Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రెవెన్యూ శాఖలో అవినీతికి వీఆర్వోలే మూలమని భావించిన ప్రభుత్వం ఏకంగా ఆ వ్యవస్థనే రద్దు చేసిన విషయం విదితమే. రెవెన్యూ శాఖలో అవినీతిని పూర్తిగా అరికట్టవచ్చనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం ఏమేరకు విజయవంతం అవుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హడావుడిగా ధరణి పోర్టల్ను ప్రారంభించడంపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే పాసుపుస్తకాల తప్పులు, తండ్రిపేరు, పట్టాదారుపేరు, విస్తీర్ణం తక్కువ, ఎక్కువ, రెండు ఖాతాలు, తప్పుడు సర్వేనెంబర్లు, అసైన్డ్ భూముల అమ్మకం, అటవీ భూములకు సంబంధించిన కేసులు 2,65,653 మేరకు ఉన్నాయి. దీనికి తోడు సాదాబైనామాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ కాని భూములకు సంబంధించి 10,96, 344 పిటిషన్లున్నాయి. ఈ తప్పులు సరిదిద్దకుండానే ధరణి ప్రారంభిస్తే అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయనే చర్చ నడుస్తున్నది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు సంబంధించి సమగ్రంగా సర్వే చేసి వివరాలు పొందుపరుస్తే ప్రజలకు మరింత ఉపయోగంగా ఉండేదనే అభిప్రాయం మేధావుల నుంచి వ్యక్తమవుతున్నది.
సమగ్ర భూసర్వే చేసి వాస్తవ సాగుదారుల పేర్లు
నమోదు చేస్తే బాగుండేది : సారంపల్లిమల్లారెడ్డి,ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు
ధరణి వెబ్సైట్ ద్వారా ప్రజల, రెవెన్యూ సమస్యలు పరిష్కరించే విధంగా సమగ్ర భూ సర్వే చేసి వాస్తవ సాగుదారుల పేర్లు నమోదు చేయాలి. అక్రమంగా స్వాధీనం చేసుకున్న, సీలింగ్, ప్రభుత్వ మిగులు భూములను పేదలకు పంచి పట్టాలివ్వాలి. భూరికార్డుల ప్రక్షాళనలో దొర్లిన తప్పులను, అంతకు ముందు నుంచి ఉన్న వివాదాలను పరిష్కరించి అందరికీ పట్టాలిచ్చిన తర్వాత ధరణి వెబ్సైట్ను ఆధునీకరిస్తే ఇంకా మంచి ఫలితాలు వచ్చి ఉండేవి. ప్రస్తుత విధానం భూముల కొనుగోలు దారులకు, ప్రభుత్వం భూముల సేకరణకు మాత్రమే ఉపయోగపడేలా ఉన్నది.