Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెవెన్యూ ట్రిబ్యునళ్ల కేసులో హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణలో జిల్లాల వారీగా రెవెన్యూ ట్రిబ్యునళ్లలో పెండింగ్ కేసుల వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఎన్ని కేసులు బదిలీ చేశారో, ఎన్ని పరిష్కారించారో, ఇంకా ఎన్ని కేసులు విచారణలో ఉన్నాయో.. వంటి పూర్తి వివరాలను పట్టిక రూపంలో అందజేయాలని కోరింది. దీనిపై ఈనెల 18లోగా నివేదిక ఇవ్వాలంది. విచారణ లేకుండానే రెవెన్యూ ట్రిబ్యునళ్లలో వివాదాలను తేలుస్తున్నాయని కొత్తగూడెంకు చెందిన శ్రీనివాసరావు వేసిన పిల్ను మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ బి విజరుసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రతివాదులకు నోటీసులు ఇవ్వకుండా కేసుల్ని పరిష్కరించడం సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమని అభిప్రాయపడింది. కౌంటర్లు వేశాకే ట్రిబ్యునళ్లు కేసుల్ని పరిష్కరించాయని ఎజి బిఎస్ ప్రసాద్ చెప్పడంపై స్పందించిన హైకోర్టు.. అయినా సరే తుది నిర్ణయం తీసుకునేప్పుడు ఇరుపక్షాలకు లేదా వాళ్ల న్యాయవాదులకు నోటీసులు ఇవ్వాలని సూచించింది. రెవెన్యూ ట్రిబ్యునళ్లలో ఇరువైపుల వాదనలకు అవకాశం ఇవ్వాలనీ, విచారణ తర్వాతే వివాదాలు పరిష్కరించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. కేసుల పెండింగ్ తగ్గించే ప్రయత్నం బాగానే ఉందనీ, అయితే అది చట్టప్రకారం ఉండాలని చెప్పింది. రెవెన్యూ అధికారుల వద్దనున్న పెండింగ్ ఫిర్యాదులన్నీ ట్రిబ్యునళ్లకు బదిలీ చేసినట్టు ఎజి చెప్పారు. చాలా కేసులు పరిష్కారం అయ్యాయన్నారు. దీనిపై అభ్యంతరాలుంటే ట్రిబ్యునళ్లలో దరఖాస్తు చేసుకుంటే వాటి పరిశీలనకు ఆస్కారం ఉందని హామీ ఇచ్చారు. ఈ హామీని నమోదు చేసుకున్న హైకోర్టు.. ఏదైనప్పటికీ వాదనలు పూర్తి స్థాయిలో ఇరుపక్షాలవీ వినాలని చెప్పింది. పిటిషనర్ లాయర్ వాదిస్తూ, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకుండా కేసును వాయిదా వేస్తే అప్పటిలోగా అన్ని కేసుల్ని ట్రిబ్యునళ్లు పరిష్కరించినట్టు ప్రకటిస్తాయన్నారు. ఏజీ హామీ తర్వాత హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.
సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్కు జైలుశిక్ష
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన అనంతగిరి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయరాదనీ, రైతుల భూములు ముంపునకు గురిచేయరాదన్న ఉత్తర్వుల్ని అమలు చేయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ డి కష్ణ భాస్కర్, జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాష, భూసేకరణ అధికారి శ్రీనివాసరావులకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. మూడు నెలల సాధారణ
జైలు, రూ.2 వేలు జరిమానా విధించింది. ఈ తీర్పుపై అప్పీల్కు వీలుగా అమలును నాలుగు వారాలపాటు సస్పెండ్ చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్. రామచంద్ర రావు ఇటీవల తీర్పు వెలువరించారు.
ఖమ్మం కలెక్టర్పై హైకోర్టు ఆగ్రహం
కోర్టు ధిక్కార కేసులో రూ.500 జరిమానా చెల్లించాలన్న తీర్పును సవాల్ చేసిన ఖమ్మం జిల్లా కలెక్టర్ కర్ణన్పై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సింగిల్ జడ్జి ఒక నిర్ణయానికి వచ్చి జరిమానా విధించారంటూ న్యాయమూర్తిపై అపవాదులు చేయడాన్ని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, న్యాయ మూర్తి జస్టిస్ బి విజరుసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం తప్పుపట్టింది. కలెక్టర్ కర్ణన్, ప్రభుత్వ లాయర్లపై కోర్టు ధిక్కార చర్యలు తీసు కుంటామని ప్రకటించింది.