Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్రిక్త వాతావరణంలో నిమ్జ్ ప్రజాభిప్రాయ సేకరణ
- రైతుల కంటే పోలీసులే ఎక్కువ..
- సభకు రానివ్వకుండా చెక్ పోస్టులు .. రైతుల అరెస్టులు
- జై జవాన్.. జై కిసాన్.. నినాదాలతో మార్మోగిన సభ
ప్రాణాలైనా ఇస్తాం.. కానీ నిమ్జ్కు తమ భూములిచ్చేది లేదని రైతులు పట్టుబట్టారు. సారవంతమైన నేలలను విడిచి వెళ్లేది లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. ధర నిర్ణయించకుండా భూములేలా తీసుకుంటారని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝురాసంగం మండలాల్లో ఏర్పాటుచేస్తున్న జాతీయ పారిశ్రామిక ఉత్పాదక మండలి (నిమ్జ్)కి భూములివ్వమని కొన్ని రోజులుగా ప్రజలు నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే. దీనిపై బుధవారం ఝరాసంగం మండలం బర్దిపూర్లో రైతులు, గ్రామస్తులతో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతుండగా రైతులు ఒక్కసారిగా ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. 'జై జవాన్.. జై కిసాన్' అంటూ నినదించారు. దాంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. సమావేశానికి వచ్చే ప్రధాన మార్గాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఆందోళనకారులను అడ్డుకున్నారు.
నవతెలంగాణ-ఝరాసంగం
నిమ్జ్ ప్రజాభిప్రాయ సేకరణ తీరు వివాదాస్పదంగా మారింది. జామాబా కలెక్టర్ హనుమంతరావు అధ్యక్షతన నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్సీ ఎండీ. ఫరీదోద్దిన్, ఎమ్మెల్యే మాణిక్రావు, నిమ్జ్ టీఎస్ ఐఐసీ చైర్మెన్ గ్యాదరి బాలమల్లు, పొల్యూషన్ బోర్డు ఈఈ సురేష్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి హాజరయ్యారు. కలెక్టర్, టీఎస్ఐఐసీ ఎండీ మాట్లాడుతూ.. నిమ్జ్ ఏర్పాటుకు న్యాల్కల్ మండలంలోని 14 గ్రామాలు, ఝరాసంగం మండలంలోని 3 గ్రామాల్లో 12,635 ఎకరాల భూమిని సేకరించి అందులో 6400 ఎకరాల్లో పరిశ్రమలను స్థాపిస్తామన్నారు. మిగతా భూమిలో రోడ్లు, రైల్వేలైన్లు, గ్రీన్ పార్కుల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. నిమ్జ్ ప్రాజెక్టులో అటోమొబైల్, విద్యుత్ యంత్రసామగ్రి, యంత్ర పరికరాల తయారీ, అహరా ప్రాసెసింగ్స్ యూనిట్లు, లోహాలు, రవాణా పరికరాలు, వినియోగాలు వసతి సౌకర్యాల కల్పన, పరిశ్రమలకు అనుమ తులను ఇవ్వడం జరుగతుందన్నారు. 300 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతామన్నారు. కాగా, 17 గ్రామాల ప్రజల అభిప్రాయాలను సేకరించాల్సి ఉండగా కేవలం 5 నుంచి 6 గ్రామాల అభిప్రాయాలు మాత్రమే సేకరించారని రైతులు తప్పుబట్టారు. 60 మందికి పైగా రైతులు, ఎన్జీవోలు, యువకులు, మహిళలు తమ అభిప్రాయాలు తెలిపారు. వారిలో ఎక్కువ మంది.. సారవంతమైన తమ భూముల్లో కూరగాయలు, పండ్లు, ఇతర వాణిజ్య పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నామనీ, అలాంటి భూములను వదులుకోబోమని అధికారులకు తేల్చిచెప్పారు. గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులకు గానీ, ప్రజలకు గానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హడావిడిగా ప్రజాభిప్రాయ సేకరణను ఎలా జరుపుతారని రైతులు ఆందోళనకు దిగారు. సభా ప్రాంగణమంతా పోలీసు బలగాలతో నిండిపోవడంతో కనీసం తమ అభిప్రాయాన్ని వెలబుచ్చుకునే అవకాశం కల్పించకుండా చేయడం దారుణమని రైతులు వాపోయారు. ఈ మేరకు కొంత మంది రైతులు తమ గోడును నవతెలంగాణ విలేకరితో వెల్లబోసుకున్నారు.
రెండో విడతలో భూమిని ఇవ్వడం కుదరదు
- ఓం ప్రకాష్ పాటిల్, సర్పంచ్, ఎల్గోయి గ్రామం
మా గ్రామంలో ఇప్పటికే 18 వేల ఎకరాలకు పైగా భూమిని ఈ ప్రాజెక్టు కింద తీసుకున్నారు. కానీ ఎవరికి సరైన నష్టపరిహారం ఇప్పటికీ రాలేదు. రెండో విడతలో ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టుకు భూమి ఇవ్వడం కుదరదు. ఇప్పటికీ నష్టపరిహారం రానివారికి 15 లక్షల వరకు పరిహారం చెల్లించాలి. ఇక్కడి యువతకు ఉపాధి కల్పించాలి.
సభకు రానివ్వకుండా రైతులను అడ్డుకున్నారు
-జైపాల్ రెడ్డి
న్యాల్కల్ మండలం గణేష్పూర్ గ్రామం నుంచి ప్రజాభిప్రాయ సేకరణకు వస్తే పోలీసులు బలవంతంగా మాపై లాఠీఛార్జి చేసి అరెస్టు చేశారు. నాకు ఐదుకరాల భూమి ఉంది. అందులో ప్రస్తుతం చెరకు, కొబ్బరి సాగు చేశాను. రైతులను భయబ్రాంతులకు గురి చేసి భూములు లాక్కోవాలని ప్రయత్నిస్తున్నది.
మా ప్రాణాలు తీయొద్దు
నాకిద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఉన్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాను. ఉన్న భూమి మొత్తం కంపెనీ కింద తీసుకుంటే మేమెలా బతకాలి. ఇప్పటికే చిలపల్లిలో ఉన్న బొక్కల కంపెనీ నుంచి వాసనను భరించలేక వాంతులు చేసుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా కంపెనీలు తెచ్చి మా ప్రాణాలు తీయొద్దు.
- మంజుల, ఎల్గోయి గ్రామం