Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాగేశ్వర్, బి.జయసారథిరెడ్డికి ఉద్యోగ, కార్మిక, రైతు సంఘాల మద్దతు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలను ప్రశ్నించే వారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఓటేసి గెలిపించాలని ఉద్యోగ, కార్మిక, రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్నగర్ స్థానంలో ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో జర్నలిస్టు బి.విజయసారథిరెడ్డికి మొదటి ప్రాధాన్యతా ఓటువేసి గెలిపించాలని కోరాయి.
హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హమాలీ కార్మికుల ఫెడరేషన్ల జేఏసీ (ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ) సమావేశం గురువారం జరిగింది. హమాలీ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజు, హమాలీ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాలడుగు భాస్కర్, పి.సుధాకర్, హమాలీ యూనియన్(ఐఎఫ్టీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం మాట్లాడారు. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అర్హులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ జరిగిన ప్రత్యక్ష పోరాటాల్లో నాగేశ్వర్ హమాలీ కార్మికుల పక్షాన నిలిచారని గుర్తుచేశారు. విజయసారధిరెడ్డి జర్నలిస్ట్గా ప్రజా సమస్యలను వెలికితీస్తూ వాటి పరిష్కారం కోసం ఉద్యమిస్తున్నారని తెలిపారు. అనేక రంగాల్లో వస్తున్న కార్మిక సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాన్ని చూపుతూ చట్ట సభల్లో ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలను ప్రశ్నించేందుకు వారిద్దరినీ గెలిపించాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్(సీఐటీయూ) మద్దతు
ఉద్యోగుల హక్కులతో పాటు మధ్యతరగతి, పేద ప్రజల సమస్యలపై శాస్త్రీయంగా విశ్లేషించడమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై నిజాయితీగా, నికరంగా పోరాడుతున్న కె.నాగేశ్వర్కు ప్రతి మధ్యాహ్న భోజన కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులు, పట్టభద్రులు నాగేశ్వర్కు మద్దతుగా నిలవాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్ ప్రవీణ్కుమార్, ప్రధాన కార్యదర్శి ఎస్.రమ పిలుపునిచ్చారు. మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని విన్నవించారు.
తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్టు ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పోస్టరావిష్కరణ
ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల స్థానంలో కె.నాగేశ్వర్, ఉమ్మడి నల్లగొండ - ఖమ్మం - వరంగల్ జిల్లాల్లో పోటీ చేస్తున్న వామపక్ష పార్టీలు బలపర్చిన సీపీఐ అభ్యర్ధి జయసారధి రెడ్డిని గెలిపించాలని కోరుతూ తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జెంజిరాల శ్రీనివాస్, వంగూరు రాములు, కార్యదర్శి కె.రమేశ్ మాట్లాడారు. మిషన్ భగీరథ కార్మికుల సమస్యలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికుల సమస్యలపై, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, కార్మికులకు అండగా నిలుస్తున్న వారిద్దరినీ గెలిపించాలని కోరారు.
రైతు సంఘం ఆధ్వర్యంలో పోస్టరావిష్కరణ
ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ను గెలిపించాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పోస్టర్ను గురువారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జంగారెడ్డి, టి.సాగర్, సహాయ కార్యదర్శి మూఢ్శోభన్ నాయకులు ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని జరుగుతున్న పోరాటానికి నాగేశ్వర్ మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. రైతు పక్షపాతి నాగేశ్వర్ను పట్టభద్రులు గెలిపించాలని పిలుపునిచ్చారు.