Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాక్సిన్తో సంబంధం లేదని ప్రాథమిక నిర్ధారణ
- డీహెచ్ డాక్టర్ జి.శ్రీనివాసరావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిర్మల్ జిల్లా కుంటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ వేసుకున్న ఒకరు మరణించినట్టు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 42 ఏండ్ల పురుషుడు మంగళవారం ఉదయం 11.30 గంటలకు వ్యాక్సిన్ వేసుకున్నారు. అదే రోజు అర్థరాత్రి 2.30 గంటలకు ఛాతీలో నొప్పి వచ్చింది. కాగా నిర్మల్ జిల్లా ఆస్పత్రికి ఆయనను తీసుకురాగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే ఆయన మరణానికి వ్యాక్సిన్తో సంబంధం లేనట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. మార్గదర్శకాల మేరకు డాక్టర్లు పోస్ట మార్టం నిర్వహిస్తారని తెలిపారు. సైడ్ఎఫెక్ట్ వచ్చిన వారిని చూసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జిల్లా డాక్టర్లు పరీక్షించి రిపోర్టును రాష్ట్ర కమిటీకి, అక్కడ్నుంచి కేంద్ర కమిటీకి పంపించనున్నారు.
రెండు యూకే స్ట్రెయిన్ పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో మరో రెండు యూకే స్ట్రెయిన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో స్ట్రెయిన్ కేసుల సంఖ్య నాలుగుకు చేరాయి. యూకే నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరికి స్ట్రెయిన్ ఉన్నట్లు నిర్థారించారు. గచ్చిబౌలి టిమ్స్లో చికిత్స కొనసాగుతోంది.
267 మందిలో కరోనా
267 మందిలో కరోనా బయటపడింది. ఇద్దరు మరణించారు. సోమవారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకు 27,471 మందికి కోవిడ్-19 పరీక్షలు చేసినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. వీరిలో 1006 మంది రిపోర్టులు రావాల్సి ఉన్నవి. రాష్ట్రంలో ప్రస్తుతం 3,919 యాక్టివ్ కేసులున్నాయి.