Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎస్టీ, పెద్దనోట్ల రద్దుకు.. మద్దతిచ్చింది మేమే
- ఉరకలు పెడుతున్న ఆర్థిక వ్యవస్థపై సమ్మెట దెబ్బకొట్టిన బీజేపీ
- ఆప్షన్-1కి అనివార్యంగా మద్దతివ్వాల్సి వచ్చింది
- 'డబుల్' పంపిణీలో కొద్దిపాటి జాప్యం వాస్తవమే
- వాటిని దశలవారీగా అందజేస్తాం
- వ్యతిరేకత అనేది నిర్మాణాత్మకంగా ఉండాలె తప్ప గుడ్డిగా కాదు
- సార్వత్రిక సమ్మెకు మేం మద్దతిచ్చాం
- విధానాల పరంగా ప్రజల్ని సమీకరించి పోరాడతాం
- జీహెచ్ఎమ్సీలో టీఆర్ఎస్ మహిళా అభ్యర్థే మేయర్ : కేటీఆర్
'జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి గతంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చింది మేమే. ఇప్పుడు అందరికంటే ఎక్కువగా పశ్చాత్తాపపడుతున్నదీ మేమే' అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు వ్యాఖ్యానించారు.
నల్లధనాన్ని నివారిస్తాం, తీవ్రవాదాన్ని అణచివేస్తాం, సంపూర్ణ క్రాంతి, పేద వారికి మేలుతోపాటు విశాల ఆర్థిక ప్రయోజనాల కోసమే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీని తీసుకొస్తున్నామంటూ ఆనాడు ప్రధాని మోడీ ప్రకటించారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో ఫోన్ సంభాషణలో సైతం ఇదే విషయాన్ని ప్రధాని చెప్పుకొచ్చారని వివరించారు. 'సాక్షాత్తూ దేశ ప్రధానే ఇలాంటి అంశాలను చెబితే విశ్వసించక చస్తామా...?' అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు నిర్ణయాలే తప్పని స్పష్టం చేశారు. వీటి వల్ల ఉరకలు పెడుతున్న ఆర్థిక వ్యవస్థపై బీజేపీ సమ్మెట దెబ్బ కొట్టిందని విమర్శించారు. దీంతో వరసగా ఎనిమిది త్రైమాసికాలపాటు జీడీపీ క్షీణించిందని అన్నారు. జీఎస్టీ పరిహారాల చెల్లింపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వమిచ్చిన ఆప్షన్-1కు అనివార్యంగా మద్దతివ్వాల్సి వచ్చిందని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీకి సంబంధించి కొద్దిపాటి జాప్యం, ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఏ పార్టీ, ప్రభుత్వం విషయంలోనైనా వ్యతిరేకత అనేది నిర్మాణాత్మకంగా ఉండాలి తప్ప గుడ్డిగా కాదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దివాళాకోరు ఆర్థిక విధానాలపై నికరంగా పోరాడుతున్నదీ, నిలదీస్తున్నది టీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు.
జీహెచ్ఎమ్సీ ఎన్నికల తర్వాత వ్యవసాయ, విద్యుత్, ఆర్థిక రంగాలతోపాటు ఇతర అన్ని అంశాలపై విధానాలపరంగా ప్రజల్ని సమీకరించి, పోరాడతామని వివరించారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎమ్సీ) ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్... నవతెలంగాణ ప్రతినిధి బి.వి.యన్.పద్మరాజు కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు...
- బీజేపీపై యుద్ధం చేస్తామంటూ టీఆర్ఎస్ చెబుతున్నది...? అది ఏ రకంగా ఉండబోతున్నది...?
ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. రాజకీయాల్లో శత్రువులు ఉండరు.. ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. మేం యుద్ధం చేసినా, విమర్శించినా, తూర్పారబట్టినా మా ప్రత్యర్థుల్ని హక్కుల గురించీ, రాష్ట్ర ప్రయోజనాల గురించి అడుగుతాం. యుద్ధం చేయటం, బాంబులు విసరటం వారి (బీజేపీ) పద్ధతి, మాది కాదు. జీహెచ్ఎమ్సీలో 150 డివిజన్లలో పోటీ చేస్తున్న పార్టీగా ఎవరిని, ఎప్పుడు, ఏ అంశాల వారీగా ప్రశ్నించాలో అలా ప్రశ్నిస్తూనే ఉంటాం.
- రాష్ట్రాల హక్కుల గురించి మాట్లాడే క్రమంలో జీఎస్టీ పరిహారాలకు సంబంధించి మంత్రి హరీశ్రావు కేంద్రం చెబుతున్న ఆప్షన్లను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కానీ కొద్ది రోజులకే ఆప్షన్-1కు మీ ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది...?
