Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్టాలను వ్యతిరేకిస్తూ 24న అన్ని పార్టీలతో సమావేశం :తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో ఆహారభద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లనుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం అన్నారు. సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా విస్తృత స్థాయి సమావేశం మంగళవారం చౌటుప్పల్లో జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని విలేకర్లతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాలతో వ్యవసాయ రంగంతో పాటు విద్యుత్ రంగం కూడా పూర్తిగా సంక్షోభంలోకి నెట్టబడతాయని తెలిపారు. పార్లమెంటులో చర్చలకు తావులేకుండా కేవలం ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టాలు తీసుకు రావడం సరికాదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఇష్టం లేని చట్టాలను వ్యతిరేకించే హక్కు ఎంపీలకు ఉంటుందని, దాన్ని కూడా ఈ ప్రభుత్వం కాలరాసిందని అన్నారు. రాష్ట్రాల పరిధిలో ఉన్న వ్యవసాయ, విద్యుత్ హక్కులను కూడా కేంద్రం తన చేతుల్లోకి తీసుకుందన్నారు. ఈ చట్టాలతో పంట, ఆ పంట పండించే భూమి కూడా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం, ప్రత్యేక కమిటీ వేయడం, అందులో పూర్తిగా చట్టాలను సమర్థించే వాళ్లే ఉండటం చూస్తే అనేక అనుమా నాలు కలుగుతున్నాయని చెప్పారు. ఈ కమిటీలను రైతు సంఘాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి జాతీయ స్థాయిలో మద్దతు పెరుగుతుందని, వివిధ సంఘాలు ఢిల్లీ వెళ్లి ధర్నాల్లో పాల్గొంటున్నట్టు చెప్పారు. రాజకీయ పార్టీలు కూడా వ్యవసాయ చట్టాల రద్దుపై పోరాటానికి ముందుకు రావాలని కోరారు. వ్యవసాయ చట్టాల రద్దుపై ఈనెల 24న హైదరాబాద్లోని ఎస్వికేలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు.
కేంద్ర చట్టాలపై కేసీఆర్ తీరును వ్యతిరేకిస్తున్నామన్నారు. కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తామని పేర్కొనడం విడ్డురంగా ఉందన్నారు. రైతుబంధుతో రైతుల మద్దతు కూడగట్టుకున్న సీఎం కేసీఆర్.. చట్టాలను సమర్థిస్తే మాత్రం తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ క్రీయాశీలకంగా ఉండాలన్నారు. ఎల్ఆర్ఎస్, దళితుల భూములను లాక్కోవడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. పోడు భూములకు వెంటనే పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మూడు లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే.. ప్రభుత్వం 50 వేల ఉద్యోగాల కోసం ప్రకటన చేయడంలో అర్థం లేదన్నారు. బీజేపీతో స్నేహం చేస్తే ఎప్పటికైనా అది మింగేస్తుందని, కేసీఆర్ మరోసారి ఆలోచన చేయాలని సూచించారు. సాగర్ ఉప ఎన్నికల్లో ఎవరెవరు పోటీచేస్తారో చూడాల్సి ఉందని, అక్కడ తమ పార్టీ బలం తమకు ఉందన్నారు. బీజేపీ ప్రమాదాన్ని అడ్డుకునేందుకు తమ ప్రయత్నం కొనసాగిస్తామని తెలిపారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. యాదాద్రి జిల్లాలో సాగు, తాగునీటి సమస్యతో పాటు కాలుష్యం, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు. దశాబ్దాలుగా చౌటుప్పల్, చిట్యాల, గుండాల తదితర మండలాలు బీడువారి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పిలాయిపల్లి, బునాదిగాని కాల్వ, భీమలింగం కాలువ, డిండి ఎత్తిపోతల, ఉదయ సముద్రం పూర్తి చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నారు. నాలుగున్నర ఏండ్లల్లో రూ.50వేల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం పూర్తి చేసిన ప్రభుత్వం రూ.1000 కోట్లతో ఈ చిన్న ప్రాజెక్టులను ఎందుకు పూర్తిచేయడం లేదని ప్రశ్నించారు. మార్చి 1 నుంచి 31వ తేదీ వరకూ తమ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో పాదయాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, ఎమ్డి.పాషా, ఆవనగంటి వెంకటేశ్, సిర్పంగి స్వామి తదితరులు పాల్గొన్నారు.