Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిట్టింగులపై వ్యతిరేకత
- ఎల్ఆర్ఎస్పైనా కోపం
- ముంచిన అసమగ్ర వరదసాయం
- ఫలితం... 99 సీట్ల నుంచి 55కు పడిపోయిన వైనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'దుబ్బాక ఉప ఎన్నిక ఓ చేదు గుళిక... దాన్ని మరిచిపోయి... జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపుకోసం ప్రయత్నించండి...' ఇటీవల నిర్వహించిన టీఆర్ఎస్ అంతర్గత సమావేశంలో గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య ఇది. కానీ ఆ చేదు గుళికను మరిచిపోకముందే.. కారు పార్టీ కార్యకర్తలు మరో చేదు గుళికను మింగాల్సి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎమ్సీ) ఎన్నికలు ఆ పార్టీకి ఆశనిపాతాన్ని మిగిల్చాయి. 101 మంది కార్పొరేటర్లతో జీహెచ్ఎమ్సీని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న కారు పార్టీని... స్వయంకృతాపరాధాలు, పథకాల అమల్లో వైఫల్యాలు, పార్టీలో అంతర్గత సమస్యలు, సిట్టింగులపై వ్యతిరేకత దెబ్బకొట్టాయి. దీంతో 55 స్థానాలకే టీఆర్ఎస్ పరిమితమైంది. మరోవైపు బీజేపీకి 48, ఎంఐఎంకు 44 స్థానాలు దక్కటంతో మేయర్ ఎన్నిక రసకందాయంలో పడింది.
జీహెచ్ఎమ్సీ గత (2016) ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏఖోన్ముఖ విజయాన్ని సాధించింది. 99 డివిజన్లలో గెలిచి... గ్రేటర్ పీఠంపై జెండాను ఎగరేసింది. తెలంగాణ సెంటిమెంట్ ప్రజల్లో బలంగా ఉండటం, కొత్త రాష్ట్రంలో పలు రకాల పథకాలను అమల్లోకి తేవటంతోపాటు సీఎం కేసీఆర్ ఛరిష్మాతోడు కావటంతో సాధారణ మెజారిటీ కంటే 23 డివిజన్లను అధికంగా గెలుచుకుని విజయఢంకా మోగించింది. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు కార్పొరేటర్లను తమ పార్టీలో చేర్చుకోవటం ద్వారా... టీఆర్ఎస్ తన సంఖ్యా బలాన్ని 101కు పెంచుకున్నది. అప్పట్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... గెలుపు బాధ్యతను తన భుజాన వేసుకుని ప్రచారం చేశారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా పోషించి... పార్టీని విజయతీరాలకు చేర్చారు. ఇప్పుడు కూడా అదే కేటీఆర్... ప్రచార బాధ్యతను భుజానికెత్తుకున్నారు. నోటిఫికేషన్ వెలుడిన నాటి నుంచి దాదాపు పది రోజులపాటు జీహెచ్ఎమ్సీని చుట్టేశారు. ఈ క్రమంలో ఆయన 102 రోడ్ షోలలో పాల్గొన్నారు. కానీ ఫలితం మాత్రం గతానికి భిన్నంగా వచ్చింది. కారు పార్టీకి ఊహించని షాక్నిచ్చింది. 'మేం ఆశించిన ఫలితం రాలేదు...' అంటూ అదే వర్కింగ్ ప్రెసిడెంట్ ఒప్పుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.