ఆప్షన్-1కు అనివార్యంగా మేం ఓకే చెప్పాల్సి వచ్చింది. కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. రూ.52 వేల కోట్ల లోటు మాకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంగా ఒకసారి కాదు... కేంద్రాన్ని అనేకసార్లు అడిగాం. సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్ మనీ పంపిణీకి ప్రణాళిక వేయాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కానీ మోడీ ప్రభుత్వం అవేవీ చేయలేదు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన డబ్బును, బకాయిలను దేవుడి మీద నెపం (యాక్ట్ ఆఫ్ గాడ్)తో ఎగ్గొడుతున్నారు. దీంతో రాష్ట్రాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి. కేంద్రం దేవుడి మీద నెపం మోపినట్టు.. మేం ఎవరి మీదా మోపలేదు. అలాగని సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపలేదు. వాటిని ఆపకుండా ఇవ్వాలంటే, రాష్ట్ర ప్రభుత్వం నడవాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి. అందుకే ఆప్షన్-1కి అనివార్యంగా ఒప్పుకోవాల్సి వచ్చింది. జీఎస్టీ కౌన్సిల్లో మందబలంతో (బీజేపీ) వారు ఇష్టమొచ్చినట్టు చేసుకుంటున్నారు. ఈ విషయాలన్నింటినీ ప్రజలకు పారదర్శకంగా విడమరిచి చెబుతాం.
- వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లుల విషయంలో కేరళ, పంజాబ్ తరహాలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు మీ ప్రభుత్వం కొన్ని చట్టాలు తీసుకు రావొచ్చు కదా...?
అవి ఎంత వరకు చెల్లుతాయనే విషయాన్ని న్యాయపరంగా కూడా చూడాలి. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలను ఇవి అధిగమించగలవా...? అనే అంశాన్ని పరిశీలించాలి. ఈ విషయంలో వైరుధ్యాలు, విభిన్న అభిప్రాయాలున్నాయి.
- జీహెచ్ఎమ్సీ విషయానికొస్తే... హైదరాబాద్ నగరంలో అత్యధికంగా ఉన్న అసంఘటిత, సంఘటిత రంగ కార్మికులు, దినసరి కూలీలు, ఇతర పేదల ఉపాధి, జీవన ప్రమాణాల మెరుగుదల కోసం ఏం చేయబోతున్నారు...?
అత్యంత పేద వారి సంక్షేమం కోసం మేం పాటుబడుతున్నాం. హైదరాబాద్లోని కార్మికులు, దినసరి కూలీల విషయానికొస్తే వారు పనిజేస్తున్న కంపెనీలు, ఫ్యాక్టరీలకు 24 గంటలపాటు కరెంటును ఇవ్వటం, ప్రగతిశీల విధానాలు, రాయితీల ద్వారా వారు మూడు పూటలా తిండి తినేలా చేయగలిగాం. దీంతోపాటు ప్రభుత్వరంగంలోని పరిశ్రమలకు పెద్ద పీట వేశాం. ఇదే సమయంలో ప్రయివేటు రంగాన్నీ ప్రోత్సహించాం. తద్వారా సమతుల్యంగా వ్యవహరించాం, కార్మికుల ప్రయోజనాలను కాపాడాం. మున్ముందు కూడా ఇవే విధానాలను కొనసాగిస్తాం. మేం రాకముందు జీహెచ్ఎమ్సీలో పారిశుధ్య కార్మికుల నెల వేతనం రూ.8,500గా ఉంది. ఇప్పుడు దాన్ని రూ.17,500కు పెంచాం. మున్సిపాల్టీల్లో వారి జీతం రూ.7,500గా ఉంది. అదిప్పుడు రూ.12,500కు పెంచాం. దాన్ని రూ.14 వేలకు పెంచాలనుకుంటున్నాం. ఈ రకంగా పేదలు, కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతున్నాం.
- హైదరాబాద్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీలో ఎందుకు జాప్యం జరుగుతున్నది...?
జీహెచ్ఎమ్సీ పరిధిలో మొత్తం 111 లొకేషన్లలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించాం. అవి 90 నుంచి 95 శాతం వరకూ పూర్తయ్యాయి. అయితే కరోనా వల్ల కూలీలు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతోపాటు ఆర్థిక వ్యవస్థ దెబ్బతినటంతో బిల్లుల విడుదలలో కూడా జాప్యం జరిగింది. ఫలితంగా వాటి పంపిణీలో కొద్దిగా జాప్యం, ఆలస్యం, అసౌకర్యం కలిగిన మాట వాస్తవమే. నిజానికి మేం మొన్న దసరా నాటికి వాటిని పూర్తి చేసి, లబ్దిదారులకు ఇవ్వాలనుకున్నాం. కానీ కరోనా వల్ల అది సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత ఎక్కడెక్కడ పూర్తయ్యాయో అక్కడక్కడ వాటిని దశల వారీగా లబ్దిదారులకు అందజేస్తాం. తెలంగాణ వ్యాప్తంగా రూ.18 వేల కోట్లతోనూ, హైదరాబాద్లో రూ.9,700 కోట్లతో డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మిస్తున్నాం. ఇలా నిర్మిస్తున్న ఏకైక ప్రభుత్వం మాదే.
- ఇప్పుడు ఎంఐఎం మా ప్రధాన ప్రత్యర్థి అని చెబుతున్న మీరు... గతంలో అసెంబ్లీలో అదే మజ్లీస్ పార్టీ... మాకు ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పారు... దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు...?
మేం బీజేపీతో కూడా ఫ్రెండ్లీగా ఉన్నాం. ఆ విషయాన్ని మీరు మరిచిపోవద్దు. విధానపరంగా ఆ పార్టీకి అనేకాంశాల్లో మద్దతిచ్చాం. అంతమాత్రాన ఎన్డీయేతో కలిసి పనిచేస్తామా...? ఇదే విధంగా వివిధ అంశాల్లో ఎంఐఎం మాకు మద్దతిస్తే తీసుకున్నాం. ఇప్పుడు బీజేపీకి అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు... వారు రేపు ఏదైనా అంశాల్లో మాకు మద్దతిస్తే కచ్చితంగా తీసుకుంటాం. సైద్ధాంతికంగా బీజేపీతో మాకు పడదు. అంతమాత్రాన ఆ పార్టీ ఏది చేసినా వ్యతిరేకించాల్సిందేనా...? అంశాలు, విధానాల ఆధారంగా వ్యతిరేకించాలి తప్పితే గుడ్డిగా కాదు. గతంలో బీజేపీకి మద్దతిచ్చాం. ఇప్పుడు అదే పార్టీతో పోరాడుతున్నాం. ఇదే సూత్రం ఎంఐఎంకూ వర్తిస్తుంది. రేపు ఆ పార్టీ ఏదైనా మద్దతిస్తే కచ్చితంగా తీసుకుంటాం.
- కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్ని ఎందుకు సమీకరించటం లేదు..? ఈ విషయంలో కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నారన్న విమర్శ మీ పార్టీపై ఉంది కదా...?
జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో చేస్తున్నది అదే కదా? బీజేపీకి వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరిస్తున్నాం కదా..? కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టాలనే ఆలోచన ఉంది. ఏయే అంశాల్లో ప్రజల్ని ఎలా సమీకరించాలి..? ఎలా ప్రజాశక్తిని చూపెట్టాలనే విషయాలను జీహెచ్ఎమ్సీ ఎన్నికల తర్వాత ఆలోచిస్తాం.
- కరోనా వ్యాక్సిన్ పేరుతో ప్రధాని మోడీ హైదరాబాద్కు వస్తున్నారు. దీన్ని పరోక్షంగా ఎన్నికల ప్రచారంగా భావించవచ్చా...?
దీనిపై నేను ఇప్పుడే మాట్లాడటం సరికాదు. మోడీ పెద్ద పదవిలో ఉన్నారు. ఆయన రాకకు మా స్వాగతం. 'తప్పకుండా రండి, ఇరానీ ఛారు తాగండి, హైదరాబాద్ బిర్యానీ రుచి చూడండి... కానీ ఉత్త చేతుల్తో కాకుండా హైదరాబాద్కు, తెలంగాణకు నిధులు తీసుకురండి...' అని మేం ప్రధానిని కోరుతున్నాం.
- ఇంతకూ జీహెచ్ఎమ్సీలో టీఆర్ఎస్ ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతున్నది...?
కచ్చితంగా వంద డివిజన్లలో విజయం సాధిస్తాం. గతంలో కూడా ఒక్క సీటు తేడాతో సెంచరీ మిస్సయ్యాం. ఈసారి మాత్రం సెంచరీ కొట్టి తీరతాం. ఎలాంటి అవరోధాలు, ఎక్స్ అఫిషియో అవసరం లేకుండానే మేం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం. మా పార్టీకి చెందిన మహిళా అభ్యర్థే మేయర్ అవుతారు. అదే విధంగా డిప్యూటీ మేయర్ సీట్లోనూ మా పార్టీ వారే కూర్చుంటారనే విశ్వాసం మాకుంది.