Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న
- ఆర్థిక, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులు వివరణివ్వాలి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరీంనగర్లోని జిల్లా పరిషత్ పాఠశాలల్లో స్వీపర్లుగా పని చేస్తున్న ఎమ్డీ ఖాశీం, మరో 45 మందికి మినిమం టైం స్కేల్ కింద నెలకు రూ.13 వేల చొప్పున జీతం చెల్లించాలంటూ ఉత్తర్వులిస్తే ఎందుకు అమలు చేయలేదంటూ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి ఈనెల 26న జరిగే విచారణకు ఆర్థిక, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్ స్వయంగా హాజరై వివరణివ్వాలంటూ ఆదేశించింది. 2018లో తమకు అనుకూలంగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం లేదని పేర్కొంటూ బాధితులు దాఖలు చేసిన కోర్టు ధిక్కార కేసుకు సంబంధించి ప్రతివాదులైన ఆ ఇద్దరు ఉన్నతాధికారులు ఇకపై ప్రతి విచారణకు హాజరుకావాలంటూ న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచందర్రావు ఆదేశించారు. పంజాబ్- జగజీత్సింగ్ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను నాలుగు వారాల్లోగా అమలు చేయాలంటూ 2018లో హైకోర్టు ఆదేశించినా అమలు కాలేదని ఖాశీంతోపాటు ఇతరులు తాజాగా న్యాయస్థానంలో కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. నెలకు రూ.1,623 నుంచి రూ. నాలుగు వేల వరకూ స్వీపర్లకు జీతాలు ఇస్తున్నారని తెలిపారు. అయితే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న ప్రస్తుత తరుణంలో ఈ జీతం ఏ మూలకూ సరిపోక బతుకు భారంగా మారిందనే విషయాన్ని వారి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో మినిమం టైం స్కేల్ను ఎందుకు అమలు చేయలేదనే విషయాన్ని ఈనెల 26న ఉదయం 10.30 గంటలకు జరిగే విచారణ సమయంలో చెప్పాలంటూ ఆర్థిక, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులను హైకోర్టు ఆదేశించింది.