ఈ ఎన్నికలను నిశితంగా పరిశీలిస్తే... కారుకు బ్రేకులు పడటానికి అనేక కారణాలున్నాయని తెలుస్తున్నది. ముఖ్యంగా 101 సిట్టింగ్ కార్పొరేటర్లలో అత్యధిక మందిపై ప్రజలు గుర్రుగా ఉన్నారు. సమస్యలను పట్టించుకోకపోవటం, వాటిని పరిష్కరించకపోవటం తోపాటు కొంతమంది అహంభావంతో వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. డివిజన్లలో వారిదే ఇష్టారాజ్యమనే ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో విమర్శలు ఎదుర్కొంటున్న వారిని మార్చాలంటూ కిందిశ్రేణి నాయకులు చెప్పినా... అధిష్టానం పట్టించుకోలేదని సమాచారం. దీంతో మొత్తం సిట్టింగులలో కేవలం 26 మందినే మార్చారు. మిగతా స్థానాల్లో పాతవారినే రంగంలోకి దించారు. దీంతో ప్రజలు వారిని తిరస్కరించనట్టు విదితమవుతున్నది. దీంతోపాటు ఇటీవల అందించిన వరదసాయం ఉద్దేశం మంచిదే అయినా.. అది అందని బాధితులు ఇంకా లక్షల్లో ఉన్నారు. వారందరూ టీఆర్ఎస్కు దూరమయ్యారు. ఆ పార్టీ ఓడిన ఎల్బీ నగర్, సరూర్ నగర్, హయత్నగర్ ప్రాంతాలను పరిశీలిస్తే ఇదే తేలింది. ఇక పాతబస్తీలోని వరద బాధితులు మూకుమ్మడిగా ఎంఐఎంను గెలిపించారు. దీంతోపాటు కొన్ని నెలల కిందట ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ గులాబీ పార్టీకి నష్టం చేకూర్చింది. రియల్ ఎస్టేట్ ఎక్కువగా ఉన్న మైలార్దేవ్పల్లి, నాగోల్, హయత్నగర్, వనస్థలిపురం, గౌతం నగర్ ప్రాంతాల్లో దాని ప్రభావం కనపడింది.
లాలూచీ వైఖరీ కారణమే...
వీటితోపాటు కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపిందని చెప్పక తప్పదు. ముఖ్యంగా రాష్ట్ర హక్కులు, నిధుల కోసం మోడీ సర్కార్పై ఆయన ఎప్పుడూ నికరంగా పోరాడింది లేదు. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలను కలుపుకుని పోకపోవటాన్ని మేధావులు తప్పుబడుతూ వచ్చారు. ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే బీజేపీ వ్యతిరేక ప్రకటనలు చేయటం, ఆ తర్వాత లాలూచీ పడటాన్ని విద్యావంతులు, అభ్యుదయవాదులు జీర్ణించుకోలేకపోయారు. ఇది గులాబీ పార్టీకి ప్రతికూలమైంది. కార్మికులకు సంబంధించిన అనేక అంశాలు కూడా జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో చర్చకొచ్చినట్టు కనబడుతున్నది. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల కేసీఆర్ కఠిన వైఖరిని అనుసరించటం, ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వకపోవటం, కనీస వేతనాల జీవోలను మార్చకపోవటంతో ఆయా తరగతుల ప్రజానీకమంతా టీఆర్ఎస్ పట్ల విముఖత ప్రదర్శించారని అర్థమవుతున్నది.
అక్కున చేర్చుకున్నది వారే...
ఈ ఎన్నికల్లో ఒక విచిత్రకరమైన సన్నివేశం కూడా కనబడింది. అదేంటంటే టీఆర్ఎస్ విమర్శలకు తరచుగా గురయ్యే ఆంధ్రా సెటిలర్లు... అదే కారు పార్టీని అక్కున చేర్చుకున్నారు. అందుకే వారు ఎక్కువగా నివసించే శేర్లింగంపల్లి, కుత్భుల్లాపూర్, కూకట్పల్లి, పటాన్చెరు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో టీఆర్ఎస్ క్లీన్స్వీప్ చేసింది. దీనికి భిన్నంగా తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిలైన ప్రజలు... అధికార పార్టీని తిరస్కరించటం గమనార్హం. ఉప్పల్, ఎల్బీ నగర్, హయత్నగర్ ఏరియాల్లోని ఫలితాలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి.