Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిసెంబరులో సమావేశాన్ని స్వాగతిస్తున్నాం
- నికరంగా నిలబడితేనే రాష్ట్రానికి ప్రయోజనం
- గ్రేటర్ ఫలితాలపై టీఆర్ఎస్ వైఖరి ఆధారపడి ఉంది
- తిట్లదండకంతో ప్రజాసమస్యలు గాలికి
- జీహెచ్ఎంసీలో వామపక్షాలకు ప్రజలు ప్రాతినిథ్యమివ్వాలి: సీపీఐ(ఎం) రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
''బీజేపీని నిలువరించేందుకు కేసీఆర్ కలిసి రావాలి.. డిసెంబరులో నిర్వహించే బీజేపీయేతర పార్టీల సమావేశాన్ని స్వాగతి స్తున్నాం..విశాలమైన ఐక్యవేదిక ఏర్పాటు అవసరం..నికరంగా పోరాడితేనే ప్రయోజనం..ఎంఐఎం, బీజేపీ ఒకే తాను ముక్కలే..జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజాసమస్యలు కాకుండా మతోన్మాదాన్ని ఎజెండా చేయడం సరికాదు..ప్రజల్లో ఆ పార్టీలు భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి.. ఎన్నికల కోసమే ప్రధాని వచ్చారు.. మతోన్మాదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్కు ఎజెండా లేదు..గ్రేటర్ ఎన్నికల్లో వామపక్షాలకు ప్రాతినిథ్యం కల్పించాలని'' సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో నవతెలంగాణ ప్రతినిధి బి.బసవపున్నయ్యకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇలా..
బీజేపీయేతర పార్టీలతో కేసీఆర్ డిసెంబరులో హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు ? కార్యాచరణలోకి వస్తుందంటారా ?
ఇది మంచి పరిణామం. కేసీఆర్ ఆ ప్రకటన చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా కేరళ, పంజాబ్ రాష్ట్రాలు ముందుకొచ్చాయి. రాష్ట్రంలోనే ఆ తరహా ప్రయత్నం జరగాలి. ఇక్కడ రాజకీయ పార్టీలు, సంస్థలతో కలిసి విశాల ఐక్యవేదిక ఏర్పాటుచేస్తే సత్ఫలితాలు వస్తాయి. అధికారంలో ఉన్న పార్టీగా, రాష్ట్రంలో పెద్ద రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ ఉంది. బీజేపీని నిలువరించే పోరాటంలో శాశ్వతవైఖరి తీసుకుంటే ప్రయోజనం కలుగుతుంది. అయితే గ్రేటర్ ఎన్నికల ఫలితాలపైనే టీఆర్ఎస్ వైఖరి ఆధారపడే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల్లో ప్రజాసమస్యలు ఎజెండా కావడం లేదు ? ఎందుకని ?
గత ఆరేండ్ల కాలంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయాయి. ఉద్యోగాలు, ధరలు, నల్లధనం, డబుల్బెడ్రూమ్ ఇండ్లు, విద్య, వైద్య రంగాల్లోని సమస్యలు పరిష్కారం కాలేదు. ప్రజలు సంతృప్తిగా లేరు. ఈనేపథ్యంలో ఆ రెండు పార్టీలు ప్రజా సమస్యలపై కాకుండా ఇతర విషయాలపై చర్చ చేస్తూ దూషణలకు దిగుతున్నాయి. మతప్రాతిపదికన ఓట్లు అడిగేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. బండి సంజరు మాట్లాడే మాటలే ఇందుకు నిదర్శనం. సర్జికల్ స్ట్రైక్ అంటూ భయాన్ని సృష్టించే ప్రయత్నంలో ఉన్నారు.
బీజేపీ, ఎంఐఎం వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలంటారు ?
ఈ రెండు పార్టీలు మతం పేరు మీద ఒకరికి వ్యతిరేకంగా మరొకరు విమర్శలు చేసుకుంటున్నాయి. మతోన్మాద ఎజెండాతో ప్రజలను మోసం చేస్తున్న ఈ రెండు పార్టీలు తోడు దొంగలే. ముస్లిం ఓట్లను చీల్చడమే ఎంఐఎం లక్ష్యంగా ఉన్నది. హైదరాబాద్లో ఎంఐఎం, బీజేపీ పరస్పరం విమర్శలు చేసుకుంటూనే సహకరించుకుంటున్నాయి. ఇది ప్రజలను మోసం చేయడమే. సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బండి సంజరు, పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలని అక్బరుద్ధీన్ అనడం సరికాదు. మతాల మధ్య విభజన మంచిదికాదు. దీంతో లౌకిక పునాది దెబ్బతింటుంది. ప్రజలు అర్థం చేసుకోవాలి.
ఈ విషయాన్ని ప్రజలకు ఎలా అర్థం చేయిస్తారు?
హైదరాబాద్ బాగుపడాలంటే ఇటు బీజేపీ అటు ఎంఐఎం ఓడిపోవాలి. ఈ రెండు పార్టీలను ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించాలి. ఘర్షణలు పెరిగితే నగరంతోపాటు రాష్ట్రం దెబ్బతింటుంది. రాజకీయ పరిణామాలు మారతాయి. తెలంగాణ సెక్యులర్ సమాజం నష్టపోతుంది. దీనికి కమ్యూనిస్టులుగా బుక్లెట్లు, కరపత్రాలతోపాటు సభలు, సమావేశాలు పెట్టి ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కృషి ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది.
ొఈ సమయంలో ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనను ఎలా అనుకోవాలి ?
