Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాథమిక పాఠశాలల టీచర్లకు సర్కారు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యా యులు రోజూ బడికి హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన మంగళవారం ఆదేశాలు విడుదల చేశారు. ఇప్పటి వరకు ప్రాథమిక పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు రోజు విడిచి రోజు బడులకు హాజరయ్యే అవకాశముందని వివరించారు. బుధవారం నుంచి ప్రతిరోజూ ఉపాధ్యాయులందరూ హాజరు కావాలని కోరారు. అయితే రాష్ట్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలు (యూపీఎస్), హైస్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత ఉన్నచోట ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న వారి సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు. యూపీఎస్, హైస్కూళ్లలో బోధించేలా చర్యలు తీసుకోవాలని ఆర్జేడీలు, డీఈవోలను కోరారు. దీంతో రాష్ట్రంలో విద్యావాలంటీర్ల నియామకం లేనట్టేనని అర్థమవుతున్నది. ఏటా వారిని తీసుకున్న ప్రభుత్వం భౌతిక తరగతులు ప్రారంభమైనా, ఉపాధ్యాయుల కొరత ఉన్నా వారిని నియమించకపోవడం గమనార్హం. హైస్కూళ్లలో డిప్యూటేషన్లను తిరస్కరించాలని తెలంగాణ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్పీటీఏ) అధ్యక్షులు సయ్యద్ షౌకత్అలీ, ప్రధాన కార్యదర్శి ఎన్ చెన్నరాములు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. బడులకు హాజరయ్యేందుకు అభ్యంతరం లేదనీ, ఉన్నత పాఠశాలల్లో డిప్యూటేషన్లపై తమను పంపిస్తే సహించేది లేదని హెచ్చరించారు.