Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయా శాఖల్లో రిటైరీలకు కీలక పదవులు
- ప్రమోషన్ల కోసం ఎదురుచూపులు
- నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల పడిగాపులు
- ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగాల భర్తీపై చర్చ
- లబ్దిపొందేందుకు టీఆర్ఎస్, బీజేపీ వ్యూహాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆ శాఖల్లో వాళ్లదే హవా.. వాళ్లు చెప్పిందే వేదం. చేసిందే పని. వాళ్లకే ప్రభుత్వ పెద్దల నుంచి పుష్కలంగా అందడండలు. వారికే అన్ని అధికారాలు. వాళ్లెవరు అనుకుంటున్నారా? వాళ్లే ఉద్యోగ విరమణ పొంది కీలక పదవులను అనుభవిస్తున్న వెటరన్ అధికారులు. వీరి కారణంగా కింది స్థాయి అధికారులు, ఉద్యోగులకు ప్రమోషన్లు రాకపోవడంతోపాటు నిరుద్యోగులకు ఆటంకంగా మారారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలే కారణం. ప్రమోషన్లు రావాల్సిన అధికారులను వదిలిపెట్టి ఉద్యోగ విరమణ పొందిన వాళ్లకు పెద్దపీఠ వేశారు.
ఈ అధికారుల చర్యలు ప్రస్తుతం ఇతర అధికారులకూ పెద్ద సమస్యగా మారాయి. నీటిపారుదల శాఖ, గ్రామీణ నీటి సరఫరాశాఖ, ప్రజారోగ్యశాఖ, పంచాయతీరాజ్శాఖ, రోడ్డు, భవనాల శాఖ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, వాటర్బోర్డు, పోలీసు శాఖల్లో ఉద్యోగ విరమణ పొందిన అధికారులే కీలక పదవుల్లో ఉన్నారు.
వాళ్లే.. వీళ్లు..
నీటిపారుదల శాఖలో మురళీధర్రావు, ఎన్.వెంకటేశ్వర్లు, నర్సిం హ్మన్, హమీద్ఖాన్, బంగారయ్య, వేణు, రోడ్డు భవనాల శాఖలో గణపతిరెడ్డి, రవీందర్రావు, పంచాయతీరాజ్ శాఖలో సత్యనారాయణరెడ్డి, రాజశేఖర్రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, జలందర్, గ్రామీణ నీటిసరఫరా శాఖలో కృపాకర్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, చెన్నారెడ్డి, వినిబాదేవి, చక్రవర్తి, ప్రజారోగ్యశాఖలో ఆర్.ధన్సింగ్, వాటర్ బోర్డులో ఎం.సత్యనారాయణ, మెట్రోరైలు ప్రాజెక్టుల్లో ఎండీ ఎన్వీఎస్రెడ్డి, ఆనంద్మోహన్, రాజేశ్వర్రావు, జీహెచ్ఎంసీలో 30మందికిపైగా అధికారులు ఉన్నారు. ఈ అధికారులు సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు. లక్షల్లో వేతనాలు తీసుకుంటున్నారు. సర్వీస్లో ఉన్న అధికారులకు కూడా లేని సౌకర్యాలు, అధికారాలు వీరికి కేటాయించారంటే మామూలు విషయం కాదు.
వాటర్ బోర్డులో అంతా ఆయనే..
గ్రేటర్ హైదరాబాద్తోపాటు అవుటర్ రింగ్ రోడ్డు లోపలి గ్రామాలకు సైతం తాగునీరు సరఫరా చేస్తున్న వాటర్బోర్డులో ఉద్యోగ విరమణ పొంది ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్గా ఉన్న ఎం.సత్యనారాయణ అంతా నడిపిస్తున్నారు. ఆయన వల్ల నలుగురు అధికారులకు ప్రమోషన్లు ఆగిపోయాయి. ప్రమోషన్ వచ్చే కాలానికి రిటైర్మెంట్ అవుతారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత మూడు సార్లు(6ఏండ్లు) కొనసాగింపు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. 'నాకు కేసీఆర్, కేటీఆర్ డైరెక్ట్గా అపాయింట్మెంట్ ఇస్తారు' అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. వాటర్బోర్డు మేనేజింగ్ డైరెక్టర్గా ఐఏఎస్ అధికారి ఉన్నా.. కార్యాలయాల వ్యవహారాలతోపాటు కాంట్రాక్టర్లతో సమావేశాలు ఈయనే నిర్వహిస్తారు. సర్కార్ బంగ్లాలో రాజభోగాలు అనుభవిస్తున్నారని వాటర్బోర్డు ఉద్యోగులు చెబుతున్నారు.
