Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్షణమే అరెస్టు చేయాలి
- కేవీపీఎస్ రౌండ్టేబుల్ వక్తల డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆవు మాంసం తినే వారిని అవమానించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను తక్షణమే అరెస్టు చేయాలని కేవీపీఎస్ రౌండ్టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడనీ, స్పీకర్ స్పందించి శాసనసభ్యత్వాన్ని బహిష్కరించాలని చెప్పారు. ఆయనపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. రాజాసింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ త్వరలోనే గవర్నర్, స్పీకర్, హోంమంత్రి, డీజీపీ, అన్ని రాజకీయ పార్టీల శాసనసభాపక్ష నేతలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను కలిసి ఫిర్యాదు చేయాలనీ, వినతిపత్రాలు సమర్పించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో జరుగుతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. 'ఆవు మాంసం తినే లం...కొడుకులు అంటూ దళితులను బూతులు తిట్టిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, తక్షణమే అరెస్టు చేయాలి'అని డిమాండ్ చేస్తూ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. నియోజకవర్గ కేంద్రాల్లో అన్ని సామాజిక ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలతో రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహించాలనీ, మండల కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్బాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించారు. ముఖ్యఅతిధిగా హాజరైన ఐఆర్టీ ఎస్ రిటైర్డ్ అధికారి భరత్ భూషణ్, ఓయూ ప్రొఫెసర్ ముత్తయ్య, టీపీఎస్కే రాష్ట్ర కన్వీనర్ జి రాములు, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాన్వెస్లీ, మాలమహానాడు జాతీయ అధ్యక్షులు బి చెన్నయ్య, మాలమహానాడు జాతీయ అధ్యక్షులు ఎ రాములు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో బంధు సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు వీరస్వామి, అంబేద్కర్, ఫూలే యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి కిరణ్, మహిళా కన్వీనర్ బి స్వాతి, ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీల వేదిక రాష్ట్ర నాయకులు ఇందిరా, వీణ, బీఎస్పీ నాయకురాలు శాంత, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బొల్లి స్వామి, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్బాస్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి, టీపీఎస్కే డైరెక్టర్ పవన్కుమార్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్ర హం ప్రతిష్టించాలని ఒంటరిగా పోరాడి విజయం సాధించిన ఖమ్మం జిల్లా కేవీపీఎస్ నాయకులు మట్టి దుర్మాప్రసాద్కు కేవీపీఎస్ రౌండ్టే బుల్లో శాలువా కప్పి, కేవీపీఎస్ డైరీ బహుకరించి సన్మానం చేశారు.