Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రానున్న మేలో ఆలయ పున:ప్రారంభానికి అవకాశం : సీఎం కేసీఆర్
- ఆరు గంటలపాటు సాగిన యాదాద్రి ఆలయ పరిశీలన
- నిర్వాసితులతో గంటపాటు సమావేశం
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రి ఆలయం దేశంలోని ఇతర ఆలయాలకు ఆదర్శంగా ఉండాలని, సందర్శకులకు వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి వచ్చిన అనుభూతి కలగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను గురువారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ పరిశీలించారు. సుమారు ఆరు గంటలకు పైగా ఆలయ ప్రాంగణంతోపాటు కొండ చుట్టూ నిర్మిస్తున్న రహదారి, అద్దాల మండపాన్ని పరిశీలించారు. ఆలయ నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయని.. సర్వాంగ సుందరంగా తుది మెరుగులతో తీర్చిదిద్దుకుంటే రానున్న మే నెలలో పున్ణప్రారంభం చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. సీఎం తొలుత బాలాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. మెయిన్ టెంపుల్లో ఘట్టాలను చూసి అధికారులను అభినందించారు. కొండ చుట్టూ రోడ్లు, లకీë పుష్కరిణి పనులను సీఎం పరిశీలించారు. ఆలయ చుట్టూ ప్రహరీకి మరింత శోభ వచ్చేలా, ప్రాచీన చిత్రకళ ఉట్టిపడేలా బ్రాస్ మెటల్తో సుందరంగా తయారు చేయాలన్నారు. తుది మెరుగులు దిద్దుతున్న నేపథ్యంలో, దేశంలోని వివిధ ఆలయాల్లోని శిల్ప సంపద ఎలా ఉందో చూసి రావాలని అధికారులకు సూచించారు.
మూలవిరాట్టుకు అభిషేకం చేసే సందర్భంలో పూజా కార్యక్రమాలు సందర్శకులకు స్పష్టంగా కనిపించేలాగా ప్రధాన ద్వారం వద్ద అడ్డంకులు లేకుండా చూడాలని సీఎం సూచించారు. అత్యద్భుత కళాఖండాన్ని తీర్చిదిద్దుతున్నప్పుడు హడావిడి పడకూడదన్నారు. స్వచ్ఛత, పరిశుభ్రత విషయంలో యాదాద్రి దేశంలోని ఇతర దేవాలయాలకు ఆదర్శంగా ఉండాలని, ఇందుకోసం అవసరమైన మేరకు ఉద్యోగులను నియమించుకోవాలను అధికారులతో చెప్పారు. యాదాద్రిలో గెస్ట్హౌస్ లిఫ్టులు ఇంకా పూర్తికాకపోవడం పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
పేద బ్రాహ్మణ పెద్దలకు మండప నిర్మాణం..
ఉద్యోగ విరమణ పొందిన పూజారులు, పేద బ్రాహ్మణ పెద్దలు తమ భుక్తినీ వెల్లదీసుకునేలా, వారి జీవన భృతిని కొనసాగించేలా మండపం నిర్మాణం ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం పూరీ ఆలయాన్ని సందర్శించి రావాలన్నారు. యాదాద్రి పరిసర ప్రాంతాల్లో పూజారులు సహా, ఆలయ సిబ్బంది నివసించేందుకు అనువైన ఇండ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. శిల్పులకు కూడా ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని సీఎం ఈ సందర్భంగా చెప్పారు.
నిర్వాసితులతో సమావేశం
3.57 గంటలకు సీఎంతో ప్రత్యేకంగా సమావేశం కావడానికి యాదగిరిగుట్ట ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి నేతృత్వంలో 25మంది నిర్వాసితులను కొండపైకి తీసుకొచ్చారు. కానీ, ఈలోపు కొండ కిందకు వచ్చిన కేసీఆర్ నూతనంగా నిర్మించబోయే బస్టాండ్ ప్రాంగణాన్ని పరిశీలించారు. అక్కడే నిర్వాసితులతో గంటపాటు సమావేశం నిర్వహించారు. మెయిన్ రోడ్డు (వైకుంఠ ద్వారం నుంచి పాతగుట్ట చౌరస్తా వరకు) వెంట ఉన్న ఇండ్లను కూల్చివేత అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ప్రతి దుకాణదారునికీ వెయ్యి అడుగులతో (స్లాబ్ ఏరియా) షాపు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. అది కూడా కొత్తగా నిర్మించనున్న బస్టాండ్ ఆవరణలోనే అని సీఎం ప్రకటించారు. మొదటగా కొండపైన దుకాణదారులకు కొత్త బస్టాండ్ ఆవరణలోనే కింద నిర్మాణం చేసి లీజు ఇస్తామని సీఎం ప్రకటించారు. ఇండ్లను కోల్పోతున్న నిర్వాసితులకు సైదాపురం రెవెన్యూ పరిధిలో ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్సీ ఎలిమినేటి క్రిష్ణారెడ్డి, తీగల క్రిష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.