Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అందజేత : పీసీసీఎఫ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అడవుల రక్షణ, పునరుజ్జీవనం, పచ్చదనం పెంపు ప్రాతిపదికన క్షేత్రస్థాయిలో బాగా పనిచేసిన అటవీశాఖ సిబ్బందికి ప్రోత్సాహక అవార్డులను అందజేయనున్నట్టు పీసీసీఎఫ్ ఆర్.శోభ తెలిపారు. అన్ని జిల్లాల అటవీ అధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ బుధవారం నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జనవరి 26న జిల్లాల వారీగా ఆరు కేటగిరీల్లో ప్రతిభ కనబరిచిన బీట్ అధికారులు, సెక్షన్ ఆఫీసర్లు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లను నగదు ప్రోత్సాహంతో కూడిన ప్రశంసాపత్రాన్ని అందిస్తామని తెలిపారు.
నర్సరీల నిర్వహణ, పెద్ద మొక్కల పెంపు, నాటిన మొక్కల సంరక్షణ, అటవీ రక్షణ పద్దతులు, చక్కటి పునరుజ్జీవన చర్యలు, అడవుల్లో నీటి సంరక్షణ, గడ్డి మైదానాల వృద్ధి, హరితహారంలో వివిధ రంగాల వారిని భాగస్వామ్యం చేయటం లాంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. పీసీసీఎఫ్(సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం.దోబ్రియల్ మాట్లాడుతూ వచ్చే హరితహారం కోసం పెద్ద మొక్కల పెంపకాన్ని అన్ని నర్సరీల్లో చేపట్టాలనీ, గ్రామీణ ప్రాంతాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ కోసం కనీసం ఒకటిన్నర మీటరు ఎత్తైన మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పీసీసీఎఫ్(కంపా) లోకేశ్ జైస్వాల్ మాట్లాడుతూ కంపా నిధుల కింద చేపట్టిన అటవీ అభివద్ది పనుల్లో అలసత్వం జరిగితే క్షమించబోమన్నారు. చేపట్టిన పనులను థర్డ్ పార్టీ ద్వారా సమీక్షించటం, ఆమేరకు నిధుల విడుదల ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ, ముందస్తు ప్రణాళికలు, వన్యప్రాణుల రక్షణ, నీటి వసతి సౌకర్యాల కల్పన, నిర్వహణ, అటవీ ప్రాంతాల్లో రహదారులపైనా సమీక్ష జరిగింది.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో పీసీసీఎఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, అదనపు పీసీసీఎఫ్లు సిద్ధానంద్ కుక్రేటీ, ఎంసీ.పర్గెయిన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.