Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్వీకే వెబినార్లో ప్రొఫెసర్ మాయాపండిట్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ మూలసూత్రాలను విస్మరించి, మనువాదభావజాల వ్యాప్తిని చేపడుతున్నదని ప్రొఫెసర్ మాయాపండిట్ అన్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన చర్య అని చెప్పారు. రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను పాలక బీజేపీ ప్రభుత్వం సహించలేకపోతున్నదని విమర్శించారు. మహాత్మాపూలే 129వ వర్ధంతి సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శనివారం 'మహాత్మాపూలే నేడు ఆయన ప్రాధాన్యత' అంశంపై వెబినార్ జరిగింది. దీనిలో ప్రధాన వక్తగా ప్రొఫెసర్ మాయాపండిట్ మాట్లాడారు. రాజ్యాంగం స్థానంలో మనువాదాన్ని చొప్పించే ప్రయత్నాన్ని బీజేపీ, సంఫ్ుపరివార్ చేస్తున్నాయనీ, మహిళల బతుకులు బీజేపీ ప్రభుత్వ హయాంలో పూర్తి అభద్రతలో ఉన్నాయనీ ఆందోళన వ్యక్తం చేశారు. నూతన విద్యావిధానం పేరుతో సార్వత్రిక విద్యను కొందరికే పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కర్మ సిద్ధాంతం పేరుతో విద్యారంగాన్ని బ్రాహ్మణేతరులకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారనీ, అందుకే విద్యారంగాన్ని కార్పొరేటీకరణ చేస్తున్నారనీ వివరించారు. ఏ హక్కుల కోసం అయితే ఇప్పుడు పాలకులపై కొట్లాడుతున్నామో...వాటి కోసం వందేండ్ల క్రితమే పులే గళం ఎత్తారని చెప్పారు. పీష్వాల కాలంలో అగ్రవర్ణ మహిళలకు సైతం విద్యార్జన ఉండేదికాదనీ, వారిని లైంగిక వాంఛలు తీర్చే వస్తువులుగానే చూసేవారని తెలిపారు. క్రిస్టియన్ మిషనరీ పాఠశాలల్లో కులానికి సంబంధం లేకుండా చదువుకొనే అవకాశం పూలేకు దక్కిందని చెప్పారు. 13 ఏండ్లకే వివాహం చేసుకున్న ఆయన, భార్య సావిత్రీబాయి పులేకు విద్య నేర్పించి, ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారని తెలిపారు. బ్రాహ్మణకులంలో వితంతువులు ఎక్కువగా ఉండేవారనీ, వారిలో పునర్వివాహం లేదని, వారితో లైంగిక వాంఛలు తీర్చుకొని వదిలేసేవారని వివరించారు. గర్భం ధరిస్తే ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పడేవారనీ, వారికోసం పూలే అనాధాశ్రమం ఏర్పాటు చేసి, సరికొత్త ఆలోచనలు రేకెత్తించారని చెప్పారు. సతీసహగమనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, భ్రూణహత్యలకు పాల్పడొద్దనీ, ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ వితంతు వివాహాలను ప్రోత్సహించారని తెలిపారు. పూలే ఆధ్వర్యంలో దేశంలో మొదటి సాంస్కృతిక సమ్మె జరిగిందన్నారు. బ్రాహ్మణ మహిళలకు శిరోముండనం చేయబోమని మంగలి వృత్తి వారితో సమ్మె చేయించారని చెప్పారు. వందేండ్ల క్రితమే సార్వత్రిక విద్య ప్రాధాన్యత గురించి జ్యోతిబా పూలే చెప్పారనీ, మాతృభాషలోనే విద్యాబోధన జరగాలనీ ప్రతిపాదించారన్నారు. బ్రాహ్మణాధిపత్య భావజాలాన్ని, కర్మ సిద్ధాంతాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. బ్రాహ్మణ ఆధిపత్యం కోసం నిచ్చెనమెట్ల కులవ్యవస్థను ప్రచారం చేశారనీ, దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, గళం ఎత్తారని చెప్పారు ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇదే తరహా బ్రాహ్మణాధిపత్య కులవ్యవస్థను పునర్నిర్మించాలని ప్రతిపాదిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగానికి నీటి పారుదల సౌకర్యాలు కల్పించాలనీ, వారి పిల్లలకు విద్యావకాశాలు కల్పించాలనీ డిమాండ్ చేశారు. విద్యారంగంలో వందేండ్ల క్రితం జ్యోతిబాపూలే ఏ డిమాండ్లయితే చేశారో...ఇప్పుడు దానికోసం మనం ఆందోళనలు చేస్తున్నామన్నారు. అది ఆయన దార్శనికతకు నిదర్శనమని కొనియాడారు. కార్యక్రమానికి ఎస్వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ అధ్యక్షత వహించారు. విశ్లేషకులు కొండూరి వీరయ్య అనువాదకులుగా వ్యవహరించారు.