Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ బడికొక్క స్వచ్ఛ కార్మికున్ని నియమించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 20 వేలకుపైగా ఉన్న ప్రభుత్వ బడుల్లో ఊడ్చడానికి, టాయిలెట్లు శుభ్రం చేసేందుకు, తాళం తీసేందుకు కనీసం ఒక్క కార్మికుడూ లేరని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగేండ్ల నుంచి సమగ్రశిక్ష పథకం నుంచి నెలకు రూ.2,500 చొప్పున పారితోషికం చెల్లించారని గుర్తు చేశారు. బడిలో పనిచేసిన పది నెలలపాటు స్వచ్ఛ కార్మికులను నియమించారని పేర్కొన్నారు. సమగ్ర శిక్ష నిధుల నుంచి స్వచ్ఛ కార్మికులను పెట్టొద్దని కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం వల్ల ఈ విద్యాసంవత్సరం నేటి వరకు వారిని నియమించలేదని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల పరిశుభ్రత గ్రామపంచాయతీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో గల పారిశుధ్య కార్మికులతో చేయించుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. కానీ గ్రామపంచాయతీలుగానీ, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలోగానీ బడుల్లో పరిశుభ్రత కోసం ఎలాంటి కార్మికులనూ నియమించలేదని పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్ ఒకటి నుంచి ఉపాధ్యాయులు బడులకు హాజరవుతున్నారని తెలిపారు. బడులకు తాళం వేసుకోవడం, తాళం తీయడం, అవసరమైన గదులను శుభ్రం చేయడం, టాయిలెట్లు శుభ్రం చేయడం వంటి పనులన్నీ ఉపాధ్యాయులే చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చేనెల ఒకటి నుంచి విద్యార్థులూ బడులకు వస్తునానరని తెలిపారు. స్థానిక సంస్థల నుంచి పారిశుధ్య కార్మికులను బడులకు పంపలేరనేది ఈ నాలుగు నెలల్లో తేలిపోయిందని వివరించారు. నెలకు రూ.5 వేల చొప్పున 20 వేల మందిని నియమిస్తే నెలకయ్యే ఖర్చు రూ.10 కోట్లని పేర్కొన్నారు. బడుల్లో బహుళ పనులు చేసే కార్మికులుంటారని సూచించారు. సీఎం నుంచి అధికారుల వరకు అవసరమైన సహాయకులున్నారని తెలిపారు. ఇతర ప్రభుత్వ కార్యాల యాల్లోనూ సహాయకులున్నారని వివరించారు. బడికొక్క స్వచ్ఛ కార్మికున్ని ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి తగదని హెచ్చరించారు. పాఠశాల యాజమాన్య కమిటీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని బడికొక్క కార్మికున్ని ఇవ్వాలని సీఎంకు లేఖలు రాయాలని కోరారు.