Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ సంచాలకులకు సెస్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించాలని సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ అండ్ సర్వీస్ (సెస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఎ దేవసేనను బుధవారం సెస్ చైర్మెన్ నాగటి నారాయణ, కో చైర్మెన్ ఎల్ బుచ్చిరెడ్డి, వైస్చైర్మెన్లు పి ఇంద్రజిత్, బి సీతామనోహర్ కలిసి వినతిపత్రం సమర్పించారు. విద్యారంగం ఉమ్మడి జాబితాలో ఉన్నందున నూతన విద్యావిధానాన్ని అవసరమైన మార్పుచేర్పులతో అమలు చేసే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని సూచించారు. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ), ఫౌండేషన్ ఆఫ్ లెర్నింగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానపత్రంలో చెప్పిన విధంగా అమలు చేస్తే ప్రీప్రైమరీ తరగతులకు అవకాశం లేదని తెలిపారు. ప్రీప్రైమరీ విద్య అమలుకు నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ (నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ) తరగతులు నిర్వహించాలని సూచించారు. ప్రీప్రైమరీ, ప్రైమరీ (1-5 లేదా 1-8) తరగతులను ఒక యూనిట్గా నిర్వహించాలని పేర్కొన్నారు. మూడేండ్లు దాటిన వయసు నుంచే బాలబాలికలను సర్కారు బడుల్లో చేర్చాలని తెలిపారు. ప్రీప్రైమరీ విద్య అమలుతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని సూచించారు. ఎన్సీఈఆర్టీ, ఎస్సీఈఆర్టీ సిలబస్ ఆధారంగా ప్రీప్రైమరీ విద్యార్థులకు బోధించడానికి ప్రత్యేకంగా టీచర్లను నియమించాలని కోరారు. ఇంటర్ ఉత్తీర్ణులైన మహిళలకు ఏడాదిపాటు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ప్రీప్రైమరీ విద్యార్థులకు ఆహారం, తాగునీరు, టారులెట్లకు తీసుకెళ్లడం కోసం 8-10 వరకు చదివిన మహిళలను ఆయాలుగా నియమించాలని వివరించారు. విద్యార్థులకు ఆహ్లాదకరంగా ఉండేలా తరగతి గదుల్లో రంగులు, చిత్రాలుండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సిలబస్కు తగిన బోధనాభ్యసన ఉపకరణాలు, ఆటపాటల పరికరాలు, ఆడియో విజువల్ ఏర్పాటు చేసి తగిన నిధులు కేటాయించాలని కోరారు.