Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాడికి పాల్పడిన అందరిపైనా చర్యలు : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
- రామోజీపేట్లో దళితులకు పరామర్శ, ఆర్థిక సాయం
నవతెలంగాణ-ఇల్లంతకుంట
దాడికి గురైన దళిత కుటుంబాలకు భరోసానిచ్చి అండగా ఉండి ఆదుకుంటామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేట్లో దసరా రోజు రాత్రి దాడికి గురైన దళితులను బుధవారం ఎర్రోళ్ల శ్రీనివాస్ పరామర్శించారు. దాడిలో ధ్వంసమైన ఇండ్లు, బైక్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కులాలకతీతంగా ఉన్న గ్రామీణ ప్రాంతంలో దళితులపై దాడి జరగడం విచారకరమన్నారు. ఇలాంటి ఘటన వల్ల స్వతంత్ర భారతదేశంలో మనం ఇంకా ఎక్కడున్నామనే సందేహం కలుగుతోందన్నారు. చట్టానికి ఎవరైనా లోబడి ఉండాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధితులు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని ధైర్యం చెప్పారు. బాధితులకు ఎంత నష్టం జరిగిందో అంచనా వేయాలని జిల్లా కలెక్టర్ను, దాడికి పాల్పడిన వారందరిపైనా చర్యలు తీసుకోవాలని, బాధితులకు రక్షణ కల్పించాలని ఎస్పీని ఆదేశించినట్టు చెప్పారు. అనంతరం బాధిత తొమ్మిది కుటుంబాలకు రూ.25వేల చొప్పున ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందజేశారు. ఆయన వెంట రాష్ట్ర ఆహార భద్రతా కమిషన్ సభ్యుడు ఓరుగంటి ఆనంద్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు విద్యాసాగర్, రాంబలనాయక్, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్డీఓ శ్రీనివాస్రావు, డీఎస్పీ చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ ఆకునూరి శంకరయ్య తదితరులు ఉన్నారు.