Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఈటల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కోవిడ్-19తో మరణించిన వారిలో స్థూలకాయులే ఎక్కువ మంది ఉన్నారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వరల్డ్ ఒబేసిటీ డే సందర్భంగా బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలను వంటింట్లో ఉండే పోపుల పెట్టే కాపాడిందన్నారు. ఊబకాయం అనేక రుగ్మతలకు కారణమవుతున్నదనీ, సాంకేతికత సుఖంతో పాటు శ్రమను తగ్గించటంతో జబ్బులను తీసుకొచ్చిందన్నారు. రోజూవారీ పనితో పాటు వ్యాయామం చేయటం మంచిదని సూచించారు. జీవనశైలిలో మార్పే ఇలాంటి విపరిణామానికి కారణమన్నారు. బేరియాట్రిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ వై.కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆసుపత్రి సీఈఓ జసదీప్ సింగ్ మాట్లాడుతూ నూనె వినియోగం పెరగడం, బయట తిండికి అలవాటు పడటం, కూర్చునే పనులు చేసే వారు తీసుకోవాల్సిన 1300 క్యాలరీల ఆహారం కంటే ఎక్కువగా 1600 నుంచి 2000 క్యాలరీలు తీసుకోవడమే సమస్యకు మూలమన్నారు. ఆస్పత్రి సీఓఓ డాక్టర్ రాహుల్ మెదక్కర్ తదితరులు పాల్గొన్నారు.