Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సబితారెడ్డి, సుధీర్రెడ్డి ఇలాకాల్లో బీజేపీ స్వీప్
- ఎమ్మెల్సీ కవిత ఇన్చార్జిగా ఉన్న గాంధీనగర్లోనూ..
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఓటర్లు షాక్ ఇచ్చారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఇన్చార్జిగా వ్యవహరించిన దేవిరెడ్డి సుధీర్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎల్బీనగర్ నియోజకవర్గంలో 11వార్డులను బీజేపీ కైవసం చేసుకుంది. మంత్రి సబితారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కేపురం, సరూర్నగర్ వార్డుల్లోనూ బీజేపీ గెలిచింది. మంత్రి తలసాని ఇలాకలోని మోండా మార్కెట్, రాంగోపాల్పేట్ వార్డులో బీజేపీనే గెలిచింది. ఎమ్మెల్సీ కవిత ఇన్చార్జిగా వ్యవహరించిన గాంధీనగర్ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి.. ఎమ్మెల్యే ముఠా గోపాల్ మరదలు ముఠా పద్మ ఓడిపోయారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇన్చార్జిగా ఉన్న అడిక్మెట్ వార్డులోనూ బీజేపీ అభ్యర్థి చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థి హేమలత ఓడిపోయారు. మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి బాధ్యత తీసుకున్న మల్కాజ్గిరి నియోజకర్గంలో మూడు వార్డుల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది. నేరేడ్మెట్ వార్డు ఫలితాలను ఆపేశారు. మంత్రి సత్యవతిరాథోడ్ బాధ్యత తీసుకున్న ఉప్పల్ నియోజకవర్గంలో నాలుగు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. హోంమంత్రి మహమూద్అలీ బాధ్యత తీసుకున్న రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అన్ని వార్డులోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. ఇక ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ తన పరిధిలోని ఆరు వార్డుల్లో ఒక్కరినీ గెలిపించుకోలేకపోయారు. ఇక అంబర్పేట్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆరు వార్డులకుగాను రెండు వార్డులను గెలిపించుకున్నారు. నాలుగు వార్డులను బీజేపీ కైవసం చేసుకుంది. హబ్సిగూడలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డి భార్య స్వప్న బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.