Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి
- ప్రభుత్వంపై వ్యతిరేకత.. గ్రేటర్ ఎన్నికల్లో స్పష్టం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- బోనకల్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రైతులు ఎనిమిది రోజులు గా మిలిటెంట్ పోరాటాలు నిర్వహిస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కమ్యూనిస్టు పార్టీ వందేండ్ల చరిత్రపై శుక్రవారం ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరి ధిలోని ముష్టికుంటలో సెమినార్ నిర్వహించారు. పార్టీ గ్రామ కమిటీ కార్యదర్శి దొప్ప కొరివి వీరభద్ర అధ్యక్షత వహించగా తమ్మినేని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకూ రైతులతో కలిసి సీపీఐ(ఎం) పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. ఈ చట్టాల వల్ల వ్యవసాయానికి ఎంతో ఉపయోగం జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రచార నిర్వహిస్తున్నారని, ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే రైతులు ఢిల్లీలో పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారని అన్నారు. రైతులందరూ ఐక్యంగా కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారన్నారు. ఈ చట్టాల వల్ల వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిని రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వ్యవసాయ మార్కెట్లు రద్దవుతాయన్నారు. నిత్యావసర సరుకులను నిల్వ చేసుకునే అవకాశం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు ఏర్పడుతుందన్నారు. కంపెనీ ఒప్పంద చట్టం వల్ల రైతులకు అవసరమైన మందులు, విత్తనాలను కంపెనీలే సరఫరా చేస్తాయని, ఒప్పందం ప్రకారం వారికే ముందు నిర్ణయించిన ధరకే పంటను అమ్మాల్సిన పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల రైతులు కూలీలుగా మారే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కొత్త విద్యుత్తు చట్టం ప్రకారం ఉచిత విద్యుత్ ఉండదన్నారు. ప్రతి మోటార్కి మీటర్ అమర్చుతారని చెప్పారు.
రాష్ట్రంలో దుబ్బాక ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. అది జీహెచ్ఎంసీ ఎన్నికలో స్పష్టంగా కనిపించిందన్నారు. భవిష్యత్తులో కమ్యూనిస్టు రాజకీయాల వైపు కచ్చితంగా ప్రజలు మొగ్గు చూపుతారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించేది సీపీఐ(ఎం) మాత్రమేనని, ఇప్పుడిప్పుడే ఆ విషయాలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సెమినార్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.