Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వామపక్ష పార్టీల అభ్యర్థులను గెలిపించండి:సీఐటీయూ, ఏఐటీయూసీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక చట్టాలు తెచ్చిన బీజేపీని ఓడించాలనీ, వామపక్ష పార్టీల అభ్యర్థులను గెలిపించాలని సీఐటీయూ, ఏఐటీయూసీలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు శనివారం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, ఎం.సాయిబాబు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.బాలరాజు, వి.ఎస్.బోస్ ఒక ప్రకటన విడుదల చేశారు. మతతత్వ బీజేపీ, ఎంఐఎం పార్టీలను ఓడించాలని కోరారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా అసంబద్ధ వ్యాఖ్యలతో బీజేపీ, ఎంఐఎం పార్టీలు మత విద్వేషాలను రెచ్చగొట్టి ఓటర్లను అయోమయానికి గురి చేస్తున్నాయని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయనీ, ఈ ఎన్నికల్లో ఆయా పార్టీలకు ప్రజా ఎజెండా లేనట్టు కేవలం రెచ్చగొట్టే ఎజెండాలనే ముందుకు తెస్తున్నాయని తెలిపారు. ఇవి ప్రజాస్వామ్య దేశంలో అసమంజసమైన చర్యలని అభిప్రాయపడ్డారు.
బీజేపీ ప్రభుత్వం పెట్టుబడీదారులు, కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకు కార్మిక వ్యతిరేక కోడ్ లను తెచ్చిందనీ, కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కును, సమ్మె చేసే హక్కును హరించిందనీ, ఎనిమిది గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచిందని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలను పెంచకుండా కార్మికులను కట్టుబానిసలుగా తయారు చేస్తున్నదన్నారు. 2020 వ్యవసాయ చట్టాల ద్వారా దేశంలోని పేద ప్రజల ఆహార భద్రతను హరిస్తున్నదన్నారు. వ్యవసాయ రంగంలో పని చేస్తున్న కోట్లాది మంది కార్మికుల కనీస జీవన ఉపాధికి గండి కొడుతున్నదన్నారు. వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి రైతులపై దాడి చేస్తున్నదన్నారు. నిత్యావసర సరుకుల నియంత్రణ చట్టానికి తూట్లు పొడిచి సామాన్య ప్రజానీకంపై భారం మోపేందుకు తెరతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను అతి చౌకగా అమ్మకానికి పెట్టిందనీ, మోటారు వాహన చట్టంలో మార్పులు చేసి ఆటోలు, ట్రాలీలు, ద్విచక్ర వాహనదారులపై చలాన్ల రూపంలో నకరం చూపిస్తున్నదని విమర్శించారు.
డిసెంబర్ ఒకటిన జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మతతత్వాన్ని రెచ్చగొట్టే పార్టీలకు కార్మికవర్గం బుద్ధి చెప్పాలన్నారు. రాజధానిలో మత సామరస్యానికి భంగం కలగకుండా కార్మికవర్గం ఐక్యతను ప్రదర్శించాలని సూచించారు. నగర ప్రశాంతత దెబ్బతింటే పేదలు, కార్మికులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు, కార్మికులకు అండగా నిలుస్తూ పోరాటాల్లో అగ్రభాగాన నిలిచే వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.