Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మియాపూర్ (గచ్చిబౌలి)
రంగారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించిన డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. డాక్టర్ భార్య దగ్గరి బంధువే కిడ్నాప్ చేయించినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసు పూర్తి వివరాలను సీపీ సజ్జనార్ బుధవారం మీడియాకు వెల్లడించారు. హుస్సేన్ భార్య దగ్గరి బంధువైన ముస్తఫా ఆస్ట్రేలియాలో ఉండేవాడు. అక్కడ ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతో ఇండియాకు వచ్చి హైదరాబాద్, పూణెలో రియల్ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాడు. విలాసవంతమైన జీవితానికి అలవాడుపడ్డ ముస్తఫా.. స్నేహితులైన ముబాషిర్ అహ్మద్, గణేశ్తో కలిసి ఎవరైన డబ్బున్న వ్యక్తిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశాడు. అందులో భాగంగా డాక్టర్ హుస్సేన్తో పరిచయం పెంచుకున్నారు. కొత్తగా నిర్మించిన ఓ భవనం కిందిభా గంలో డాక్టర్ క్లీనిక్ పెట్టాడు. అదే భవనం మొదటి అంతస్తులో ముస్తఫా ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. మహ్మద్ రహీం అనే వ్యక్తిని డాక్టర్ ఇంట్లో హౌస్ కీపింగ్ పనికి పెట్టి, డాక్టర్ కదలికలను ఎప్పటికప్పుడు ముస్తఫా తెలుసుకునేవాడు. ప్లాన్లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం నలుగురు వ్యక్తులు క్లీనిక్లో ఉన్న డాక్టర్ను లైటర్ తుపాకీతో బెదిరించి అతని కారులోనే కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి కూకట్పల్లికి తరలించారు. బెంగుళూరుకు తరలించేందుకు మరో టీమ్ను కిడ్నాపర్లు రెడీ చేసుకున్నారు. కిడ్నాపర్లు డాక్టర్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి 48 గంటల్లో రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి 12టీములుగా ఏర్పడి కిడ్నాపర్ల కోసం గాలించారు. కిడ్నాపింగ్లో పాల్గొన్న మొత్తం 13 మందిలో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి మూడు వాహనాలు, బొమ్మ తుపాకీ, 7 మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నట్టు సీపీ తెలిపారు.