Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 ఏండ్లుగా పని చేస్తున్నా పెరగని వేతనాలు
- పీజీలు, డిప్లొమాలు, టీటీసీలు, డిగ్రీ అర్హతతో కొలువులు
- జీతం నాలుగు వేలు దాటని వైనం
- మంత్రులు, ప్రజా పతినిధులకు వినతుల మీద వినతులు
- ఆశగా బాల కేంద్రాల ఉద్యోగులు, సిబ్బంది ఎదురుచూపులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను, ఉద్యోగ విరమణ వయస్సును పెంచుతాం. అన్ని శాఖల్లోనూ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తాం. ప్రభుత్వ, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్క్ చార్జ్డ్, డెయిలీ వేజ్, ఫుల్ టైమ్ కాంటింజెంట్, పార్ట్ టైమ్ కాంటింజెంట్, హోంగార్డులు, అంగన్వాడీలు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశాలు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పెన్షనర్లు... ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాలను పెంచుతాం...' సీఎం కేసీఆర్ నూతన సంవత్సరం సందర్భంగా చేసిన ప్రక టన ఇది. సీఎం చేసిన ఈ ప్రకటనతోనైనా తమ జీవితాలు మారతాయా..? లేదా..? అని రాష్ట్రంలోని బాల కేంద్రాల్లో పని చేస్తున్న కన్సాలిడేటెడ్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, గౌరవ వేతన ఉద్యోగులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని బాల బాలికలకు సంగీతం, నాట్యం, గానం, చిత్రలేఖనం, జానపదాలు తదితర లలిత కళలతోపాటు కుట్లు, అల్లికల్లాంటి స్వయం ఉపాధి రంగాల్లో తర్ఫీదునివ్వా లనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల్లో బాల కేంద్రా లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లోగల జవహర్ బాలభవన్కు ఇవి అనుసంధానంగా పని చేస్తు న్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14 బాల కేంద్రాలు, మరో 7 మినీ బాల భవన్లు ఉన్నాయి. అయితే వాటిలో పనిచేసే అధ్యాపకులు, సిబ్బందికి జీతాలు పెంచకపోవటంతో వారి జీవితాలు అధ్వాన్నంగా తయారయ్యాయి. పిల్లల మానసిక వికాసానికి, విజ్ఞానానికి ఎంతగానో ఉపయోగపడుతున్న బాల కేంద్రాలపట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నది. ఉన్నత విద్యనభ్యసించిన వారితోపాటు లలిత కళల్లో డిప్లొమా, పీజీ డిప్లొమాలు, డిగ్రీ, టీటీసీ పూర్తి చేసి ఆయా కేంద్రాల్లో పని చేస్తున్న శిక్షకులు, సిబ్బంది సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. దాదాపు 20 ఏండ్ల నుంచి పని చేస్తున్నప్పటికీ వారికి వేతనాలు ఎంతమాత్రమూ పెరగటం లేదు. ఇప్పటికీ సూపరింటెండెండ్లకు నెలకు రూ.4 వేలు, టీచర్లకు రూ.3 వేలు, ఆయాలు, అటెండర్లకు రూ.వెయ్యి మాత్రమే జీతంగా చెల్లిస్తున్నారు. అది కూడా మూణ్నెల్లకు ఒకసారి ఇవ్వటంతో పలువురు సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేమంటే మీరు చేసేది పార్ట్టైం జాబేగా అంటూ ఉన్నతాధికారులు ఎగతాళి చేస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలో తమ వేతనాలను పెంచాలనీ, ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుతూ 2014 నుంచి ఇప్పటిదాకా తాము ఎక్కని మెట్టూ, దిగని మెట్టూ లేదని బాల కేంద్రాల్లోని ఉద్యోగులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన కొత్తలో విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగదీశ్రెడ్డికి, ఆ తర్వాత అదే శాఖకు మంత్రి అయిన కడియం శ్రీహరికి, ఇప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అనేకసార్లు వినతి పత్రాలు సమర్పించామని వారు చెబుతున్నారు. దాంతో పాటు ఇటీవల ఎమ్మెల్సీలు అలుగుబెల్లి నర్సిరెడ్డిని, కాటేపల్లి జనార్థన్రెడ్డిని కూడా కలిసి తమ సమస్యలను విన్నవిం చుకున్నామని వివరించారు. వారి ద్వారానైనా తమ సమస్య లు ప్రభుత్వం దృష్టికి వెళతాయనే ఆశతో ఉన్నామని తెలిపారు.
మూసివేత దిశగా...
ఏండ్ల నుంచి పని చేస్తున్నా... సర్కారు తమ వేతనాలను పెంచకపోవటంతో ఉద్యోగులు, సిబ్బందిలో అనేక మంది మూడు, నాలుగు వేల వేతనంతోనే ఉద్యోగ విమరణ పొందుతున్నారు. ఇక మిగిలున్న కొద్ది మంది సిబ్బంది ఆ జీతాలతో కుటుంబాలను పోషించలేక బాల కేంద్రాల్లోని ఉద్యోగాలను వదిలి.. వేరే వృత్తులు, పనుల్లోకి వెళ్లిపోతున్నారు. దీంతో 14 బాల కేంద్రాల్లో రెండు ఇప్పటికే మూతబడ్డాయి.
ఇక హైదరాబాద్లోని వనస్థలిపురం బాల కేంద్రం మొత్తం మీద ఒక్కరే పని చేస్తున్నారు. ఇక సిద్ధిపేట బాల కేంద్రాన్ని అసలు తెరిచిన దాఖలాలే కనబడటం లేదని తెలిసింది. అంటే ఇవి రెండు కూడా త్వరతోనే మూతబడే అవకాశం ఉందన్నమాట. వేతనాలు పెంచకపోవటం, సిబ్బందిని కొత్తగా నియమించకపోవటం తదితర కారణాల రీత్యా మున్ముందు ఇతర బాల కేంద్రాలకు కూడా ఇదే గతి పట్టే అవకాశం లేకపోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఇప్పటికైనా వాటిని పటిష్టం చేయాలని కోరుతున్నారు.