Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేదంటే బండి సంజయ్ వాగుడు మానుకోవాలి :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మాట్లాడి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)ను మంజూరు చేయించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. కానీ ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాగడం మానుకోవాలని సంజయ్ ని కోరింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత యుపీఏ ప్రభుత్వం హైదరాబాదు, బెంగుళూరులో ఐటీఐఆర్ను ప్రకటించిందని గుర్తు చేశారు. కానీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకొచ్చిన తర్వాత గత ఏడేండ్ల నుంచి దాని అమలుకు పూనుకోకుండా నిలిపివేసిందని విమర్శించారు. గతంలోనే ఏర్పాటు చేసి ఉంటే వేలాది కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చి వందలాది ఐటీ పరిశ్రమల ఏర్పాటుతో లక్షల మందికి నిరుద్యోగులకు ఉపాధి లభించేదని వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్కు ఐటీహబ్గా మరింత గుర్తింపు వచ్చి, ఆర్థికంగా అభివద్ధి చెందేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ఐటీఐఆర్ పథకాన్ని నిలిపేసి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర ఎంపీలు, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి దాని అమలుకు అవసరమైన చర్యలు తీసుకోకుండా అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీలు రాష్ట్ర విభజన హామీలు సాధించడంలో విఫలమయ్యారని విమర్శించారు. దీనికి తోడు ఐటీఐఆర్నూ అదే బాటలోకి నెట్టారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి మోడీతో ఐటీఐఆర్ పథకాన్ని ప్రకటింపజేసే విధంగా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తోపాటు బీజేపీ ఎంపీలు ప్రయత్నించాలని డిమాండ్ చేశారు.