Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోక్ సభ స్పీకర్కు రేవంత్రెడ్డి ఫిర్యాదు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో ప్రోటోకాల్ పాటించలేదని ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి చెప్పారు. స్థానిక ఎంపీనైనా తనకు ఆహ్వానం లేకపోవడం ప్రోటోకాల్ ఉల్లంఘనేనని తెలిపారు. ప్రధాని పర్యటన వ్యక్తిగతం కాదనీ, బీజేపీ సొంత కార్యక్రమమూ అంతకంటే కాదని గుర్తు చేశారు. ఆ పర్యటనకు తనను ఆహ్వానించకపోవడంపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేయనున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో తన నిరసన తెలియజేస్తానన్నారు.
పీఎం కేర్ నుంచి ఎంతిచ్చారో చెప్పండి : మధుయాష్కీ
లాక్డౌన్ సమయంలో ప్రధాని నరేంద్రమోడీ కరోనాను పట్టించుకోలేదని మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ విమర్శించారు. ఇప్పుడేమో కరోనా వ్యాక్సిన్ పరిశీలన కోసమంటూ హైదరాబాద్ వచ్చి రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పీఎం కేర్ నుంచి తెలంగాణకు ఎంత సహాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రెండో దశ కరోనాను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్రంలో కరోనా అరికట్టడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు డీజీపీ, సీపీ ఏజెంట్లుగా మారారని ఆరోపించారు. మత అల్లర్లపై పూర్తి సమాచారం ఉంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.
మూడు కంపెనీలనే ఎందుకు పరిశీలించారు : పొన్నాల లక్ష్మయ్య
దేశంలో ఏడు కంపెనీలు కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తుంటే కేవలం మూడు కంపెనీలను మాత్రమే ఎందుకు పరిశీలించారని పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మోడీని ప్రశ్నించారు. బీజేపీ అగ్ర నాయకులంతా హైదరాబాద్లో ఉంటే ఆయనా హైదరాబాద్కు రావడం ఎన్నికల కుతంత్రం కాదా? అని ప్రశ్నించారు. దుబ్బాక ఎన్నికల సమయంలో కేసీఆర్ కూడా అక్కడకు వెళ్లకుండా కొడకండ్ల గ్రామంలో ప్రసంగించారని గుర్తు చేశారు. మోడీ పర్యటనలో కేసీఆర్కు ఆహ్వానం లేకపోవడం రాష్ట్ర ప్రజలను అవమాన పరిచినట్టేనన్నారు.