Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.70 వేల లంచం తీసుకుంటూ ఏఈ స్వామినాయక్..
- 40వేలు తీసుకుంటూ పట్టుబడిన గుండాల ఎస్ఐ
నవతెలంగాణ-మిర్యాలగూడ/గుండాల
లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో ఇద్దరు అధికారులు చిక్కారు. రూ.70వేలు తీసుకుంటూ ఏఈ స్వామినాయక్, రూ.40వేల లంచం తీసుకుంటూ గుండాల ఎస్ఐ పట్టుబడ్డారు. ఈ ఘటనలు శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, గుండాల మండలాల్లో జరిగాయి. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
నల్లగొండ జిల్లా సర్వశిక్షా అభియాన్లో ఇస్లావత్ స్వామినాయక్ ఏఈగా పని చేస్తున్నారు. పెద్దవూర ఆదర్శ పాఠశాల భవన నిర్మాణ నిధులు రూ.4 లక్షలు బిల్లు చేసేందుకు కాంట్రాక్టర్ సోమ్లానాయక్ను రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు. దాంతో సోమ్లానాయక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల సూచన మేరకు.. ఏఈ స్వామినాయక్కు ముందస్తుగా రూ.70 వేలు చెల్లిస్తానని, మీరు చెప్పిన చోటుకు వస్తానని కాంట్రాక్టర్ చెప్పాడు. మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్ సమీపంలోకి రావాలని స్వామినాయక్ చెప్పాడు. ఆ విషయాన్ని కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు తెలియజేశాడు. దాంతో స్వామినాయక్ లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
గుండాల ఎస్ఐ చందర్..
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మాసాన్పల్లి గ్రామానికి చెందిన ఖాసీం హైదరాబాద్ బేగంపేటలో నివాసముంటూ బియ్యం వ్యాపారం చేస్తున్నాడు. అక్టోబర్ 29న పీడీఎస్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని గుండాల ఎస్ఐ చందర్నాయక్ పట్టుకుని, ఖాసీంను అరెస్టు చేశారు. వాహనాన్ని సీజ్ చేశారు.
ఖాసీం నవంబర్ 2న బెయిల్పై రిలీజ్ అయ్యాడు. పట్టుబడిన వాహనాన్ని విడిపించుకునేందుకు వాహన యజమాని హైకోర్టులో దరఖాస్తు చేసుకుని వాహనం రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. అయితే, వాహనాన్ని ఇచ్చేందుకు నవంబర్7న ఎస్ఐ బి.చందర్నాయక్ రూ.50 వేల లంచం డిమాండ్ చేశాడు. అంతేకాడు, 'నీ వ్యాపారం యథావిధిగా కొనసాగాలంటే నెలకు రూ.30వేలు ఇవ్వాలి' అని డిమాండ్ చేశాడు. దాంతో సదరు వ్యాపారి ఏసీబీని ఆశ్రయించాడు. వారు చెప్పిన ప్రకారం ఖాసీం రూ.40 వేలు ఇస్తానని ఎస్ఐకి చెప్పాడు. ఎస్ఐ చెప్పిన విధంగా గుండాల పెట్రోల్ బంకులో సూపర్వైజర్ గణేష్కు ఖాసీం రూ.40 వేలు ఇచ్చి వెళ్లగానే ఏసీబీ అధికారులు పట్టుకుని విచారించారు. ఎస్ఐ తీసుకోమంటేనే తీసుకున్నానని గణేష్ చెప్పడంతో చందర్నాయక్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉన్నట్టు ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ తెలిపారు.