Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతతత్వం అందరిని బాధిస్తున్నది : ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ నగరానికున్న నాలుగు వందల ఏండ్ల సహజీవన చరిత్రను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులు కె.శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీ జర్నలిస్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో సోమాజీగూడ ప్రెస్క్లబ్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ మతతత్వం మైనార్టీలనే కాకుండా సమాజమంతటిని బాధిస్తున్నదని గుర్తించాలన్నారు. హైదరాబాద్లో భారీ వర్షాల సందర్భంగా కలిగిన భయం మళ్లీ కలుగుతున్నదన్నారు. సమాజాన్ని విభజించే పని చాప కింద నీరులా పెరుగుతున్నదని అభిప్రాయపడ్డారు. అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం కోసం, ప్రాంతానికి అన్యాయం జరిగిందని భావించినప్పుడు కులం, ప్రాంతం పేరుతో ఓట్లు అడగడంలో తప్పేమి లేదని అభిప్రాయపడ్డారు. అయితే మతం పేరుతో ఓట్లు అడగడాన్ని ఆయన తప్పుపట్టారు. సర్జికల్ స్ట్రైక్స్ వంటి పదాలను ఉపయోగించడం ద్వారా హైదరాబాద్ ను రెండుగా చేసే ప్రయత్నం జరిగిందన్నారు.
హైదరాబాద్లోని ముస్లీంలు, పాతనగరం గురించి తెలియనితనాన్ని అనుకూలంగా మలుచుకుని భయాన్ని పెంచేందుకు కుట్ర పన్నారని చెప్పారు. పాతబస్తీ గురించి విషయాలను కొత్తనగరానికి తెలిసేలా ఉర్ధూయేతర అంటే తెలుగు, ఇంగ్లీష్ మీడియా బాధ్యత తీసుకోవాలని సూచించారు. తమ ప్రసార, ప్రచార మాధ్యమాల్లో తగిన స్థలాన్ని అందుకోసం కేటాయించాలని కోరారు. హైదరాబాద్లో నెలకొన్న పరిస్థితులను బీజేపీ, ఎంఐఎం పార్టీ అనుకూలంగా మలుచుకున్నాయన్నారు. అయితే ప్రగతికాములు, ప్రజాస్వామికవాదులు, ఆలోచనాపరులు, మేధావులు, ప్రశ్నించే గొంతుకలను అణచిన టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రస్తుత పరిస్థితి అంతే కారణమని విమర్శించారు. రాజకీయ నాయకులు చిన్న, చిన్న కామెంట్లపై స్పందించే ఎన్నికల సంఘం సర్జికల్ స్ట్రైక్స్ వంటి వాటిపై మౌనంగా ఎందుకుందని ప్రశ్నించారు. ఎంఐఎం పార్టీని తాను సమర్థించడం లేదంటూ ఆ పార్టీ శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్ టీఎల్) లోపల నిర్మాణాలను కూలుస్తామంటే, అక్కడ మత ప్రస్తావన ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఉర్ధూ, తెలుగు, ఇంగ్లీష్ మీడియాల పాత్రికేయుల మధ్య తరచూ చర్చలు జరగాలన్నారు. మెజార్టీ మతానికి చెందిన వ్యక్తిగా తనకు భద్రత పట్ల ఆందోళన లేదనీ, అయితే చైతన్యవంతునిగా, ఆలోచనాపరునిగా సర్జికల్ స్ట్రైక్ వంటివి విన్నప్పుడు భయమేసిందని తెలిపారు. సమాజంలో అలరు బలరులు పెరగాలని ఆకాంక్షించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్ విచ్ఛిన్నకర శక్తుల చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. రెచ్చగొట్టి, భయపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని హెచ్చరిం చారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వినియోగించేందుకు సరైన అవకాశాలు కల్పించాలని కోరారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారితో ప్రజల ఇబ్బందులు, లాక్డౌన్ కష్టాలు, నగరాన్ని విడిచి వెళ్లిన వలస కార్మికుల బాధలు ఎన్నికల ఎజెండా కాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైతన్యవంతులైన నగర ప్రజలు తగిన బుద్ది చెబుతారన్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ మాట్లాడు తూ కరోనా కన్నా మతమనే వైరస్ ప్రమాదకరమన్నారు. ఏ మతం కూడా తనను ఓట్ల కోసం వాడుకోమని చెప్పలేదని గుర్తుచేశారు. ఎంఐఎం, బీజేపీ పార్టీలు నువ్వు గిల్లినట్టు చెరు...నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టు చేస్తున్న రాజకీయాలు లక్షలాది మందిని మనస్థాపానికి గురి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మారుతీసాగర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిక్కచ్చిగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. మతం ప్రాతిపదికన ఓట్లు అడగడం బాధాకరమన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చిందనీ, ఈ చైతన్యం మరింత పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో సామాజికవేత్త డాక్టర్ ఎస్.ఎ.రషీద్, జర్నలిస్టులు ఆజంఖాన్, రహెమాన్, ఇస్మాయిల్, షరీఫ్ తదితరులు మాట్లాడారు. సమావేశానికి ఎంజేఎఫ్ నాయకులు యూసుఫ్ బాబు అధ్యక్షత వహించారు.