Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుట్టుగా బాదేసిన మోడీ సర్కార్
- ఖాతాల్లో పడుతున్నది రూ.40
- సిలిండర్కు చెల్లిస్తున్నది రూ.831
- మరోసారి గ్యాస్ ధర పెంపు
హైదరాబాద్ : మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా...సబ్సిడీ మీ బ్యాంకు ఖాతాలో పడిందో లేదో చెక్ చేసుకున్నారా... తక్షణం ఓసారి బ్యాంక్ ఖాతాను పరిశీలించండి. 2020 జూన్ నుంచి మీ ఖాతాల్లో ఎంత సబ్సిడీ సొమ్ము పడిందో..మీ జేబుకు ఎంత చిల్లు పడిందో ఒక్కసారి లెక్కలు వేసుకోండి. గుండెలు బాదుకోక తప్పదు. కేంద్రంలోని మోడీ సర్కార్ గ్యాస్ సిలిండర్పై సబ్సిడీని క్రమంగా ఎత్తేసింది. ఇంకా నిర్థారణకు రాలేకపోతున్నారా...అయితే ఓసారి మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ను వివరణ అడగండి. మీ వంటింట్లో మంట ధర ఏమేరకు పెరిగిందో చెప్పేస్తారు. తొమ్మిది నెలలుగా వినియోగదారుల ఖాతాల్లో కేవలం 40.71 పైసలు మాత్రమే జమ అవుతున్నాయి. తాజాగా ఈ మార్చి 1వ తేదీ నుంచి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్పై మరో రూ.25 పెంచింది. కమర్షియల్ సిలిండర్ (19 కిలోలు)ధర రూ.95 పెరిగి, రూ.1,614కు చేరింది. హైదరాబాద్లో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.871.50 పైసలు. బ్యాంకు ఖాతాలో జమ అవుతున్న సొమ్ము రూ. 40.71 పైసలు. అంటే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్కు వినియోగదారుడు చెల్లిస్తున్న డబ్బు అక్షరాలా రూ.831.29 పైసలు. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో ప్రత్యక్ష నగదు బదిలీ పథకం (డీబీటీఎల్) ద్వారా గ్యాస్ వినియోగదారులకు చెల్లించిన సబ్సిడీ సొమ్ము రూ.2,573 కోట్లు. ద్వితీయ త్రైమాసికం (జులై-సెప్టెంబర్)లో ఆ సబ్సిడీ రూ.445 కోట్లకు తగ్గిపోయింది. మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో రూ.391 కోట్లు మాత్రమే వినియోగదారుల ప్రత్యక్ష నగదు బదిలీ పథకం (డీబీటీఎల్) ద్వారా చెల్లింపులు చేశారు. ఈ వివరాలన్నీ కేంద్రప్రభుత్వానికి చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పిపిఏసీ) వెల్లడించింది. దీనికి కొనసాగింపుగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే 16 సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.225 పెరిగింది.
ఎల్పీజీ వినియోగదారులెందరంటే..
ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒక కుటుంబానికి ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీపై అందిస్తుంది. దేశవ్యాప్తంగా 28 కోట్ల మంది ఎల్పీజీ వినియోగదారులు ఉంటే.. వారిలో కోటిన్నర మందికి సబ్సిడీ రాదు. మిగతా 26.5 కోట్ల మంది సబ్సిడీపై సిలిండర్ పొందుతున్నట్టు కేంద్ర పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ సంస్థలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) రికార్డులు ధ్రువీకరిస్తున్నాయి.
మోడీ గారడీ..
2013లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని(డీబీటీఎల్) ప్రారంభించింది. ముందు పూర్తి డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనాలి. ఆ తర్వాత లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ డబ్బులు పడేవి. గతంలో సిలిండర్ ధర రూ. 1000 ఉన్నప్పుడు కేంద్రం రూ.500 పైనే సబ్సిడీ ఇచ్చేది. కానీ ఇపుడు సబ్సిడీ భారీగా తగ్గిపోయింది. కొందరి ఖాతాల్లో రూ.40 పడితే..మరికొందరి ఖాతాల్లో ఆ డబ్బుకూడా పడటంలేదు.
పెట్రోలుదీ అదే దారి..
సబ్సిడీలను గణనీయంగా తగ్గిస్తున్న కేంద్రం 2021-22 ఆర్థిక సంవత్సరానికి పెట్రోలియం సబ్సిడీకి కేటాయింపుల్ని మూడింట రెండొంతులు తగ్గించింది. గతంలో పెట్రోలియం సబ్సిడీ రూ.40,915 కోట్లు కేటాయిస్తే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ సొమ్మును రూ.12,995 కోట్లకే పరిమితం చేసింది.
తగ్గిన రీఫిల్ బుకింగ్స్
మరోవైపు ఉజ్వల స్కీమ్ కింద లబ్దిదారుల సంఖ్య భారీగా పెరిగినా.. సబ్సిడీల్లో కోత, పెరిగిన సిలిండర్ ధరల వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు రీఫిల్ బుకింగ్కు వెనకాడుతున్నారు. గ్రామీణప్రాం తాల్లో మళ్లీ కట్టెల పొయ్యిలనే వినియోగిస్తున్నారు. పేరుకి 12 సిలిండర్లు సబ్సిడీ అని చెప్పినా..ఆ సంఖ్య ఆరేడుకు మించి ఉండట్లేదు.
సబ్సిడీ...నామ్కే వాస్తే..
పృధ్వి, ఇండేని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్, హైదరాబాద్
గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గతంలో మాదిరి సబ్సిడీ ఇవ్వట్లేదు. లబ్దిదారుల ఖాతాల్లో కేవలం రూ.40 మాత్రమే పడుతున్నది. డబ్బులు పడట్లేదని రోజు మా ఆఫీసులకు వచ్చి లొల్లి పెడుతున్నారు. సమాధానాలు చెప్పలేకపోతున్నాం. రీఫిల్ బుకింగ్స్ తగ్గుతున్నాయి. కరెంటు పొయ్యిల వాడకం పెరుగుతున్నది.