Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాభిప్రాయ సేకరణ పేరిట ప్రజలపై దౌర్జన్యం
- భూ సేకరణను తక్షణం ఆపేయండి :
- 'నిమ్జ్'పై టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాతీయ పెట్టుబడులు, తయారీ జోన్ (నిమ్జ్) పేరిట పరిశ్రమల స్థాపన కోసమంటూ జహీరాబాద్ చుట్టుపక్కల అత్యంత సారవంతమైన భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నించటం అత్యంత శోచనీయమని తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. భూ సేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామంటూ చెప్పిన అధికారులు... వాస్తవానికి అక్కడికి ప్రజలను రానీయకుండా ఒక రహస్య విచారణ చేపట్టారని విమర్శించారు. జనాన్ని రానీయకుండా అడ్డుకుని, పోలీసులతో పికెటింగ్ ఏర్పాటు చేశారని తెలిపారు. వారిని తప్పించుకుని ప్రజాభిప్రాయ సేకరణ ప్రదేశానికి చేరుకున్న రైతులు, ఇతర పేదలపై పోలీసులు లాఠీఛార్జి చేయటం దారుణమని అన్నారు. అడుగడుగునా నిర్బంధం విధించటం, మహిళలనే సోయి కూడా విచక్షణా రహితంగా కొట్టటం దారుణమని అన్నారు. ఈ అంశాలన్నింటిపై మానవ హక్కుల కమిషన్ను కలిసి ఫిర్యాదు చేస్తామని అన్నారు. సోమవారం హైదరాబాద్లోని టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో కోదండరామ్ విలేకర్లతో మా ట్లాడుతూ... జహీరాబాద్ చుట్టుపక్కల సారవంతమైన భూములున్నాయని తెలి పారు. వాటిలో అల్లం, వెల్లుల్లి, ఆలుగడ్డతోపాటు కూరగాయలు సాగు చేస్తారని చెప్పారు. అలాంటి భూములను పరిశ్రమల కోసం బలవంతంగా లాక్కోవటం దారుణమని అన్నారు. సేకరించాలనుకున్న మొత్తం 12,635 ఎకరాల్లో 6,400 ఎకరాలను మాత్రమే పరిశ్రమల కోసం వినియోగిస్తారని వివరించారు. అలాంటప్పుడు మిగతా వాటిని ఏం చేస్తారని ప్రశ్నించారు. నిమ్జ్ వల్ల చుట్టుపక్కల ఉన్న చిట్టడవులు కూడా నాశనమవుతాయనీ, ఫలితంగా పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. ఈ విషయాలన్నింటినీ కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖకు తెలపాలని జిల్లా కలెక్టర్ను కోరారు. తమ పార్టీ నుంచి కూడా కేంద్రానికి లేఖ రాస్తామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం భూ సేకరణ ప్రక్రియను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.