వ్యాక్సిన్ పేరుతో పరోక్షంగా స్థానిక ఎన్నికల ప్రచారానికి వచ్చారు. నేరుగా ప్రచారానికి రావాలని ఉన్నా, ఇక్కడి పరిస్థితుల నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలవకపోతే ఇబ్బంది అవుతుందనే కారణంతో వ్యాక్సిన్ను అడ్డంపెట్టుకున్నారు.
తొలుత అన్ని చట్టాలు, బిల్లులకు మద్దతిచ్చిన టీఆర్ఎస్, బీజేపీ పట్ల వైఖరిని ఎందుకు మార్చుకుంది ?
అవును. టీఆర్ఎస్ వైఖరిలో మార్పు వచ్చింది. మేము దీనిని స్వాగతిస్తున్నాం. కొనసాగాలని భావిస్తున్నాం. రాజకీయ అధికారానికి నష్టం జరుగుతుందనే భావనే టీఆర్ఎస్ వైఖరిలో మార్పుకు బలమైన కారణం. దుబ్బాక ఎన్నికల్లో స్థానికంగా ఉన్న అసంతృప్తిని వాడుకుని బీజేపీ విజయం సాధించింది. రాష్ట్రం బాగుపడాలంటే బీజేపీపై పోరాటం చేయాల్సిందే.
ఈ టీఆర్ఎస్ వైఖరి శాశ్వతమేనా ?
బూర్జువా పార్టీల్లో నిజాయితీ గానీ, ఏదైనా ఒక విషయంపై స్పష్టమైన ఒకే వైఖరి శాశ్వతంగా ఉండదు. రాష్ట్రానికి టీఆర్ఎస్ మేలుచేస్తే మద్దతిస్తాం. మళ్లీ తప్పుచేస్తే వ్యతిరేకిస్తాం. ప్రజాభివృద్ధి, సంక్షేమం కోసం పోరాటాలు, ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉంటాం.
గ్రేటర్ ఎన్నికల్లో వామపక్షాల పరిస్థితి ఎలా ఉంటుందంటారు ?
150 స్థానాలకుగాను 29 డివిజన్లలో పోటీచేస్తున్నాం.వీటితో అధికారం కోరే పరిస్థితి లేదు. సమస్యలపై ఉమ్మడిగా సమగ్ర మ్యానిఫెస్టోను ప్రజలముందుంచాం. కార్పొరేషన్లో ప్రాతినిథ్యం ఇవ్వమని వారిని కోరుతున్నాం. ఎంత సంఖ్యలో గెలిస్తే అంతగా పాలకపక్షంపై పోరాటం చేస్తూ ప్రజాసమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. గతంలో జీహెచ్ఎంసీలో సమస్యలపై చర్చ జరిగినట్టుగా నేను చూడలేదు. కమ్యూనిస్టులు ఉంటే ఆ లోపాన్ని సరిచేస్తారు. వామపక్షాల్లేని అసెంబ్లీ ఈ రోజు ఎలా ఉందో, ఇప్పటికే ప్రజలు గ్రహించారు. అందుకే గ్రేటర్ హైదరాబాద్లో వామపక్షాలను ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
గ్రేటర్ ఎన్నికలకు బీజేపీ నేతలంతా రావడం వెనుక వ్యూహామేంటి ?
బీజేపీ తన అసలు అజెండాను అమలుచేయడం ప్రారంభించింది. మతోన్మాదం, ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే భాష, ఒకే మార్కెట్ అంటూ ముందుకుపోతున్నారు. సొంత ఎజెండా హందూత్వ అమలుకు ప్రయత్నిస్తున్నారు. భారత రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు. ఏ ఎన్నిక జరిగినా సరే అక్కడ టెన్షన్ సృష్టిస్తున్నారు. అందులో భాగంగా కాషాయదళం దేశమంతా తిరుగుతున్నది. మోడీతోపాటు యోగి ఆదిత్యనాథ్, అమిత్షా వెళుతున్నారు. బీహార్, యూపీ ఎన్నికలు గమనిస్తే అర్థమవుతున్నది.
బీజేపీ డబ్బులు కుమ్మరిస్తున్నది కదా ?
అవును. దేశంలో ఏ ఎన్నిక జరిగినా బీజేపీ మతపరమైన అంశాలతోపాటు డబ్బునూ వాడుకుంటున్నది. గ్రేటర్ ఎన్నికల్లో ఒక్కొక్కరికి రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు పెట్టి సాధారణ ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. ఉన్మాదాన్ని ఎక్కిస్తూ ఎన్నికల ప్రయోజనాలను నెరవేర్చుకునే ప్రమాదకర విధానాన్ని బీజేపీ అనుసరిస్తున్నది. దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ? ఉనికిలో ఉంటుందా ?
దాని ప్రధాన బలహీనత బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయకపోవడం. అంతేగాక అదే బాటలో వెళ్లే ప్రయత్నం చేస్తున్నది. ప్రస్తుతం దివాళస్థితికి చేరింది. బీజేపీ వ్యతిరేక పోరాటంలో ఆ పార్టీకి స్పష్టత లేదు. 2014లో ఓడిపోయిన తర్వాత కారణాలను విశ్లేషించడానికి ఆపార్టీ ఆంటోనీ కమిటీ వేసింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టులో కాంగ్రెస్ను ముస్లిం పార్టీగా, బీజేపీని హిందువుల పార్టీగా ప్రజలు విశ్వసిస్తున్నారనీ, అందుకే ఓడిపోయామని చెప్పారు. పార్టీని సరిచేసే ప్రయత్నంలో హిందూత్వకు అనుకూల వైఖరిని తీసుకుంది. బీహార్ ఎన్నికల్లో సాధువులను తీసుకొచ్చి ప్రచారం చేయించుకోవడం ఇందుకు నిదర్శనం. ఈ వైఖరి బీజేపీకి లాభం చేసింది.