Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పుల్కల్
అన్యాయంగా తనను విధుల నుంచి తొలగించారని మనస్తాపం చెందిన మిషన్ భగీరథ కార్మికుడు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ సృష్టించాడు. చివరికి పోలీసుల చొరవతో కాంట్రాక్టర్ వచ్చి హామీ ఇవ్వడంతో కార్మికుడు కిందకు దిగాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని రాయిపాడు గ్రామ సమీపంలో జరిగింది.బాధితుడు, తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. తలారి రాములు మండలంలో ఏడు సంవత్సరాల నుంచి మిషన్ భగీరథ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే, 8 నెలల నుంచి కార్మికులకు కాంట్రాక్టర్ జీతాలు ఇవ్వట్లేదు. దాంతో బకాయి డబ్బులు ఇవ్లాలని కాంట్రాక్టర్ను తలారి రాములు కోరాడు. ఈ క్రమంలో అతన్ని రెండ్రోజుల కిందట విధుల నుంచి తొలగించారు. మనస్తాపానికి గురైన రాములు గురువారం రాయిపాడు గ్రామ సమీపంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు పైకి ఎక్కాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకోగా, తమ కాంట్రాక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు దిగనని కార్మికుడు తెగేసి చెప్పాడు. కాంట్రాక్టర్కు పోలీసులు ఫోన్ చేసి విషయం తెలపడంతో ఆయన ఘటనా స్థలానికి చేరుకుని తోటి కార్మికులతో చర్చించాడు. తొలగించిన కార్మికున్ని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు ఒప్పుకోవడంతో రాములు కిందకు దిగి వచ్చాడు. అనంతరం పుల్కల్ పోలీస్స్టేషన్లో కాంట్రాక్టర్, కార్మికుడి మధ్య ఒప్పంద పత్రం రాయించారు.