నోటిఫికేషన్లు కరువు
ప్రభుత్వ శాఖల్లో సీనియర్ అధికారులు రిటైరైతే కింది స్థాయి అధికారులకు ప్రమోషన్లు వస్తాయి. దీంతో కొన్ని పోస్టులు ఖాళీ అవుతాయి. ఫలితంగా కొత్తగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి అవకాశముంటుంది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం రిటైర్మెంట్ అయిన వాళ్లపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుందనే విమర్శలూ లేకపోలేదు. పైగా టీఆర్ఎస్ ప్రభుత్వం 1.32లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్టు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెబుతున్నారు. కానీ నికరంగా ఇచ్చింది 66,189ఉద్యోగాలేనని సీనియర్ అధికారులు చెబుతున్నారు. మిగిలినవన్నీ ప్రమోషన్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడంతోపాటు కొన్ని ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పురోగతిలో ఉంది. అయితే, 2014నాటికి తెలంగాణలో 14లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీలో వన్టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న లెక్కల ప్రకారం 30లక్షల మంది నిరుద్యోగులు, అనధికారికంగా 50లక్షల వరకు ఉంటారని అంచనా. పీఆర్సీ నివేదికలో 1.90లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది. ఆరేండ్లలో గ్రూప్-1 నోటిఫికేషన్ రాలేదు. గ్రూప్-2లో 1032 పోస్టులను భర్తీ చేశారు. రాష్ట్రంలోని 12 యూనవర్సిటీల్లో 1800 మంది టీచింగ్, సుమారు 20వేల మంది నాన్టీచింగ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సమాచారం.
ఉద్యోగాల భర్తీ ఇలా...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 జూన్ 2 నుంచి 2020 డిసెంబర్ 16 వరకు మూడు కేటగిరీల్లో 1,50,326 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. వీటిలో 1,32,899 ఉద్యోగాల ఖాళీలను ప్రభుత్వం నోటిఫైడ్ చేసింది. వీటిలో 1,26,641 ఉద్యోగాలను భర్తీ చేసినట్టు, మరో 23,685 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పురోగతిలో ఉందని వెల్లడించింది. వీటిలో టీఎస్పీఎస్సీ ద్వారా 30,594, తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 31,972, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యూకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 3,623 ఉద్యోగాలను భర్తీ చేశారు. డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా 11,278, ఇతర శాఖల్లో క్రమబద్ధీకరణ ద్వారా మరో 49,174 ఉద్యోగాలను భర్తీ చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది.
ఉద్యోగాల పేరుతో టీఆర్ఎస్, బీజేపీ యత్నం
నిరుద్యోగులను మరోసారి మోసం చేయడానికి టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు యత్నిస్తున్నాయి. దేశంలో ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించిన బీజేపీ సర్కార్ కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా నోట్ల రద్దు, జీఎస్టీ, సంస్కరణల పేరుతో లక్షలాది ఉద్యోగాలను ఊడ పీకింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ లక్ష ఉద్యోగాలంటూ ప్రకటనలు గుప్పించి తప్పుడు లెక్కలు చెబుతుంది. పైగా ఉద్యోగాల భర్తీపై చర్చలంటూ ఉస్మానియా విశ్వవిద్యాల యం వేదికగా టీఆర్ఎస్, బీజేపీ డ్రామా ఆడుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ది పొందడానికి కుట్రలు చేస్తున్నాయి.
సర్కార్వి తప్పుడు లెక్కలు
ఎ.విజయ్ కుమార్- డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఉద్యోగ నియామకాలపై సర్కార్ చెబుతున్న లెక్కలు తప్పుల తడక. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించిన పోస్టులను నియామకాల్లో చూపించడం అన్యాయం. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఉన్న ఉద్యోగులను రోడ్డున పడేసింది బీజేపీ. ఈ రెండు పార్టీల డ్రామాలను నిరుద్యోగులు తిప్పికొట్టాలి.
టీఎస్పీఎస్సీలోనే ఖాళీలు
మానవతరాయ్- నిరుద్యోగ జేఏసీ చైర్మెన్
ఉద్యోగాలను భర్తీ చేసే టీఎస్పీఎస్సీలోనే 150పోస్టులు ఖాళీగా ఉంటే నోటిఫికేషన్లు ఎలా వేస్తారు. రాష్ట్రంలో 3.53లక్షల ఉద్యోగాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం 'నిధులు-నీళ్లు-నియామకాలు' నినాదంతో జరిగింది. నియామకాలేవీ?. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తోంది.