Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19న యాజమాన్యానికి సమ్మె నోటీసు :యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యుత్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. ఇందుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. ఇందులో భాగంగా ఈనెల 9న విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్కు పంపిస్తామని యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు భూపాల్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.కుమారాచారి, కె.గోవర్థన్, ఉపాధ్యక్షుడు కె.ఈశ్వరరావు తెలిపారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ... ఈనెల 22న డీఈ, ఎస్ఈలకు సమ్మె నోటీసును ఇస్తామని వివరించారు. విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న పర్మినెంట్, ఆర్టిజన్, అన్మెన్, పీస్రేట్ కార్మికుల సమస్యలు ఏండ్ల తరబడి అపరిష్కృతంగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పర్మినెంట్ ఉద్యోగులకు సంబంధించిన ఈపీఎఫ్, జీపీఎఫ్ సమస్యలను వెంటనే పరిష్కరిస్తా మంటూ గతంలో వేలాది మంది ఉద్యోగుల సమక్షంలో సీఎం హామీనిచ్చా రని గుర్తు చేశారు. ఆయన హామీ ఇప్పటికీ అమలు కాలేదని తెలిపారు. 23,600 మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై ఇచ్చిన వాగ్దానం కూడా ఇదే రకంగా పక్కకు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్టాండింగ్ ఆర్డర్స్ రూపంలో ప్రత్యేకమైన సర్వీస్ నిబంధనలను తీసుకొచ్చి రెగ్యులరైజేషన్ అనే పదాన్ని ప్రభుత్వం అపహాస్యం చేసిందని వారు విమర్శించారు. కార్యక్రమంలో యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శులు జె.బస్వరాజు, కె.రమేశ్, రవి పాల్గొన్నారు.