Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఏఏ, ఎన్ఆర్సీ, సాగు చట్టాలు
- రాష్ట్రాలు, పౌర హక్కులకూ భంగం
- సాగు చట్టాలతో ఎంత మంది రక్తం తాగుతారు? : సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బృందాకరత్, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరపట్టిక (ఎన్ఆర్సీ), మూడు వ్యవసాయ చట్టాలతో మోడీ ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తోందని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బృందాకరత్ అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 60 రోజులుగా రైతులు పోరాటం చేస్తున్నారనీ, ఇప్పటికే 150 మంది చనిపోయారనీ, నిఇంకా ఎంతమంది రైతుల రక్తాన్ని తాగుతారని ఆమె ప్రశ్నించారు. సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 'సీఏఏ, ఎన్ఆర్సీ, మూడు వ్యవసాయ చట్టాలు- ప్రజలు ముందున్న సవాళ్లు' అంశంపై వర్తక సంఘం భవన్లో జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సెమినార్కు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి బృందాకరత్ హాజరై మాట్లాడారు.
మూడు వ్యవసాయ చట్టాల్లో.. మొదటిది.. కార్పొరేట్లు ఇష్టమైన ధరలకు పంట ఉత్పత్తులను కొనే వెసులుబాలు కల్పించిదన్నారు. రెండో చట్టంతో రైతులు తమ వ్యవసాయ భూములను కార్పొరేట్కు అప్పగించి వారు సూచించిన పంటలను మాత్రమే వేయాల్సి ఉంటుందనీ, అత్యవసర సరుకులు దాచిపెట్టుకునే మూడో చట్టం ద్వారా రైతులు కాకుండా కార్పొరేట్లు లబ్దిపొందుతారని తెలిపారు. గతంలోనే ఈ చట్టాలను అరుణాచల్ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అమలు చేసిందన్నారు. అయితే ఆయా రాష్ట్రాల్లో కొన్ని సవరణలు చేసుకుని ఆచరణలో పెట్టారని తెలిపారు. ఎటువంటి సవరణలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా అమలు చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారనీ, అందుకే రద్దు చేయాలని రైతులు, రైతు సంఘాలు ఆందోళనలు చేస్తున్నారన్నారు. రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించే ఈ చట్టాలతో జరిగే నష్టాన్ని గుర్తించి వామపక్ష కేరళ ప్రభుత్వం వీటిని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. ఈ చట్టాలుపై ముందు వ్యతిరేకత ప్రదర్శించిన కేసీఆర్ ఆ తర్వాత వెనక్కి తగ్గారనీ, ఇప్పటికైనా కేసీఆర్ స్పష్టమైన వైఖరి తీసుకోవాలని సూచించారు. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో రైతులు జాతీయ జెండాలు కట్టిన లక్ష ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం మీద దాడి చేసే ఈ చట్టాలను వెనక్కుతీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చట్టాలను నిరసించినందుకు ఊప చట్టం కింద ప్రభుత్వం జైళ్లలో పెడుతుందన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఐక్యతతో ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.
తమ్మినేని మాట్లాడుతూ.. సీఏఏ, ఎన్ఆర్సీలతో మనస్మృతి అమలు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ దేశంలోనే ముస్లింలు జీవించకుండా.. ఒకవేళ జీవించినా జైళ్లలో మగ్గేలా, రాజ్యాంగ మౌలిక సూత్రాలను దెబ్బతీసేలా ఈ చట్టాలున్నాయన్నారు. చివరకు కోర్టులను కూడా బీజేపీ తన విధానాలకు అనుగుణంగా తయారు చేసుకుంటుందని విమర్శించారు. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఉద్యమించిన 16 మంది నాయకులు, 19 మంది యువకులను మోడీ ప్రభుత్వం జైళ్లలో వేసిందన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఒకరిద్దరు మంత్రులు మాత్రమే మాట్లాడుతున్నారనీ, కొంతమంది టీఆర్ఎస్ నాయకత్వం, కార్యకర్తలూ వీటిని వ్యతిరేకిస్తున్నాయనీ, అయినా కేసీఆర్, కేటీఆర్ వాటిపై మాట్లాడకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం పౌరహక్కుల కోసం ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఖమ్మంలో ఉదయం 10 గంటలకు పెవిలియన్గ్రౌండ్ నుంచి మోటార్సైకిల్ ర్యాలీ ప్రారంభిస్తున్నట్టు జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. సెమినార్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, యర్రా శ్రీకాంత్, ఎం.సుబ్బారావు, మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్యాణం వెంకటేశ్వర్లు, భూక్యా వీరభద్రం, బండి రమేష్, జిల్లా నాయకురాలు బుగ్గవీటి సరళ, గిరిజన సంఘం నాయకులు ధర్మా తదితరులు పాల్గొన్నారు.