Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజావ్యతిరేక విధానాలపై పోరు ఉధృతం
- ప్రజల కంటే కంపెనీల మీదే మోడీకి ప్రేమ ఎక్కువ : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి
- కేసీఆర్ ఫామ్హౌస్ వీడాలి: సారంపల్లి
- కార్మికులు, కర్షకులకు కామన్ శత్రువు కార్పొరేట్లు: ప్రొ.నాగేశ్వర్
- కార్మిక చట్టాలతో ఆటలు : సుధాభాస్కర్
- నాలుగు ఉమ్మడి జిల్లాల్లో కార్మిక, కర్షక పోరు యాత్రలు ప్రారంభం
నవతెలంగాణ-ఖమ్మం/ మహబూబాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో/ మహబూబ్నగర్
''పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరించి 4 కోడ్లుగా చేసి కార్మికుల జీవితాలతో ఆటలాడటం దుర్మార్గం.. ఎలాంటి ప్రజామోదం లేకుండా ఏకపక్షంగా రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ చట్టాలను తెచ్చి.. దేశానికి అన్నం పెట్టే అన్నదాతను కార్పొరేట్లకు అప్పగించే కుట్ర జరుగుతోంది.. వ్యవసాయ చట్టాలను ముందు వ్యతిరేకించిన కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వంగి వంగి దండాలు పెట్టి యూటర్న్ తీసుకున్నారు. కార్మిక కోడ్లను.. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేవరకు పోరాటం ఉధృతం చేస్తాం.. ఉద్యమాలతో ప్రజావ్యతిరేక ప్రభుత్వాల మెడలు వంచుతాం..'' అంటూ కార్మిక కర్షక పోరు యాత్రల ప్రారంభంలో వక్తలు ప్రకటించారు. కార్మిక చట్టాల సవరణ, నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల్లో 'కార్మిక-కర్షక' పోరు యాత్రలు ప్రారంభమయ్యాయి.
కార్పొరేట్ల ఆర్డర్.. చట్టాలు చేసిన మోడీ : జూలకంటి
బీజేపీ అధికారంలోకొచ్చాక దేశంలోని ఉత్పత్తి, సేవా రంగాలన్నింటితోపాటు చివరికి రక్షణ రంగాన్ని సైతం కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కంపెనీల లాభార్జన దాహం తగ్గలేదని, అందుకే దేశ జీడీపీలో 36 శాతం ఆదాయాన్ని సమకూర్చే వ్యవసాయరంగంపై వాటి చూపు పడిందని అన్నారు. ఖమ్మం త్రీటౌన్లోని గ్రెయిన్ మార్కెట్ ముందు భారీ కార్మిక ర్యాలీతో జెండా ఊపి జాతాను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన సభలో జూలకంటి ప్రసంగించారు. కార్పొరేట్ కంపెనీలకు ఆలోచన వచ్చిందే తడవుగా తమ ఏజెంట్ మోడీకి ఆర్డర్ వేశారని, ఆ వెంటనే మోడీ పూనకం వచ్చినట్టు తన మందబలగంతో పార్లమెంటులో చట్టాలు చేశారని విమర్శించారు. ప్రతిపక్షాలతోగానీ, రైతు సంఘాలతోగానీ, మేధావులతోగానీ కనీస చర్చలు జరపలేదన్నారు. ఈ చట్టాల ప్రమాదం గుర్తించి దేశ వ్యాప్తంగా రైతాంగం ప్రాణాలకి తెగించి రెండు నెలలుగా పోరాడుతుంటే మోడీ, బీజేపీ ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గటం లేదని ప్రశ్నించారు.
సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. కార్మికవర్గం పోరాడి సాధించుకున్న అనేక కార్మిక చట్టాలను రద్దు చేశారన్నారు. సమ్మె, పని గంటలు పెంపు, పని ప్రదేశాల్లో సౌకర్యాలు, తనిఖీలు, మూసివేతలు మొదలగు అనేక మార్పులు లేబర్ కోడ్లలో ప్రతిపాదించారని చెప్పారు. ఇవి అమలు జరిగితే కార్మిక వర్గం వందేండ్లు వెనక్కి వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.మధు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు:ఆల్ ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుదోందని, తక్షణం కేంద్రం తెచ్చిన కార్మిక కోడ్లు, కర్షక చట్టాలు రద్దు చేయకుంటే తిరుగుబాటు తప్పదని ఆల్ ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్లో కార్మిక- కర్షక పోరు జాతాను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మల్లారెడ్డి మాట్లాడారు. ప్రధాని మోడీ ప్రజలను మోసం చేయడంలో అగ్రస్థానంలో ఉన్నారని విమర్శించారు. బహుళ జాతి సంస్థలకు ఎర్రతివాచీ పరిచి.. సామాన్య ప్రజలను విస్మరించారని అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఫాంహౌస్కే పరిమితమయ్యారని, ఆయన అనుచరగణం మంత్రులు, ఎమ్మెల్యేలు భూకబ్జాలు, ఆస్తులు కూడబెట్టుకోవడంలో నిమగమయ్యారని విమర్శించారు. అటు ప్రధాని, ఇటు సీఎం కరోనా కాలంలో ప్రజల సంక్షేమాన్ని, అవసరాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ఢిల్లీలో రైతులు రక్తం గడ్డకట్టే చలిలో ప్రాణాలు పణంగా పెట్టి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తుండగా బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. చట్టాల రద్దు, కనీస మద్దతు ధర అంశాలు లేకుండా చర్చలు నిర్వహించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సంస్కరణలు, కార్మిక కోడ్లను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో వ్యవసాయ చట్టాల రద్దుకు తీర్మానం చేయాలని కోరారు.
కార్పొరేట్లే బాగుపడుతున్రు:మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్రావు
కరోనా కాలంలో కార్మికులు ఉపాధి కోల్పోతుంటే.. దేశంలోని కార్పొరేట్ శక్తుల ఆదాయం మాత్రం పెరుగుతోందని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. సీఐటీయూ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో జాతాను చిక్కడపల్లిలోని లేబర్ అడ్డా వద్ద నాగేశ్వర్రావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కేంద్ర తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దుకోసం లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులో ఎముకలు కొరికే చలిలో సైతం పట్టుదలతో పోరాడుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే 50 మందికిపైగా రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక కోడ్లు, విద్యుత్ సవరణ బిల్లు 2020ను తీసుకొచ్చి కార్మిక, ప్రజల హక్కులను హరించి, యజమానులు యథేచ్ఛగా దోపిడీ చేసుకోవడానికి అవకాశం కల్పించారని తెలిపారు. వ్యవసాయ చట్టాల వల్ల దేశ ప్రజానీకాన్ని కేంద్రం ప్రమాదంలోకి నెట్టిందని, వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని కోరారు. అంబానీ, అదానీలకు వ్యవయాన్ని అప్పగించడానికే ఈ చట్టాలను తెచ్చారన్నారు. 18 లక్షల కోట్ల వ్యాపారాన్ని నలుగురు, ఐదుగురు వ్యాపారవేత్తలకు కట్టబెట్టకుండా ఉండేందుకే రైతులు పోరాటం చేస్తున్నారని చెప్పారు. తిరుగబడితేనే ప్రభుత్వాలు దారిలోకి వస్తాయని చెప్పారు. సీఐటీయూ రాష్ట్ర నాయకులు జె.వెంకటేశ్ పాల్గొన్నారు.
దండాలతో రాష్ట్రం తాకట్టు :సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు సుధాభాస్కర్
కేంద్రంలో అధికారాన్ని వెలగబెడుతున్న బీజేపీ వందేండ్ల కార్మిక కర్షక హక్కులను కాలరాస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధాభాస్కర్ విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద జీపు జాతాను సుధాభాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జీపుజాతా మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1926లో బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాడి సాధించుకున్న హక్కును నేడు హరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సైతం పట్టించుకోకుండా ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కిందన్నారు. అందమైన భవనాలు నిర్మించే కార్మికులకు చట్టాలే లేకపోవడం దురదృష్టకరమాన్నరు. డిసెంబరు 8న రైతుల పోరాటాలను బలపరుస్తూ టీఆర్ఎస్ నాయకులు బంద్లో పాల్గొని.. కేసీఆర్ ఢిల్లీ వెళ్లొచ్చాక మాట ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వంగి దండాలు పెడితే.. పోరాట చరిత్ర ఉన్న తెలంగాణ ప్రజలు క్షమించరని హెచ్చరించారు. ముఖ్యమంత్రి దాన్యం కొనుగోళ్లు ఉండని చెప్పిన వెంటనే.. వ్యవసాయ మంత్రి యాసంగి పంటను కొనబోమని చెప్పడం రైతు చట్టాలకు మద్దతు ఇవ్వడమేనన్నారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటం రాజు, రాష్ట్ర నాయకులు కిల్లెగోపాల్ ప్రసంగించారు.