.113 కోట్ల సాయం అందజేశామని వివరించారు. ఇప్పటి వరకు 70 వేల కుటుంబాలకు ఆ సాయం అందిందని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీతోపాటు పక్కనున్న మున్సిపాల్టీలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాల్లోని ప్రజలకు వరద సాయాన్ని దసరా సెలవుల తర్వాత పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.