Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలను ఆదుకున్నవి ప్రభుత్వాస్పత్రులే:కరోనా కాలాన్ని గుర్తు చేసుకున్న మంత్రి ఈటల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా వచ్చిన ప్రారంభ కాలంలో ప్రజలకు వైద్యసేవలందించకుండా ప్రయివేటు ఆస్పత్రులను మూసేసుకుంటే ప్రభుత్వాస్పత్రులే ఆదుకున్నాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గుర్తుచేశారు. కరోనా మొదటి కేసు నమోదై ఏడాది పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనినాస్యాదవ్తో కలిసి ఈటల కరోనా వారియర్లను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రుల డాక్టర్లపై ఉన్న చెడు అభిప్రాయాన్ని పోగొట్టగలిగామని అన్నారు. కరోనా సోకిన వారికి సొంత కుటుంబ సభ్యులే సేవలందించేందుకు ముందుకు రాని పరిస్థితుల్లో వైద్యులు, నర్సులు సేవలందించారని చెప్పారు. ప్రత్యేక కరోనా ఆస్పత్రిగా కొనసాగిన గాంధీ ఆస్పత్రిలో సిబ్బందిని అంటరానివారిగా చూసినప్పటికీ కష్టపడి పని చేశారని తెలిపారు. వారాల తరబడి కుటుంబాలకు దూరంగా కరోనాపై పోరాటంలో భాగస్వాములయ్యారని కొనియాడారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది పడిన కష్టాన్ని ప్రభుత్వం గుర్తిస్తుందని హామి ఇచ్చారు. ఆలస్యం అవుతుందే కాని అన్యాయం జరగదన్నారు. వైద్యారోగ్యశాఖ సిబ్బందితో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందన్నారు. ప్రభుత్వ వైద్యులు ఇదే అంకితభావాన్ని భవిష్యత్తులోనూ కనబరచాలని కోరారు. గాంధీ ఆస్పత్రి ఇతర ఆస్పత్రులకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. పేద ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
అవయవమార్పిడి కేంద్రం....గాంధీ ఆస్పత్రి
గాంధీ ఆస్పత్రి భవిష్యత్తులో అవయవమార్పిడి కేంద్రంగా అవతరించబోతున్నదని ఈటల రాజేందర్ తెలిపారు. ప్రయివేటుకు వెళ్లే స్థోమత లేని పేదల కోసం రూ.35 కోట్లతో ఆర్గన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ ను నెలకొల్పుతున్నట్టు చెప్పారు. వైద్యారోగ్యశాఖలో గుణాత్మక మార్పు తీసుకొచ్చి ప్రజల నమ్మకం పెంచే చర్యలు తీసుకుంటున్నామన్నారు. గాంధీలోచనిపోయిన వారు ఏ కారణంతో చనిపోయారో ఒక రిపోర్టు తయారు చేయాలని ఆదేశించారు. ఆ నివేదిక భవిష్యత్తులో ఉపయోగపడుతుందని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ కె.రమేశ్రెడ్డి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు తదితరులు పాల్గొన్నారు.