Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి
- ఢిల్లీలో రైతాంగంపై భాష్పవాయు ప్రయోగం దుర్మార్గం
- ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్షాల నిరసన
నవతెలంగాణ-హైదరాబాద్ బ్యూరో
దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వంపై పోరుబాట కొనసాగుతుందని వామపక్షాలు స్పష్టం చేశాయి. కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక చట్టాలను కేంద్రం తక్షణం ఉపసంహరించుకోవాలనీ, లేనిపక్షంలో నిర్భంధాలను లెక్కచేయకుండా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జాతీయ సార్వత్రిక సమ్మెలో భాగంగా ఢిల్లీకి తరలివస్తున్న రైతులపై పోలీసుల దమనకాండను నిరసిస్తూ, గ్రామీణబంద్కు మద్దతుగా, కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా శుక్రవారం హైదరాబాద్ ట్యాంక్బండ్పైనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్షాలు, విద్యార్ధి, రైతు, వ్యవసాయ, కార్మిక, ప్రజా సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. రైతులపై భాష్పవాయు ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పోలీసు చర్యల ద్వారా ప్రజాందోళనల్ని అణచివేయాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయని అన్నారు. తక్షణం కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం చేసిన ప్రజావ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై పోరుకు టీఆర్ఎస్ పార్టీ కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర వ్యవసాయ సవరణ చట్టం దుర్మార్గమైనదని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్ష ప్రజాందోళనల్లో కలిసి రావాలని కోరారు. దేేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వ వ్యతిరేక ప్రజా పోరాటం కొనసాగుతుందనీ, దానికి రాష్ట్ర ప్రజానీకం సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం కోటీశ్వరులకు ఊడిగం చేస్తూ, సామాన్యుల్ని అణచివేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర, మద్దతు ధరలు లేవనీ, స్వేచ్ఛావాణిజ్యం పేరుతో కార్పొరేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. ప్రజాపంపిణీ వ్యవస్థనూ విచ్ఛిన్నం చేశారనీ, ప్రధాని మోడీ ఫాసిస్టు, నియంతృత్వ పోకడలు పోతున్నారని చెప్పారు. సీపీఐ(ఎమ్ఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి వెంకట్రామయ్య మాట్లాడుతూ నిషేధాలు, నిర్బంధాలను లెక్కచేయబోమనీ, కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగుతాయనీ చెప్పారు. ఆ ప్రజాందోళనలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ అధ్యక్షత వహించారు. తెలంగాణ రైతుసంఘం ప్రధాన కార్యదర్శి టి సాగర్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి ప్రసాద్, వెంకట్రామయ్య, సూర్యం (ఐఎఫ్టీయూ), రాములు (సీఐటీయూ), నాగరాజు (ఎస్ఎఫ్ఐ), తోట రమేష్ (ప్రజానాట్యమండలి), పి జమున (తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం), పీవైఎల్ నాయకులతో పాటు పలువురు పాల్గొన్నారు.